భారతదేశంలో చిత్రలేఖనం సామాజిక, ఆర్థిక, సాంకేతిక భావాల కారణంగా ఆవిర్భవించింది. ప్రాచీన మధ్య యుగాల్లో మతపరమైన, పౌరాణికమైన వస్తువులు చిత్రలేఖనంలో ప్రముఖ పాత్ర పోషించాయి. ప్రాచీన కాలంలో పెద్ద పెద్ద శిల్ప, కుడ్యచిత్రాలు పౌరాణిక వస్తువుల ఆధారంగా వస్తే, తర్వాతి కాలంలో చిన్న రూపంలో లౌకిక కళాకృతులు చోటుచేసుకున్నాయి.
అయితే యూరోపియన్లు రావడంతో భారతీయ కళ రూపురేఖలు చాలావరకు మారిపోయాయి. వారి రాక పరిపాలన లోనే కాక, కళా రంగంలోనూ... ముఖ్యంగా కళకు సంబంధించిన విద్యారంగంలో ఎన్నో మార్పులను తీసుకు వచ్చింది. దేశంలో వివిధ పట్టణాల్లో ప్రైవేట్ ఆర్ట్ స్కూళ్లను ఏర్పాటయ్యాయి. మొట్టమొదటి ఆర్ట్ స్కూల్ బ్రిటిష్ రెసిడెంట్ సర్ చార్లెస్ మాటెల్ 1788లో పూనా లో ప్రారంభించాడు. దాని తర్వాత కలకత్తాలో 1839లో, మద్రాసులో 1850లో, బొంబాయిలో 1856లో ఆర్ట్ స్కూళ్లు వెలిశాయి.1858 నుండి బ్రిటిష్ ప్రభుత్వం ఈ స్కూళ్ల ఆర్థిక అవసరాలను తీర్చే బాధ్యత నెత్తికెత్తుకుంది. ఆ విధంగా కళా విద్య ప్రభుత్వ దృష్టిలో పడి అండను సంపాదించింది.
మొదటిసారిగా భారతీయులకు లాంఛనంగా కళావిద్య ప్రవేశ పెట్టడంతో వివిధ సామాజిక ఆర్థిక నేపథ్యాలు ఉన్న విద్యార్థులు అందులో చేరడం ప్రారంభించారు. ఈ స్కూళ్లను ప్రారంభించ డంలో ఎలాంటి ఉద్దేశాలు ఉన్నప్పటికీ, యూరోపియన్ విద్యాసంబంధ కళలు విద్యార్థులకు పరిచయమయ్యాయి. డ్రాయింగ్, మోడలింగ్ ప్రాథమిక డిజైనింగ్, సాంకేతిక డిజైనింగ్, శిలా ముద్రణ, వుడ్ కార్వింగ్ వంటివి ఆర్ట్ స్కూల్ కోర్సులో భాగమయ్యాయి. రాజా రవివర్మ, ఎంవీ దురంధర్, ఏపీ బాక్చీ, బీపీ బెనర్జీ, గణపత్ రావు మహతే, ఫిజీరామ్ వంటి కొత్త కళాకారుల చిత్రాలలో కొత్త ఆర్ట్ విద్య శిక్షణ ప్రభావం వ్యక్తమైంది. దేశీయ పౌరాణిక వస్తువుల సమ్మేళనంతో, చిత్రాలను విద్యాసంబంధ శైలిలో చిత్రించడం ప్రారంభమయింది. విద్యావంతులైన మధ్యతరగతి, పాలక వర్గాల వారు కొత్త రస దృష్టికి ప్రాధాన్యం ఇచ్చేవారు. వారు కొత్త కళను ఆహ్వానించారు. ముద్రణ సాంకేతికత. వ్యాపారీకరణ ప్రయోగంతో కళ ప్రజాదరణ పొందింది.
జనసామాన్యంలో కొత్త కళ ఆదరణ పొందింది. అయితే, అది కొందరి విమర్శకు లోనయింది. ఆ చిత్రాలు పూర్తిగా భారతీయ లేక యూరోపియన్ లక్షణాలు కలిగి లేవని వారు దుయ్యబట్టారు. జాతీయ సంప్రదాయాన్ని ఉదారవాది అయిన ఆంగ్ల చిత్రకళ ఉపాధ్యాయుడు ఈ బీ హావెల్, ఆనంద కుమారస్వామి, సిస్టర్ నివేదిత, అవనీంద్ర నాథ్ ఠాగూర్ వంటివారు సమర్థించారు. సంప్రదాయ భారతీయ చిత్రలేఖనంలోని గొప్పదనం లో వీరికి ఎంతో నమ్మకం ఉండేది. కలకత్తా ఆర్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ గా ఈ బీ హావెల్ భారతీయ కళలు స్వీకరించి ఆదరణ కల్పించారు. కొత్త కళను కనుగొనడంలో కన్నా తమ కళను అభివృద్ధి చేసుకోవడంలో భారతీయ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవాడు. భారతీయ వస్తువు, ప్రాచ్య శైలి మేలు కలయికలో అద్భుత చిత్రాలు రూపుదిద్దు కున్నాయి. వాటర్ కలర్స్, వాష్ టెక్నిక్, ఓపెన్ కలర్స్ ప్రయోగం వల్ల చిత్రలేఖనం తొందరగా మార్పులు పొందటాన్ని దేశం చూసింది. ఇలాంటి చిత్రాలు బెంగాల్ సంప్రదాయ చిత్రలేఖనం అన్న పేరుతో మొదటగా కలకత్తాలో ప్రారంభమయ్యాయి. తర్వాత దేశమంతటా వ్యాపించాయి. అలా మొత్తం దేశంలో రెండు సంప్రదాయాలు పరిణతి పొందాయి. అందులో మొదటిది ఆంగ్లో-ఇండియన్ సంప్రదాయమయితే రెండోది బెంగాల్ స్కూలు అన్నారు.
దేశంలోని చిత్రలేఖన ధోరణుల కొనసాగింపు గా తెలుగు ప్రాంతంలో కూడా చిత్రలేఖనం అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతంలో రాజమండ్రి, మచిలీపట్నం, హైదరాబాదులో చిత్రకళా ధోరణలు పెంపొందుతాయి.
-మౌక్తిక్
Authorization