తెలుగు నేలపై తొలిమధ్య యుగంలో శైవం, వైష్ణవ మతాల మధ్య భయంకరమైన యుద్ధాలు జరిగాయి. అడ్డనామాలు-నిలువు నామాలవాళ్ల మధ్య చెలరేగిన విద్వేషాలు ఎందరో ప్రజల ఊచకోతకు కారణమయ్యాయి. ఇవే మత శాఖలు తమలో తాము విద్వేషించుకుంటూనే శాంతిని ప్రబోధించిన బౌద్ధం, జైనాలనూ నరికిపారేశాయి. అయితే మలి మధ్యయుగానికి వచ్చేటప్పటికి కొంత మార్పు వచ్చింది. శైవ, వైష్ణవాలలోనే శాఖోప శాఖలు ఉద్భవించడం, కొన్ని క్షేత్రాలు ఆయా కొత్త శాఖలకు కేంద్రాలుగా మారటం, ఆ క్షేత్రాలను రాజులు తాము ఏ శాఖకు చెందినవారైనా ప్రోత్సహించడం కనిపిస్తుంది. విజయనగర రాజులు వైష్ణవులు. రెడ్డి రాజులు శైవులు. శాఖలు, ఉప శాఖలతో సంబంధం లేకుండా వీరు ఆయా మతానుయాయుల విశ్వాసాలను గౌరవిస్తూ పాలనసాగించడం వల్లనే సుస్థిర పాలన అందించగలిగారని చెప్పవచ్చు.
క్రీస్తు శకం 1323లో కాకతీయుల పరిపాలన ముగిసింది. విజయనగర, రెడ్డిరాజుల పరిపాలన తెలుగు దేశం లో శైవ శాఖల లో చాలా మార్పులు తెచ్చింది. రాజ పోషణలో మార్పుతో పాశుపత శైవానికి చెందిన మయూర మత్త, అభినవ గోళకి మఠం అదృశ్యమైపోయింది. దీనికి ముందు మధ్యయుగ శైవ శాఖ శైవ సిద్ధాంతం శ్రీశైలం, మల్కాపురం, భట్టిప్రోలు, రాజంపేట, కంభంపాడు, సంగమేశ్వరం, త్రిపురాంతకం, ఏలేశ్వరం, మల్యాల, మంథెన వంటి మత కేంద్రాలలో ప్రాబల్యం వహించింది. శ్రీశైలంలోని అభినవ గోళకి మఠం మల్లికార్జున ఆలయ దానాలు అన్నిటి మీద నియంత్రణ కలిగి ఉంది. దాని అధికారం పుష్పగిరి, సిద్ధవటం, జ్యోతి వంటి దూరప్రాంతాలకు కూడా వ్యాపించింది.
క్రీస్తుశకం 12వ శతాబ్ది చివరి పాదం నుండి శ్రీశైలం వీరశైవులకు కేంద్రమయింది. దక్కను నుండి వచ్చే ఇతర భక్తులతో పాటు జంగములు, శివ యోగులు, శీలవంతులు, చెంచులు వంటి శాఖలకు కూడా ఇది కేంద్రమయింది. ఆ తర్వాత రెండు వందల సంవత్సరాలలో వీర శైవులు తమ స్థాయి పెంచుకొని శ్రీశైలం ని తమ స్థానంగా భావించ సాగారు.
శ్రీశైలానికి రాజపోషణకు కారణం
అసంఖ్యాతులు అన్న పేరు కలిగిన వీరశైవులు శ్రీశైలంలోని ఆలయ సంస్థలు అన్నింటిపైనా ఆధిపత్యం సాధించారు. అసంఖ్యాత భక్తులు పెద్ద సంఖ్యలో చేరడం, ఆరాధ్యల సమర్థన లభించడంతో శ్రీశైలానికి రాజ పోషణ లభించింది. క్రీస్తుశకం 1320 లో కాకతీయ ప్రతాపరుద్రుని మంత్రి ఆరాధ్య ప్రగ్గడ అని కూడా పేరు కలిగిన ఇందులూరి అన్నయ దేవుడు అప్పటివరకు వివిధ మఠాలు నిర్వహిస్తున్న ఆలయ భూములు, గ్రామాలపై ఆధిపత్యాన్ని మార్చాడు. శ్రీశైల ఆలయంలో పూజలు, ఉత్సవాల విధులపై అప్పటికే ప్రాబల్యం వహించి ఉన్న అసంఖ్యాతుల నిర్దేశం లోని వీరశైవులకు అతను భిక్షావృత్తి మఠం అన్న పేరు ప్రసాదించాడు. అప్పటికే కాకతీయ రాజ్య పతనం తో రాజ పోషణ కోల్పోయిన అభినవ గోళకి మఠం స్థానంలో వీరశైవ ప్రాబల్యం ప్రధాన శైవ కేంద్రం శ్రీశైలం లోనూ, దాని నాలుగు ద్వారాల - పశ్చిమాన అలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం, దక్షిణాన త్రిపురాంతకం, తూర్పున పుష్పగిరి - లో ఏర్పడింది.
భిక్షావృత్తి శాఖ
తెలలుగు నేలపైన, కర్ణాటకలోనూ ప్రాబల్యం వహించిన ఏకైక సంస్థ బిక్షా వృత్తి మఠం. 1320 తర్వాత ఊటుకూరు, త్రిపురాంతకం, బసిరెడ్డిపల్లి, పుష్పగిరి, బెడనూరు, రాయలచెరువు, పెద్దముడియం వంటి శాసనాలు అన్నీ ఈ మఠ ప్రాబల్యానికి నిదర్శనాలు. ఈ శాసనాలు అన్ని బిక్షావృత్తి అయ్యవార్లను పేర్కొంటున్నాయి. భిక్షావృత్తి అయ్యవారు వీరముష్టి సమాజాల పై గొప్ప ప్రభావం చూపించాడు.
బలమైన భిక్షావృత్తి మఠం ప్రాబల్యం కరీంనగర్ జిల్లాలో నగునూరు వరకు... దక్షిణాన కాళహస్తి వరకు వ్యాపించింది. శ్రీకాళహస్తీశ్వరాలయం భిక్షా గోపురం శ్రీక ష్ణదేవరాయల కాలానికి చెందింది. కైలాసగిరి నుండి నాలుగో ప్రాంగణం వైపు ద్వారం ఇది. భిక్షావృత్తి మఠం ప్రసక్తి కాళహస్తీశ్వర ఆలయ రికార్డుల్లో లేకపోయినప్పటికీ... గోపురం పేరు మాత్రం భిక్షావృత్తి మఠం ఉందని తెలియజేస్తున్నది.
మతపరమైన భిన్న కోణం
శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వైష్ణవాన్ని అనుసరించే విజయనగర రాజుల పోషణ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయానికి చాలా దానాలు చేశాడు. నూరు స్తంభాల మండపం, అత్యంత ఎత్తైన గోపురం వాటిలో కొన్ని మాత్రమే. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు, సదాశివ రాయలు వంటి విజయ నగర రాజులు ఈ ఆలయానికి ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించుకున్నారు. అచ్యుతరాయలు తన పట్టాభిషేకానికి శ్రీకాళహస్తిని ఎంచుకోవడం గమనించదగిన విషయం.
శ్రీశైల మల్లికార్జున ఆలయం ప్రాకార నిర్మాణం శ్రీకృష్ణదేవరాయల కాలంలో జరిగింది. దీని మీద గాధలు... బసవేశ్వర, ఏకాంత రామయ్య, కిన్నెర బ్రహ్మయ్య, మడివాల మాచయ్య, అక్కమహాదేవి వంటి వారి చరిత్రలు వర్ణిస్తాయి. ఆ విధంగా తెలుగు నెలలో... ముఖ్యంగా శ్రీశైలంలో వీరశైవుల ఉనికి విజయనగర యుగంలో మత పరమైన విభిన్న కోణాన్ని ప్రతిబింబిస్తున్నది.
ఆరాధ్య శైవం
ఆంధ్రదేశంలో ఆరాధ్య శైవం ప్రబలంగా ఉండేది. కాకతి ప్రతాపరుద్రుని మంత్రి ఆరాధ్య ప్రగ్గడ అని మరో పేరున్న ఇందులూరి అన్నయ ఈ శాఖలో ప్రముఖ వ్యక్తి. మరొక ఆరాధ్య ప్రముఖుడు పాల్కురికి సోమనాథుడు. తన పండితారాధ్య చరిత్రలో శ్రీశైలం జంగములకు, శివ యోగులకు, చెంచులకు, శివ సాయుజ్యం కోరే దక్షిణదేశ భక్తులందరికీ పవిత్ర స్థానంగా శ్రీశైలాన్ని అద్భుతంగా వర్ణించాడు.
విజయనగర రాజుల పోషణ పాశుపత/ కాలాముఖ నుంచి క్రియాశక్తి శాఖకు మరలింది. కాలాముఖ శాఖ చాలా ప్రసిద్ధి చెందింది. శ్రీశైలం, అలంపురం, త్రిపురాంతకం, ఉమామహేశ్వరం, పుష్పగిరి, ఏలేశ్వరం, కాళేశ్వరం, వేములవాడ, అత్తిరాల వంటివి ముఖ్యమైన కేంద్రాలు.
శక్తి సంప్రదాయం - జోగులాంబ
తాంత్రిక సంప్రదాయాన్ని ఆచరించే కాపాలికులకు శ్రీశైలం స్థానం గా ఉండేది. త్రిపురాంతకం కూడా కాకతీయుల కాలంలో ప్రసిద్ధ కాపాలిక స్థానంగా ఉండేది. ఇక్కడ త్రిపుర సుందరి దేవి తన తాంత్రిక శృంగార రూపంలో దర్శనమిస్తుంది. కాపాలికుల మరొక స్థానం అలంపురం. నందవరం లో చండేశ్వరి, చందలూరు లో మహాలక్ష్మి, జగదేవి లో వింధ్యవాసిని, విజయనగరం పాలనా కాలంలో పేర్కొనదగిన కాపాలిక కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. అట్లాగే బెజవాడ కనకదుర్గ కు ప్రఖ్యాతి గాంచిన స్థలం.
విజయనగర కాలంలో శ్రీశైలం... శక్తి, తాంత్రిక అభ్యాసకులకు కేంద్రబిందువు అయ్యింది. పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా అది ప్రసిద్ధి చెందింది. శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా ప్రసిద్ధి చెందిన అలంపురానికి జోగులాంబ క్షేత్ర దేవత. జోగులాంబ పొందిన ప్రాచుర్యం, భక్తుల తాకిడి కారణంగా జోగులాంబ ఆలయం శక్తి పీఠాలలో ఒకటిగా ప్రఖ్యాతి పొందింది. అలంపురం స్థలపురాణం, స్కంద పురాణం ఈ విషయం చెప్తున్నాయి.
పిఠాపురం, ద్రాక్షారామం తెలుగు నేలపై ఇతర శక్తిపీఠాలుగా శ్రీనాధుని భీమఖండం పేర్కొంటున్నది. పిఠాపురంలోని దేవి పురుహూతికా దేవి. ద్రాక్షారామంలో మాణిక్యాంబ. పురాణాల్లోనూ, తెలుగు సాహిత్యంలోనూ చేరిన స్థానిక దేవతలు వీరు. అఖిలభారత సందర్భంలో అష్టాదశ పీఠాలలో ఆంధ్ర దేశంలో ఉన్నది ఒక్క శ్రీశైలం శక్తి పీఠం మాత్రమే.
తాంత్రిక సంప్రదాయాలు
శ్రీశైలంలో వేళ్ళూనుకున్న తాంత్రిక శైవ శాఖ కాపాలిక శాఖ. కాపాలికులను మహావ్రతులు అని కూడా అంటారు. కాపాలిక తాంత్రిక వ్యవస్థకు ఇది ప్రసిద్ధ స్థానం. ఇక్కడే కాపాలికులు అత్యంత ప్రాచీన కాలంలో తంత్రాన్ని అభ్యసించారు. శ్రీశైలం ఆలయ ప్రాకారం మీద ఉన్న శిల్పాలు, యోగాభ్యాసాన్ని చిత్రించేవి కూడా ఉన్నాయి. కాపాలికులు మహా భిక్ష స్వీకరిస్తారు. కపాల పాత్రతో బిక్ష స్వీకరిస్తారు. మద్యం, మాంసం సేవించే షాండులు వీరు. నిషిద్ధమైన మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మైధునం అనే ఐదింటిని వీరు ఆచరిస్తారు.
కర్మకాండలలో వారు ఒక స్త్రీ భాగస్వామితో లైంగిక క్రీడలో మమేకం అవుతారు. దీనికోసం వినియోగించే స్త్రీ సాధారణంగా నిమ్న కులంగా భావించే కులానికి చెందినదై ఉంటుంది. కాపాలికులకు నరబలి ఆచారం కూడా ఉండేది. భైరవుడు వీరి ప్రధాన దైవం. మానవాతీత శక్తుల కోసం భైరవుని ఆరాధిస్తారు. కడప జిల్లా (రేనాడు) లో మోపూరు లోని భైరవ ఆలయంలో క్రీస్తుశకం 13వ శతాబ్ది చివరి నాటికి భైరవుని మహాశివ మూర్తి పేర్కొనదగినది. ఈ విగ్రహం తప్పకుండా గోపురం తొలి అంతస్తులోకి చొచ్చుకుని వచ్చింది. విజయనగర యుగంలో ఈ భైరవ ఆలయం కాపాలికుల ప్రధాన స్థానంగా ఉంది. కాకతీయుల కాలంలో శ్రీశైలం వద్ద కృష్ణా నది ఉత్తర తీరంలో భైరవ, భద్రకాళి విగ్రహాల ప్రతిష్ట జరిగింది. ఇటీవల కాలం వరకు ఇక్కడ నరబలులు జరుగుతూ ఉండేవి.
శైవ మతానికి సంబంధించిన సిద్ధ లేదా నాథ సంప్రదాయం కూడా ఉండేది. పైన పేర్కొన్న కొన్ని క్షేత్రాలు ఈ సంప్రదాయానికి నిలయాలుగా ఉండేవి.
పై సమాచారం ఇప్పుడు హిందు మతంగా చెప్పుకుంటున్న మతంలో ఓ శాఖ అయిన శైవం... అనేక శాఖోప శాఖలుగా, సంప్రదాయాలుగా చీలిందని, అంతకు ముందు ఒక శాఖకు కేంద్రంగా ఉన్న క్షేత్రాలు... కొత్తగా అవతరించిన శాఖలకు కూడా కేంద్రాలుగా ఉండేవని అర్థమవుతున్నది. అట్లాగే హిందు మతంలోని మరోశాఖ అయిన వైష్ణవ దేవుళ్లు కులదైవాలుగా ఉన్నవారు సైతం శైవంలోని రకరకాల శాఖలను అనుసరించి ప్రోత్సహించారని కూడా తెలుస్తున్నది. మరీ ముఖ్యంగా ఒక ప్రాంతంలో ప్రజలు ఏ శాఖను అనుసరిస్తుంటే పాలకులు ఆ మత క్షేత్రాలకు దాన ధర్మాలు అధికంగా చేస్తూ ప్రోత్సహించారనీ అర్థమవుతుంది. అంటే రాజులు తాము అనుసరించే మతం లేదా శాఖకు ప్రాధాన్యం ఇవ్వమని జనాన్ని ఒత్తిడికి గురిచేయకుండా... ఆయా ప్రాంతాల్లో ప్రజామోదం ఉన్న మతాన్ని ప్రోత్సహించారన్నమాట. తద్వారా మైనారిటీల విశ్వాసాలను గౌరవిస్తూ... తమ అధికారానికి ఎదురుతిరిగే అవకాశం ఎవరికీ ఇవ్వకుండా రాజనీతిని ప్రదర్శించి... సుస్థిర పాలనను, శాంతి భద్రతలను అందించారన్నమాట!
Authorization