లంగాణ ప్రభుత్వ భాష, సాంస్కృతిక శాఖ; తెలంగాణ రంగస్థల సమాఖ్య సంయుక్త నిర్వహణలో ఐదవ తెలంగాణ యువనాటకోత్సవాలు జులై 4 నుండి 7వరకు జరిగాయి. అందుకు రవీంద్ర భారతి వేదికయింది. ఆ ఉత్సవాల్లో ప్రదర్శితమైన కొన్ని నాటికల సమీక్షే ఈ వ్యాసం.
పుష్ఫలత నవ్వింది!!!
శారీరక లోపాల వలన, హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వలన కొందరికి పరిణితి సకాలంలో సక్రమంగా జరగదు. ఒక్కోసారి అసలే జరుగదు. ఇది బాలబాలికలు ఇద్దరిలోనూ ఉంటుంది. తత్కారణంగా కొందరు బాలికలు పుష్పవతి కాలేరు. అదో సమస్యగా భావించి వారికిక పెండ్లి చేయరు. నష్ట జాతకురాలి (శీలవతి)గా భావించి ఒక విధంగా వెలివేస్తారు.
పదమూడేండ్ల పుష్పలత పుష్ఫవతి కాదు. ఆ ఈడు పిల్లలందరూ పెద్దమనుషులవుతుంటే తల్లి, తండ్రి, మేనత్త అందరూ చిన్నబోతుంటారు. చుట్టుపక్కల సమాజం సరేసరి. జాతకాలు, మంత్రాలు చెప్పేవారికి పుష్పలతను చూపించి పూజలు చేయించడంతో పాటు, ఓ లేడీ డాక్టర్కి కూడా చూపిస్తారు. ఆ డాక్టర్ శాస్త్రీయంగా అసలు విషయం చెబుతుంది. అప్పుడు తల్లి ఓ నిర్దారణకు వచ్చి పుష్పలతతో ఇట్లా అంటుంది ''చూడు బిడ్డా ఈ రహస్యం నీ కడుపులోనే పెట్టుకో. మీ అత్తకు బిడ్డల మీద మోజెక్కువ. ఆ తర్వాత నీకు బిడ్డలు పుట్టకపోతే జన్మంతా వెలిబతుకు మోయాల్సి వస్తుంది. బాగా చదువుకో బిడ్డా! నిన్నర్థం చేసుకునే మొగుడుతోనే కాపురం చేద్దువు కాని'' అంటూ కొత్త రెక్కలు తొడిగి నవ్వించడంతో నాటిక సమాప్తమవుతుంది.
సున్నితమైన స్త్రీ సమస్యను దర్శకుడు ప్రయోగ పూర్వకంగా రుజుమార్గంలో చర్చించాడు. మాస్కులు ఉపయోగించి ప్రతీకలు చూపెట్టాడు. ప్రకృతి విధించిన శిక్షకు మానవీయ కోణంలో పరిష్కారం చూపాడు. రచన కరుణకుమార్. దర్శకుడు తిరువీర్. ప్రదర్శన పాప్కార్న్ థియేటర్, హైదరాబాదు.
ఇక్కడ పెళ్ళిళ్లు చేయించబడును
వంద అబద్ద్దాలాడైనా ఓ పండ్లి చేయమనే సామెత ఉంది. మనకు పుట్టగొడుగుల్లా మ్యారేజి బ్యూరోలు పుట్టుకొస్తున్నాయి. వ్యాపార ధోరణిలో ఎవరి ప్రయోజనాలు వారివి. పారిశుద్య కార్మికుడైన ఓ నిజాయితీ యువకునికి స్మార్ట్ఫోన్ యాపుల్లో మునిగి తేలుతున్న ఓ యువతికి వివాహం కుదర్చడమే ఈ నాటిక సారాంశం. ఆద్యంతం హాస్యపు జల్లులతో ముంచెత్తుతుంది. విశేషం ఏమంటే... యువకుని నిజాయితీని యువతి గౌరవించడం, యువతి నిర్మలమైన మనసును యువకుడు అర్థం చేసుకోవడంతో పెద్దలు అవాక్కవుతారు. అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే నటించిన ఈ నాటిక అంతర్లీనంగా శ్రమగౌరవం, నిరాడంబరతను ప్రోత్సహిస్తుంది. రచన కిరణ్కుమార్.దర్శకత్వం హర్ష. ప్రదర్శన మంచ్ థియేటర్, హైదరాబాదు.
శుభలగం
దశాబ్దాలుగా సాగుతున్న సాంఘిక తెలుగు నాటిక ఒరవడిలోనే ఈ నాటిక సాగుతుంది. రచన, సంభాషణలు, ఉచ్ఛారణ, సంగీతం, రంగాలంకరణ అన్నీ అదే మూసలో సాగుతాయి. యువత ప్రేమించుకుంటుంది. పెద్దలు కాదని పెండ్లి చేస్తారు. కథానాయికకు మనువొక చోట, మనసోకచోట అవుతుంది. భర్త మాత్రం అర్థం చేసుకుని గౌరవిస్తాడు. కానీ ఆమె పూర్వ ప్రేమికునితోనే జీవితం పంచుకోవాలని నిర్దారణకు వస్తుంది. అయితే ఆ ప్రేమికుడు మోసగాడని తెలుసుకుని ప్రస్తుత వివాహ బంధాన్ని ఆశ్రయిస్తుంది. ప్రేమికుడు మంచివాడైతే ఈ నాటికలో సమాధానం దొరకదు.
రచన లింగమూర్తి. దర్శకత్వం శ్యామలరావు. ప్రదర్శన మయూరి ఆర్ట్ క్రియేషన్స్, వరంగల్.
ఖతర్నాక్ మల్లన్న
విశ్వ విఖ్యాత రచయిత బెట్రోల్ బ్రెక్ రచనకు తెలుగు రూపం ఇది. ఓ నిరుపేద మురికివాడలో మల్లమ్మ అనే యువతి ఉంటుంది. తల్లి వేశ్యావృత్తిని ఆధారంగా చేసుకుని జీవిస్తుంది. నిష్కల్మషమైన మనసు, ఉన్నంతలో పరులకు సహకరించే దయాగుణం లాంటి లక్షణాలు ఆమెవి. ఇంద్రుడు, కుబేరుడు ఆమెను పరీక్షించి ఆమె నిజాయితీకి చకితులవుతారు.
కాలక్రమేణా మల్లమ్మ మల్లన్నగా రూపాంతరం చెంది లౌక్యం నేర్చుకుంటాడు. తన జరుగుబాటుతోపాటు ఇతరుల జరుగుబాటుకు మార్గం చూపుతాడు. బస్తీ జనం ఎటు జరుగుబాటు ఉంటే అటు నడుస్తారు. కడకు మల్లమ్మ మాయమవుతుంది. మల్లమ్మను మల్లన్నే హత్య చేశాడని నేరం ఆపాదితమవుతుంది. కోర్టులో మల్లన్నే మల్లమ్మని రుజువు కావడంతో నాటకం ముగుస్తుంది.
నిర్మలమైన మల్లమ్మగా బతకాలా? బతక నేర్చిన మల్లన్నగా బతకాలా మీరే తేల్చండి అన్న ప్రశ్నను ప్రేక్షకులపై సంధిస్తుంది చివర్లో. సురభి బృందం ప్రదర్శన కాబట్టి ఆర్నెల్ల పాపతో సహా జనసందోహం కనువిందు చేస్తూ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. రచన, దర్శకత్వం సురభి జయచంద్ర. ప్రదర్శన శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్, హైదరాబాదు.
మేరే ప్యారే పతంగ్
ప్రేమించిన అమ్మాయికి బహుమతి ఇవ్వాలని ఆశపడ్డాడు ఓ ప్రేమికుడు. కష్టపడి బహుమతి సంపాదిస్తాడు. అయితే ఆ బహుమతి పెట్టెలో మాదక ద్రవ్యాలు ఉండటంతో పోలీసులకు బందీ అయిపోతాడు. కల చెదిరిపోతుంది. కనీళ్లు మిగిలిపోతాయి. ఇది అసంపూర్ణ నాటిక. విఫల ప్రయోగం. రచన ప్రశాంత్. దర్శకత్వం వికాస్ చైతన్య. ప్రదర్శన బ్రిడ్జ్ థియేటర్ గ్రూప్ అసోసియేషన్స్, ఖమ్మం.
ఇట్లా యువత నాలుగు రోజుల్లో పది నాటికలు ప్రదర్శించింది. యువజన నాటకోత్సవం ఇట్లా జరగడం భారత ధేశంలోనే ప్రథమం అని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. త్వరలోనే ఈ ఉత్సవాలను జిల్లా స్థాయికి కూడా విస్తరించనున్నట్లు ప్రభుత్వ సలహాదారు రమణాచారి తెలిపారు. పరిషత్ పోటీలు అని కాకుండా ఇట్లా ఉత్సవాలు నిర్వహించడం ముదావహం అని సీనియర్ కళాకారులు సుబ్బరాయశర్మ, డిఎస్ఎన్ వంటివారు పేర్కొన్నారు.
Authorization