తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ తర్వాత మూడవ అతిపెద్ద జిల్లా నిజామాబాద్. ప్రస్తుతం నిజామాబాద్లో కామారెడ్డి, నిర్మల్ అనే రెండు కొత్త జిల్లాలు ఏర్పాడ్డాయి. ఈ జిల్లాను పూర్వం ఇందూరు, ఇంద్రపురి అని పిలిచే వారు. చారిత్రక శిల్ప సంపదకు ఇక్కడ కొదవలేదు. రాజులు ఏలిన సంస్థానాలలో చారిత్రక కట్టడాల ఆనవాళ్ళు దర్శనమిస్తాయి. క్రీ.పూ.3000 నాటికే జిల్లాలో మానవుల ఉనికికి సంబంధించిన ఆధారాలున్నాయి. అందుకు చరిత్రకారులకు దొరికిన 'కెయిర్న్' లు (చనిపోయిన వారిని, వారికి ఇష్టమైన వస్తువులతో కలిపి పూడ్చి పెట్టి దాని చుట్టూ కొన్ని రాళ్ళను అమర్చడం) ప్రత్యేకం. ఒక ఉదాహరణ ఈ జిల్లాలో రాష్ట్ర కూటులు, బోధన్ చాళుక్య, కల్యాణి చాళుక్యులు, కాకతీయుల ఆలయాలు, ముస్లిం నిర్మాణాలు వెలిశాయి.
నిజామాబాదు నగరంలో చూడడానికి చాలా ప్రదేశాలున్నాయి. నీలకంఠేశ్వరాలయం, సారంగపూర్ హనుమాన్ మందిరం, నిజాం సాగర్ ప్రాజెక్టు... శ్రీరాంసాగర్ ప్రాజెక్టు.. పోచారం, అలీసాగర్, డిచ్పల్లి రామాలయం, తిలక్ గార్డెన్ వద్ద ఉన్న మ్యూజియం, దోమకొండ కోట, భిక్కనూరు శ్రీ సిద్దరామేశ్వర దేవాలయం, మల్లారం అడవి, అశోక్ సాగర్, సారంగాపూర్, ఆర్మూరు రోడ్డులోని శిలలు మొదలైనవి. వీటిలో కొన్నింటి విశేషాలు...
నిజామాబాద్ ఖిల్లా : చారిత్రక, మతపర ప్రాముఖ్యం కల్గిన ప్రదేశం నిజామాబాద్ ఖిల్లా. హైదరాబాద్ నుండి సుమారు 200 కి.మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కోట మహారాష్ట్ర సరిహద్దులలో ఉన్న కారణంగా అక్కడనుండి కూడా పర్యాటకులు ఎక్కువగా వస్తారు. 10 వ శతాబ్దానికి చెందిన ఈ కోట మొదట చిన్న కొండపై వెలిసింది. రాష్ట్రకూట వంశానికి చెందిన రాజులు ఈ కోటను నిర్మించారు. ఈ కోట చాలా హుందాగా సుమారు 300 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఆనాటి వైభవానికి నిలువెత్తు నిదర్శనం.
హెరిటేజ్ మ్యూజియం : పురా వస్తు లేదా హెరి టేజ్ మ్యూజి యంను 2001 లో స్థాపించారు. మానవుని అభివృద్ధి ఎలా జరిగిందనేది తెలుసుకోవడానికి ఈ మ్యూజియం పూర్తి సమాచారం అందిస్తుంది. పర్యాటకులు ఈ మ్యూజియాన్ని తప్పక చూడాలి. దీంట్లో మూడు విభాగాలుం టాయి. మొదటిది ఆర్కియోలా జికాల్, రెండవది శిల్పాల గేలరీ, మూడవది బ్రాంజ్ గేలరీ. ప్రతి విభాగం కూడా పట్టణం పూర్వం నుంచి ఇప్పటి వరకు ఏ రకంగా అభివృద్ధి చెందిందో తెలుపుతుంది. ఆది మానవుడు ఉపయోగించిన ఆయుధాలు, ఇతర వస్తువులు ఇందులో ఉన్నాయి. ఇక్కడ శాతవాహన, కాకతీయ, కుతుబ్ షాహీ కాలం నాటి నాణేలను తిలకించవచ్చు.
అలీసాగర్ : బాసర నుంచి 2 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మానవ నిర్మిత జలాశయం 1930లో కట్టబడింది. నగర జీవితానికి దూరంగా ప్రశాంత వాతావరణం ఈ జలాశయం కల్పిస్తుంది. ఇక్కడ వన్య ప్రాణులతో పాటు చక్కగా తీర్చిదిద్దిన ఉద్యానవనాలు, ఓ దీవి, కొండపైన ఉన్న అతిధి గృహం పర్యాటకులను ముగ్దులను చేస్తాయి. వీటితో పాటు జింకల పార్కు, ట్రెక్కింగ్, జలక్రీడల సదుపాయాలు ఉండటం ప్రత్యేక ఆకర్షణ.
మల్లారం అడవి: నిజామాబాదు నుండి 7 కిలోమీటర్ల దూరంలో మల్లారం అడవి ఉంటుంది. మల్లారం ప్రకృతి ప్రేమికులకు సరైన స్థలం. మల్లారం అడవిలో 1.45 బిలియన్ సంవత్సరాల పురాతనమైన శిల ప్రకృతి ఒడిలో నుంచి స్వాగతం పలుకుతున్నట్లు కనిపిస్తుంది. సాహసిక పర్యటనలకు, ఉత్తేజితమైన పిక్నిక్కులకు చాలా అనువైన ప్రదేశం.
బాసర: నిర్మల్ జిల్లాలోని ముఖ్య పుణ్యక్షేత్రం బాసర. నిజామాబాదు పట్టణానికి 35 కి.మీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంటుంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీటర్ల దూరంలో బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రం ఉంటుంది. భారత దేశంలో గల రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉంటే, రెండవది బాసరలో ఉంది. ఇక్కడ జ్ఞాన సరస్వతి కొలువు తీరి ఉంది. ఇది చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. ఈ మందిరం సాదాసీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది. ఇక్కడికి తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి వస్తూ ఉంటారు.
Authorization