భారతీయ తెగల్లో ఎక్కడా నియంతృత్వ పోకడలు లేవు. వారి స్వయంపాలక వ్యవస్థలు అన్నీ ప్రజాస్వామ్యయుతంగానే ఉన్నాయి. అందుకు నిదర్శనం మధ్య, దక్షిణ, ఈశాన్య భారతాల్లో ఉన్న సంప్రదాయ ఆదివాసీ రాజకీయ సంస్థలే. ప్రస్తుత వ్యాసం భారతదేశం మధ్య, దక్షిణ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ రాజకీయ సంస్థల నిర్మాణం పని విధానాన్ని చర్చిస్తుంది.
మధ్యభారత దేశంలో ఉన్న మధ్యప్రదేశ్, ఒరిస్సా, బీహార్ రాష్ల్రాలో నివసించే గిరిజనులు సంఖ్యాపరంగా ఇతర ప్రాంతాల కన్నా ఎక్కువ. గ్రామపెద్దల మండలి సహాయంతో గ్రామ నాయకుడు గిరిజన గ్రామాలను పరిపాలిస్తుంటాడు. ఈ గ్రామ పెద్దలు ఏకాభిప్రాయం ద్వారా గానీ, మెజారిటీ అభిప్రాయం ద్వారా గానీ నిర్ణయాలు చేస్తారు. వీరి నిర్ణయాన్ని తోసిపుచ్చే అధికారం గ్రామ నాయకునికి లేదు. ఈ ప్రాంతాల్లో నివసించే వారిలో అత్యధిక సంఖ్యాకుల్లో ఓరాన్లు, గోండులు, భిల్లులు 'పర్హా' అనే రాజకీయ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇరుగు పొరుగు గ్రామాలు కలిసి ఒక సమాఖ్యగా ఏర్పడి పర్హాను ఏర్పరచుకుంటాయి. పర్హాపంచ్ అనే కేంద్రీయ సంస్థకు ఈ పర్హాలు అనుబంధంగా ఉంటాయి. ప్రతి ఓరాన్ పర్హాలోను అనేక గ్రామాలుంటాయి. ఈ గ్రామాల్లో ఒకదాన్ని రాజా గ్రామం, మరో గ్రామాన్ని దివాన్ గ్రామం, ఇంకొక గ్రామాన్ని పవ్రే (రాజు దగ్గర గుమస్తా) గ్రామం, వేరొకదాన్ని కొత్వాల్ గ్రామం అని పిలుస్తారు. ఈ నాలుగు రకాల గ్రామాలు కాకుండా మిగిలిన గ్రామాలను ప్రజాగ్రామాలుగా వ్యవహరిస్తారు. పర్హాకు రాజా గ్రామం నేతృత్వం వహిస్తూ కీలక నాయకత్వ పాత్ర వహిస్తుంది. పర్హాలో పనిచేసే ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన హౌదా తెలిపే బ్యాడ్జీలు ఉండేవి (ప్రస్తుతం అవి లేవు). అట్లాగే పర్హాలోని ప్రతి గ్రామానికి ప్రత్యేకమైన జండా, బ్యాడ్జీ ఉంటాయి. ఈ జండా, బ్యాడ్జీని పర్హాలోని ఇతర గ్రామాలవారు ఉపయోగించరు. గ్రామాల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించడం, శాంతి భద్రతలను కాపాడటం పర్హా ఏర్పాటుచేసే మండలి విధి. డి.బి నాయక్ కథనం ప్రకారం పర్హాలోని వివిధ గ్రామాలు కలిసి వేటాడతాయి. కలిసి పోరాడతాయి. నిర్దిష్ట సమయాల్లో కలుసుకుని నృత్య గాన వినోదాలతో, విందులతో కాలక్షేపం చేస్తాయి. తమ ఉమ్మడి సమస్యను పరిష్కరించుకుంటాయి. న్యాయ వివాదాలను పరిష్కరించుకుంటాయి.
సంతాల్లు, మలేర్ తెగలలో గ్రామ స్థాయిలో గ్రామ పెద్దను మాంజీ అని పిలుస్తారు. అతడు గ్రామంలోని ఇతర పెద్దలతో గ్రామ విషయాలను చర్చించి సమస్యలను పరిష్కరిస్తాడు. పెడ్లి సమయంలోను, ఇతర ఉత్సవ సమయాల్లోను గ్రామ పెద్దకు ప్రజలు కొన్ని బహుమతులు అందజేస్తారు. అతని భూమికి ఎటువంటి కౌలు ఉండదు. మాంజీ పౌర విషయాలను, నైతిక విషయాలను కూడా పర్యవేక్షిస్తుంటాడు. అతని విధుల్లో 'పరానిక్' అనే ఉప గ్రామ పెద్ద మాంజీకి సహకరిస్తుంటాడు.
ముండా తెగలో గ్రామ పెద్దను ముండా అని వ్యవహరిస్తారు. మత విషయాలను చూసే వ్యక్తిని మాత్రం పహాన్ అని అంటారు. 12 ముండా గ్రామాలను కలిపి 'పట్టి' లేక పర్హా అని పిలుస్తారు. పట్టికి నాయకత్వం వహించే వ్యక్తిని మాన్కీ అని పిలుస్తారు. గ్రామ పెద్దల బృందంలో ఇతడికి ఎక్కువ పలుకుబడి, ఆధిపత్యం ఉంటాయి. ముండా, పహాన్ పదవులు వారసత్వంగా సంక్రమిస్తాయి.
గోండులలో ప్రాథమిక రాజకీయ విభాగం గ్రామమే. గ్రామ పెద్దను పటేల్, మండల్ లేదా భోయి అని పిలుస్తారు. గ్రామ వ్యవహారాల నిర్వహణలో ఇతర గ్రామ పెద్దలు అతడికి సహకరిస్తారు. హిందు మతావలంబి అయిన బస్తర్ రాజుకు రాజకీయంగా గోండులపై ఎటువంటి ఆధిపత్యం లేకపోయినా అన్ని వర్గాలు మతపరంగా ఆయనను గౌరవించి, పూజిస్తాయి. మారియా తెగలో మత వ్యవహారాలు, ఉత్సవాలు నిర్వహించే వ్యక్తికి, వైద్యం చేసే వ్యక్తికి గ్రామ పెద్దకంటే ఎక్కువ గౌరవం ఉండటం విశేషం.
దక్షిణ భారత దేశంలో...
ఆర్థికంగా, సాంకేతికంగా బాగా వెనుకబడి ఉన్న కొన్ని ఆదివాసీ తెగలు దక్షిణ భారత దేశంలో నివసిస్తూ ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతంలో నివసించే ఆదివాసీలు చెల్లా చెదురుగా అడవుల్లో చిన్న చిన్న బృందాలుగా నివసిస్తారు. కాకపోతే వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలు నివసించే గ్రామాలకు చేరువలో వీరు జీవిస్తూ ఉంటారు. ఇరుగు పొరుగువారితో సంబంధం లేకుండాను, ఇతరుల జోక్యం లేకుండాను తమ మానాన తాము జీవించాలని వీరు ప్రయత్నిస్తుంటారు.
అండమాన్-నికోబార్ దీవుల్లో నివసించే ఆదిమ ప్రజలు ఇంకా ఆహారం సేకరించుకుంటూ, వేటాడుతూ జీవనాన్ని గడుపుతున్నారు. వీరు సంచార తెగలకు చెందినవారైనప్పటికీ, ఎప్పుడూ నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతంలోనే సాధారణంగా సంచరిస్తూ ఉంటారు. ప్రతి స్థానిక బృందం లోనూ ఐదు నుంచి పది కుటుంబాలు ఉంటాయి. ఈ స్థానిక బృందాలు స్వేచ్ఛగా నివసిస్తూ, స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉంటాయి. వేటను ముమ్మరంగా నడిపేటప్పుడో, ఉత్సవ సమయాల్లోనో సంచార తెగలు కలవవచ్చు. తమ స్థానిక తెగ అవసరాలను ఆ బృంద నాయకుడు చూస్తూ ఉంటాడు.
కొన్ని సంచార తెగలలో ఈ నాయకుల వ్యవస్థ లేదు. కుటుంబ పెద్దలందరూ సమావేశమై తమ తెగ సమస్యలపై నిర్ణయాలు తీసుకుంటారు. అల్లార్లకు, అరనాడార్లకు తెగ పెద్ద్ద అంటూ ఎవరూ ఉండరు. తెగ సమస్యలపై తెగలోని పెద్దలందరూ సమావేశమై నిర్ణయం చేస్తారు. ఈ నిర్ణయాలు తెగలోని వారందరూ పాటించవలసి ఉంటుంది. ఈ నిర్ణయాలు తలదాల్చనివారు తెగను వదిలిపెట్టి వేరే తెగలో కలిసిపోవలసి ఉంటుంది. ఆహారం సేకరించి జీవించే కాడార్ తెగలో తెగ పెద్ద పదవి వారసత్వంగా వచ్చేది. కానీ ఈ పదవి క్రమంగా అదృశ్యమయింది.
కేరళకు చెందిన ఆడియార్లలో తెగ పెద్ద పదవి వారసత్వంగా లభిస్తుంది. తెగ పెద్ద కుమారుడు ఈ పదవికి అనర్హుడైతే మేనల్లుడికి ఈ పదవి లభించవచ్చు. తెగ పెద్దకు ప్రత్యేకమైన బిరుదు ఉంటుంది. తెగ పెద్ద నియంతగా వ్యవహరించడు. తెగ సమస్యలను చర్చించే పెద్దల సమావేశానికి తెగ పెద్ద అధ్యక్షత వహిస్తాడు. అయితే వివాహం, విడాకులు లేక ఇతర కీలక నిర్ణయాలకు అతని అనుమతి తప్పనిసరి. అంత్యక్రియలు, అనంతర కర్మకాండలో తెగ పెద్దకు కీలక పాత్ర ఉంటుంది.
Authorization