యక్షగానం ప్రాచీన కళారూపం. వీధిబాగోతం, ప్రాచీన వీధినాటకం (బయలు నాటకం, చెంచునాటకం వంటివి)- ఇవన్నీ సారూప్య లక్షనాలు గల కళారూపాలే. యుగ యుగాలుగా తెలుగు ప్రజానీకాన్ని అలరిస్తున్నవే. అయితే ఈ ప్రదర్శనల అవశేష చాయలు ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు, కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితమై పోవడం విషాదకర పరిణామం. ప్రపంచీకరన నేపథ్యంలో వీటిని పునరుజ్జీవింపచేయడం సాధ్యమా అనే ప్రశ్న
ఉదయించక మానదు.
ఏ ప్రదర్శన అంతిమ లక్ష్యమైనా ప్రేక్షకుల్ని రసప్లావితం చేయడం. కనుక రసోత్పత్తి కలిగించే భూమికలు ఈ కళారూపాల్లో అనేకం మెండుగా ఉన్నాయి. అందుకే అవి రూపాంతరం చెందుతూ అనునిత్యం హృదయాలను కదిలిస్తూ ఉంటాయనేది నిష్ణాతుల అభిప్రాయం. ఇదీ నిజమే. అందుకే శాస్త్ర సాంకేతికలు ఎంతగా వెల్లువెత్తినా రససిద్ధి పొందేందుకు ఒక్కసారి ఆ దరువులను, రగడలను కళాకారులు నేటికీ ఆశ్రయించడం తప్పడంలేదు.
యక్షగానం అంటే?
యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ- ఇత్యాది దేవతా గణంలోని యక్షుల పాటే యక్షగానం అని కొందరి అభిప్రాయం. యక్ష (దేవతల పాత్ర) వేషధారణతో చిందు, గాన, అభినయ ప్రధాన వినోద క్రీడయే యక్షగానమని, తెలుగులో పూర్వ నాటక స్వరూపం ఈ యక్షగానములని పరిశోధకులు అంటున్నారు.
''యక్షగానం బృహదాంధ్ర సారస్వత శాఖలలో ఒకటని తెలుగు వాంజ్మయ వ్యక్తిత్వము నిరూపించునట్టి ప్రక్రియ'' అని యక్షగానంపై పరిశోధన చేసిన ఆచార్య ఎస్వీ జోగారావు అన్నారు. మన తెలుగు సాహిత్యంలో యక్షగాన రూపక సాహిత్యం విడదీయలేనంతగా పెనవేసుకుపోయిందని అవగతమవుతుంది. అంటే తెలుగువారి జీవన సంస్కృతిలో యక్షగానం అంతర్భాగం. లోతులకు వెళ్లి పరిశీలిస్తే... యక్షులంటే జక్కులని, సత్సంతాన ప్రాప్తి కోసం పర్వదినాల్లో జక్కులవారిని పిలిపించి యక్షగాన ప్రదర్శనల ద్వారా గ్రామీణులు వారిని ప్రసన్నం చేసుకునేవారని చరిత్ర చెబుతున్నది.
భాష, వేషధారణ, అభినయం, అడుగు (చిందు) పాట వలన సాక్షాత్తు దివి నెండి భువికి దిగివచ్చిన దేవతామూర్తులుగానే ప్రజలు వారిని కొలిచేవారు. శతాబ్దాల పాటు ఈ జక్కుల జాతి యక్షగాన ప్రదర్శననే ప్రధాన వృత్తిగా చేసుకున్నదని పండితారాధ్య చరిత్రలో పాల్కురికి సోమనాథుడు పేర్కొన్నాడు.
యక్షగానం అనేది ఆట, పాట, మాట ప్రధానంగా సాగుతుంది. అయితే సాహిత్యం అంతా జానపద సాహిత్యమే. ప్రజల వాడుక భాషే ప్రధానంగా ఉంటుంది. అదే సందర్భంలో దేవతావాక్కులు కనుక తమకు తోచిన రీతిలో అలంకారాలు, అందంగా సొబగులు అద్దడానికి అనువుగా ఈ ప్రదర్శనా కళాకారులు తాపత్రయపడతారు ఇప్పటికీ.
దేశ భాషతో, మూల రగడలతో, సరళంగా పాడుకునే ద్విపదలతో యక్షగానాలు విరాజిల్లుతున్నాయి. శ్రీనాధుని కాలం నాటికి యక్షగానం మెరుగులీనుకుని శృతిలయాన్విత వాద్యోపకరణ సహితంగా మారింది. శాస్త్రీయతను సంతరించుకుంది. 16వ శతాబ్దికి చెందిన కందుకూరి రుద్రకవి రచించిన 'సుగ్రీవ విజయం' తొలి లిఖిత ప్రాచీన యక్షగానమని పరిశోధకులు నిర్ణయించారు.
ఇంతీ... పూబంతీ నే... ఓరోరి... రాక్షసా
నీ అంతం చూసెదా... ముమ్మాటికీ...
పతాక సన్నివేశంలో చూపించే ఇలాంటి రగడలను 'ఒసే రాములమ్మ చిత్రంలో కూడా మనం చూడవచ్చు.
శిష్ట వ్యవహారంతో కవులు, రచయితలు యక్షగాన రచనలు చేసినప్పటికీ ప్రదర్శకుల రాగ, లయాన్విత వ్యవహార భాషే పై చేయి కావడం వలన వీక్షకుల్ని అమితంగా రంజింపచేసేవి. అలా... అలా... ఆ ప్రాంతీయ వేష భాసలతో ఎక్కడికక్కడ ఒదిగిపోయేది. 17వ శతాబ్దంలో తంజావూరి నాయక రాజుల పాలనలో యక్షగానం బహుముఖంగా విస్తరించిందని ప్రతీతి. ఆ కారణంగా తమిళనాడు, కన్నడ మైసూరు ప్రాంతాల్లోనే గాక తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడి వరకు ఈ కళారూపం వ్యాప్తి ఏదో ఒక రూపంలో జరిగింది.
భాగవతులెవరు?
భాగవతాన్నే బాగోతం అని అంటున్నారు. ''ఎవరికి తెలియదు నీ బాగోతం'' అనేది ఇప్పటికీ ఓ నానుడే. అంటే తెరవెనుక రహస్య జీవితమన్నమాట. మరో అర్థం భగవంతుని లీలలు, మాయలు, మర్మాలు, అతిశయోక్తులు, కల్పనలు... వీటి గురించి ఎంతగా తెలుసుకుని ఆనందిస్తే అంతగా మోక్షం సాధించవచ్చనే విశ్వాసం. భక్తితోనే ముక్తి పొందవచ్చనే సిద్ధాంతం! పోతన కాలం ముందు నుండి వీరశైవులు, వైష్ణవుల మధ్య వైరం, ఘర్షణలు ఎక్కువగా ఉండేవి. శివ-కేశవుల మధ్య భేదం లేదని, ఘర్షణ విడనాడి శాంతియుతమైన నిర్మల భక్తి మార్గంలో ప్రజల్ని పయనింపచేసేందుకే పోతన భాగవతాన్ని తెలుగులోకి అనువదించడానికి పూనుకున్నట్టు సాహితీవేత్తలు చెప్తున్నారు.
చేతులార శివుని పూజింపడేని
నోరు నొవ్వంగ హరికీర్తి నుడవడేని
దయయు సత్యంబు లోనుగా తలపడేని
కలుగ నేటికి తల్లుల కడుపుచేటు
పోతన ఈ పద్యం తెలుగువారికి నిత్యపారాయణమే కదా.
పోతనామాత్యులు చూపిన ఈ శాంతి సామరస్య భక్తిరస మార్గం పురాణ కాలక్షేప పారాయణానికే పరిమితం చేయక దృశ్యమానం చేయడానికి కొందరు కళాకారులు పూనుకున్నారు. భాగవతాన్ని ప్రదర్శిస్తున్నారు కనుక వారిని భాగవతులు అన్నారు. ఈ భాగవత ప్రదర్శనలు అన్నీ పురాణ ఇతివృత్తాలే కనుక దేవతా వేష భాషణలు సరేసరి. చిందు-గానం (ఆట-పాట) ఉండనే ఉంటాయి. కాలక్రమేణా వారే చిందు బాగోతులుగా, వీధి బాగోతులుగా ప్రసిద్ధికెక్కారు. సిద్ధేంద్రయోగి కూచిపూడి బాగోతంకు పట్టం కట్టి ఓ ప్రత్యేక నర్తనం సృష్టించి ప్రజలకు అందిస్తే... చిందు యల్లమ్మ తనదైన విలక్షణ శైలిలో యక్షగాన శైలికి వరవడి దిద్దారు, విశిష్టతను సాధించారని నటరాజ రామకృష్ణ పేర్కొన్నారు.
ప్రజా కళాతపస్వి డా'||గరికపాటి రాజారావు కూచిపూడి వారివద్ద దరువులు నేర్చుకుని 'హిట్లర్ భాగోతం', 'సిమ్లా భాగోతం' వంటి కళారూపాలు ప్రదర్శించి రాజకీయ చైతన్యం కలిగించారు. తెలంగాణలో పెరుగు వీరభదం భూస్వామి యక్షగానం; ఆంధ్రలో వంగపండు ప్రదర్శించిన భూభాగోతం ఈ కోవలోకే వస్తాయి.
తుపాకి కడుపున పిరంగి పుట్టినట్టు
నిజము నిదానము మీద తెలియు
పాటిమీద దేవరకు కూటిమీదనే కోరిక
యత్ర జంగం తత భక్షమన్నట్టు
ఇలాంటి యక్షగాన జాతీయాలు కాలానుగుణంగా అలా రంజింపచేశాయి. చైతన్యపరిచాయి. ఇక ముందు కూడా...
Authorization