తీవ్రమైన రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ, హిందు-ముస్లిం సఖ్యతగా రెండు మతాల మధ్య అన్యోన్యమైన సంబంధం కొనసాగడం మొగల్ కాల ముఖ్య లక్షణం. పర్యవసానంగా ఏర్పడిన సింథసిస్ (మేళన) స్ఫూర్తి, పరస్పర సామరస్యాలు ఒక కొత్త మిశ్రమ, సమ్మిళిత సంస్కృతి ఆవిర్భావానికి దారి తీశాయి. ఈ కొత్త సంస్కృతి పూర్తిగా పర్షియన్ (ముస్లిం) సంస్కృతీ కాదు; పూర్తిగా భారతీయ (హిందు) సంస్కృతీ కాదు. ఈ రెండు సంస్కృతుల ఉత్తమ గుణాల సమ్మేళనం. కళ, వాస్తు శాస్త్ర రంగంలో పర్షియన్, భారతీయ రీతులు సంతోషంగా కలగలిసిపోయాయి. అక్బర్, షాజహాన్లు నిర్మించిన అద్భుతమైన భవన నిర్మాణాల్లో దీని సర్వోత్కృష్టత వ్యక్తమయింది. అదే విధంగా మొగలుల కాలం నాటి చిత్రలేఖనం భారతీయ, విదేశీ మెలకువలనూ, మేలు కలయికలనూ ప్రదర్శిస్తుంది. ఆనాటి సాహిత్యం కూడా ఈ రెండు సంస్కృతుల సమ్మేళనం నుంచి తప్పించుకోలేకపోయింది. పర్షియన్, అరబిక్ పదాల కలయికతో వివిధ భారతీయ భాషల పదజాలం సుసంపన్నమయింది.
రెండు మతాల సమ్మేళనానికి...
హిందు-ముస్లిం సమ్మేళనానికి, సామరస్యానికి అక్బర్ పాలన చాలా ముఖ్యమయింది. అక్బర్ అనుసరించిన పరమత సహన విధానంలోనూ 'దీన్ ఇ ఇలాహీ'లోనూ మతపరమైన సమ్మేళనం వ్యక్తమయింది. కులపరమైన, జాతిపరమైన ఆంక్షలు, పురోహిత వర్గ ప్రాబల్యం, బాహ్యమైన సంస్కార విధి లేని మతాన్ని అక్బర్ అందించాడు. ఏకేశ్వర వాదానికి, నైతిక ప్రవర్తనకు ఈ మతం ప్రాధాన్యం ఇచ్చింది. మత సహనం, సన్నిహిత సామాజిక సంబంధం, పరస్పర ప్రేమాభిమానాలు దారాషికో యువరాజు కాలంలో పరాకాష్టకు చేరుకొన్నాయి. హిందు-ముస్లిం మార్మికవాదాల మధ్య మౌలికమయిన తేడాలు మాత్రమే ఉన్నాయని ఆయన వాదించాడు. మార్మిక భావనకు చెందిన 'రెండు సముద్రాలు' ఐక్యమయ్యే స్థితిని వివరించడానికి 'మజ్ మా-ఉల్-బారయం' రచించాడు.
ఈ రెండు మతాల ప్రజలనూ ఐక్యం చేయాలనేది అక్బర్ కోరిక. హిందు-ముస్లింల మధ్య ఉన్న సామాజిక సాన్నిహిత్యం వల్ల వస్త్రధారణ, ఆహారం, మర్యాద, జీవన విధానం, పండుగలు, ఉత్సవాలు వంటివాటి విషయంలో హిందు-ముస్లిం సమ్మేళనం చోటుచేసుకొంది. హిందూ వివాహాల్లో సెహ్రా, జమ అనేవి వాడుకలోకి వచ్చాయి. పైజమా, కుర్తాలు ఉత్సవ సందర్భాల్లో ధరించే దుస్తులుగా రూపొందాయి. బాదుషా, గులాబ్ జామ్, బర్ఫీ వంటి కొత్త రుచికరమైన మిఠాయిలు ఆహార పదార్థాల్లో చోటుచేసుకొన్నాయి. హుక్కా, పొగాకులను ముస్లింలతో పాటు హిందువులు కూడా వినియోగించేవారు. మగపిల్లవాడు పుట్టడాన్ని రెండు మతాలవారూ సంగీత వినోదాలతో ఉత్సవంగా జరుపుకొనేవారు. స్త్రీల ఆభరణాలు రెండు మతాల వారిలోనూ ఒకే విధంగా ఉండేవి. రెండు మతాల వారూ ఒకరి పండుగలో మరొకరు స్వేచ్ఛగా పాల్గొనడం ప్రారంభమయింది. హిందువులు 'ముహర్రం'ను పాటించడం ప్రారంభిస్తే, సయ్యద్ సోదరుల్లో ఒకడయిన అబ్దుల్లా ఖాన్ హిందువుల 'బసంత్', 'హోళి' పండుగలను జరిపేవాడు. షిరాజ్ ఉద్దౌలా, మీర్జాఫర్లు తమ హిందు స్నేహితులతో కలిసి 'హోళీ' పండుగను ఆనందంగా జరుపుకొనేవారు. సంక్షిప్తంగా చెప్పాలంటే భారత దేశంలో మొగల్లు ప్రవేశపెట్టిన వస్త్రధారణ, మర్యాదలు, సామాజిక సదుపాయాలు, పండుగలు వంటివన్నీ విదేశీతత్వాన్ని పోగొట్టుకొన్నాయి. భారతీయ ప్రజలందరూ వాటిని స్వీకరించారు. ఇట్లా ఇప్పుడున్న భారతీయ సంస్కృతిలో కనిపిస్తున్న ఎన్నో అద్భుత మైన విశేషాలు మొగల్ కాలం నుంచీ కొనసాగుతున్నవే.
Authorization