''నాటకం జీవితాన్ని అనుకరిస్తుంది
జీవితం నాటకాన్ని అనుసరిస్తుంది''
ఈ వాక్యాల్లో నాటకానికి జీవితానికి గల సంబంధమే కాదు, నాటక లక్ష్యం కూడా అవగతమవుతుంది. మానవ జీవితానికి దిశానిర్దేశం చేయవలసిన బాధ్యత నాటకానికి ఎప్పటికీ ఉన్నదనే విషయం ఇక్కడ చెప్పకనే చెప్పినట్లయింది. సమకాలీన సమస్యలను నాటకం సజీవంగా చర్చిస్తుంది. పరిష్కారం చూపేందుకు తాపత్రయపడుతుంది. అందునా యువత రంగప్రవేశం చేస్తే ఆ ఉత్సాహం, ఆ స్పందనే వేరు. తెలంగాణ ప్రభుత్వ భాష, సాంస్కృతిక శాఖ తెలంగాణ రంగస్థల సమాఖ్య సంయుక్త నిర్వహణలో ఐదవ తెలంగాణ యువనాటకోత్సవాలు జులై 4 నుండి 7వరకు జరిగాయి. అందుకు రవీంద్ర భారతి వేదికయింది. ఆ ఉత్సవాలలో ప్రదర్శి:చిన కొన్ని నాటికల సమీక్షే ఈ వ్యాసం.
నాటికల్లో వస్తు-శిల్పం భిన్నంగా సాగినప్పటికీ, ప్రయోగ వ్యామోహంతో యువరక్తం కేరింతలు కొట్టింది. టీ.వీ, సినిమాలకన్నా నాటకాలు ఆడి రక్తి కట్టించడం ఎంత కష్టతరమో, ఎంత క్లిష్టతరమో చాలామందికి అర్థమయింది. నాటకం ఓ సమిష్టి క్రియ. సమయపాలన, క్రమశిక్షణను కళాకారులకు నాటకం నేర్పుతుంది. లేకుంటే రసభంగం తప్పదు. ఏది ఏమైనా నాటకానికి ఆదరణ కరువవుతున్న ఈ తరుణంలో విద్యాధికులైన యువత నాటక రచన, నటన, దర్శకత్వ రంగాలలోకి అడుగిడటం నాటకాన్ని వృత్తిగా స్వీకరించడం ఎంతైనా అభినందనీయం. ఉత్సవాల్లో ప్రదర్శించిన పది నాటికలలో ఐదింటిని గురించి రేఖామాత్రంగా తెలుసుకుందాం...
...ఎవరికి చుట్టాలు!
కుటుంబ సంప్రదాయం పేర పురుషాధిక్యతను స్థిరపరచుకునే ఉద్దేశంతో రూపకల్పన చేసిన నాటికగా ఇది గోచరిస్తుంది. రచన, దర్శకత్వం ఇ.సమత.హైదరాబాదు సాహితీకళా సమితి దీన్ని ప్రదర్శించింది. గృహహింస చట్టాన్ని ఉద్యోగస్తురాలైన కోడలు తన చేతుల్లోకి తీసుకుని, విడాకులు తీసుకోవాలని అనుకోవడమే కాక, అత్తమామలపై నేరారోపణ చేస్తుంది. అది తట్టుకోలేని కొడుకు ఆత్మహత్య చేసుకోవడం నాటిక ఇతివృత్తం.
నిజానికి ఇలాంటి కేసులు ఒకటి లేదా రెండు మాత్రమే ఉంటాయి. ఈ అంశాన్ని సాధారణీకరించి పురుషాధిక్యతకు బలం చేకూర్చాల్సిన అవసరం ఇంకా రాలేదు. స్త్రీని విలన్గా చూపించారు. అయినా ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య తప్ప పరిష్కారం లేదనే దిశగా నాటిక గమనం సాగటం ఔచిత్యం కాదు. నాటకం ఎప్పుడూ ప్రేక్షకుల ఆత్మస్థయిర్యాన్ని పెంచే దిశలో సాగాలి. సహేతుకమైన చర్చను ప్రేక్షకులతో జరపాలి. కేవలం భావోద్వేగాలతోనే ముడిపెడదామనుకుంటే సాధ్యం కాదు. ఈ చట్టాలు కూడా తమ రక్షణ కోసం, సమానత్వం కోసం హహిళాలోకం పోరాడి సాధించుకున్న విషయాన్ని విస్మరించకూడదు.
కండీషన్స్ అప్లై
మనం మార్కెట్ ప్రపంచంలో జీవిస్తున్నాం. ప్రతిదీ అమ్ముకుంటున్నాం. కొనుక్కుంటున్నాం. చివరకు న్యాయాన్ని కూడా! అయితే ఏ వ్యవహార లావాదేవీల్లోనయినా నియమాలు (షరతులు) తప్పక ఉంటాయి. అవి అంతర్భాగంగా అన్వయితమవుతాయి (కండీషన్స్ అప్లై). ఈ సూక్ష్మం తెలుసుకోకపోతే ఎంతటి పెద్దవారైనా పప్పులో కాలేయాల్సిందే. స్నేహానికీ ఇది వర్తిస్తుంది. జీవితంలో మోసాలుంటాయి. కానీ జీవితమే మోసం కాకూడదనే హెచ్చరికను నాటకంగా రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. రచన జి.నాగేశ్వరరావు, దర్శకత్వం వి.రమణ. నిజామాబాద్ సంస్కృతివారు దీన్ని ప్రదర్శించారు.
బిచ్చగాడు
సమాజంలో ఆకలి ఉంది. పట్టణాల్లో కంటే పల్లెల్లో ఎక్కువగా ఉంది. ఆకలి... క్షుద్బాధ అనుభవించేవారికి తప్ప మరొకరికి అంత సులువుగా అర్థం కాదు. అయితే బిచ్చగాళ్లు పల్లెల్లో కంటే పట్టణాల్లో ఎక్కువగా ఉంటారు. అలాంటి ఆకలిగల బిచ్చగాణ్ణి అడ్డంపెట్టుకుని, రాజకీయం, మీడియా చేసే దుర్మార్గాన్ని ఎత్తి చూపించే ప్రయత్నమే ఈ 'బిచ్చగాడు' నాటిక.
ఆకలితో అలమటిస్తూ ఒక బిచ్చగాడు చెత్తకుండీలో దొరికిన మద్యం తాగి మూర్చబోతాడు. ఓ టీవీ ఛానల్ ఇది గ్రహించి ప్రతిపక్షనేతకు ఉప్పందిస్తుంది. ఆ నేత దీన్ని ఆసరాగా తీసుకుని ఉద్యమాన్ని లేవదీస్తాడు. ఉద్యమ తీవ్రత కోసం మరో బిచ్చగాణ్ణి నిరాహార దీక్షకు కూర్చోబెడతాడు. మూర్చబోయిన బిచ్చగాణ్ణి గూండాలచేత చంపిస్తాడు. 'అసెంబ్లీ ఎదుటే ఆకలి చావు' అంటూ హింసాయుత ఆందోళనతో నగరాన్ని మండిస్తాడు. ఎట్టకేలకు ఆ నేత అధికారాన్ని తిరిగి కైవశం చేసుకుంటాడు.
సన్నివేశాలు అన్నీ నాటకీయంగా వాస్తవానికి కడుదూరంగా సాగుతాయి. పాలకపక్షం ఆకలిచావులకు నిర్వచనం చెప్పమని అడగడం, ప్రతిపక్షం దానిని దాటవేయడం అంతా మీడియా తంతుగానే సాగుతుంది. చివరికి రోడ్లు ఊడ్చే పారిశుధ్య కార్మికుడు కూడా నిరాహార దీక్షకు కూర్చున్న బిచ్చగాణ్ణి మోసం చేయడంతో మానవీయతకు అడ్రసు గల్లంతవుతుంది. దీక్షలు, ధర్నాలు, ఉద్యమాలు కేవలం రాజకీయ నేతల స్వార్థంతోనే నడుస్తాయన్న తప్పుడు సంకేతం కూడా ప్రేక్షకుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. రచన, దర్శకత్వం బాలగంగాధర్. ప్రదర్శన తనషిత క్రియేషన్స్.
ఎలుగుబంటు-ఎలుక ముఖం
ఆంటోని చెకోవ్ కథ ఆధారంగా రూపొందించిన లఘునాటిక ఇది. ఒకానొక కుగ్రామంలో ఓ నిరుపేద దంపతుల కుటుంబం ఉంటుంది. ఇరుగుపొరుగువారందరూ కల్మషం లేని కష్టజీవులే. అనుకోకుండా ఓ రోజు ఆ కుటుంబంలోని భర్త చనిపోతాడు. అందరూ విషణ్ణ వదనాలతో బాధపడుతుంటారు. చనిపోయిన వ్యక్తి పటానికి దండవేసి ఏడుస్తుంటారు. నాటిక ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అనుకోకుండా ఒక వ్యక్తి వచ్చి ''నీ భర్త నాదగ్గర ఏడువందల యాభై రూపాయలు రుణం తీసుకున్నాడు. చెల్లిస్తే బావుంటుంది'' అన్నాడు. ఈ పరిస్థితుల్లో తానెలా తీర్చగలనని ఆమె అంటుంది. మాటా మాటా పెరుగుతుంది. గొడవ కాస్త ఘర్షణగా మారుతుంది. ఒకరు 'ఎలుగుబంటు' అంటే మరొకరు 'ఎలుక ముఖం' అని తిట్టుకుంటారు. సర్దుబాటు చేయడానికి జనం పంచాయితీ పెడతారు. పెద్దలు కల్లు గాగుతారు. తాపుతారు. ఈ తగువులాట క్రమంలోనే వారిమధ్య చిన్నప్పటి నుంచే ప్రేమ ఉందని, అనుకోని పరిస్థితుల వల్ల ఆమెకు వేరే వ్యక్తితో వివాహం అయిందని తెలుసుకుంటారు.
సరే ఇప్పుడు భర్త లేడుగా, మరిప్పుడు పెండ్లిచేసుకోవచ్చుకదా అని పెద్దలందరూ నిర్మలంగా అడగడంతో వారిరువురూ సంతోషంగా అంగీకరిస్తారు. పటానికి తీసిన దండ తీసి వారిరువురికీ వేయడంతో తెరపడుతుంది. సందర్భోచిత జాతీయాలతో ఆద్యంతం హృద్యంగా సాగుతుంది. అనుసృజన, దర్శకత్వం నటరాజ్. నటన రంగస్థలి, సిద్దిపేట.
దిక్సూచి
ప్రస్తుతం రైతు బతుకులు ఛిద్రమవుతున్నాయి. రైతును అందరూ మోసం చేసేవారే. తమ బిడ్డల్ని ఉన్నత చదువుల్లో, ఉద్యోగాల్లో చూసుకోవాలని ప్రతి రైతు ఆశపడ్తాడు. కెరీర్ పరుగులాటలో నేటి యువత ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారు. విదేశీ చదువులకోసం లక్షలు కావాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రేమ పేరుతో భవితను ధ్వంసం చేసుకుంటున్నారు. కన్నబిడ్డల క్షేమం కోసం కన్నతల్లి లాంటి భూమినే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. నిజమైన ప్రేమానురాగాలకు నిత్య దిక్సూచిగా నిలిచేది తల్లిదండ్రులే అని తెలియజెప్పింది ఈ నాటిక. రచన ప్రభాకర్. దర్శకత్వం భానుప్రకాష్. ప్రదర్శన విశ్వకర్మ ఆర్ట్స్; వీరారెడ్డిపల్లి, యాదాద్రి.
- కె.శాంతారావు, 9959745723
ఫొటోలు: పిప్పళ్ల వెంకటేష్
Authorization