జలియన్వాలాబాగ్ చూడడం నా పదిహేడేండ్ల కల. విద్యార్థి ఉద్యమంలో పని చేసే సమయంలో భగత్సింగ్ గురించి విన్నప్పుడు రోమాలు నిక్కపొడిచేవి. దేశం కోసం ఉరికంబాన్ని ముద్దాడిన ఆ యువకిశోరం నడయాడిన నేలను ఎప్పుడు సందర్శించాలా అని మనసు ఉవ్విళ్ళూరేది. భగత్సింగ్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన ఆ ఘటనా స్థలాన్ని చూసే అవకాశం అనుకోకుండా వచ్చింది. వెంటనే హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు అమృత్సర్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుని ఆ అమరుల త్యాగాల గుర్తులను కండ్లారా చూసి వచ్చాను. అంతేకాదు అక్కడి స్వర్ణదేవాలయం, వాఘా బార్డర్ మరో ముఖ్యమైన ప్రదేశాలు. ఆ విశేషాల సమాహారం ఈ వ్యాసం.
జలియన్ వాలాబాగ్
పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ ఓ చారిత్రక ప్రదేశం.అంతకు మించి భారతీయుల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపిన ప్రదేశం. త్యాగాల నెలవు. భారతీయుల రక్తంతో తడిసి ముద్దయిన నేల. అక్కడ అడుగుపెట్టగానే... ఆనాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా కండ్ల ముందు కదిలాయి...
అది 1919, ఏప్రిల్ 13... పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ లో జలియన్ వాలాబాగ్(పార్క్)లో దాదాపు 20 వేలమంది ప్రజలు సమావేశమయ్యారు. ఆంగ్లేయ పాలనలో భారతీయులు ఎంతటి హీనమైన స్థితిలో బతకాల్సి వస్తుందో ప్రముఖ నేతల ఉపన్యాసాలను వినడం కోసం ప్రజలంతా అక్కడకు చేరుకున్నారు. అలాగే అన్యాయంగా భారతీయులను అరెస్టు చేస్తున్న రౌలత్ చట్టానికి నిరసిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశాన్ని అడ్డుకునేందుకు జనరల్ డయ్యర్ నాయకత్వంలో 90 మంది సైనికులు అక్కడికి చేరుకున్నారు.
చంటి పిల్లలతో వచ్చిన తల్లులు, పెద్దలు, ముసలి వారు ఇలా వయసుతో నిమిత్తం లేకుండా అక్కడికి ప్రజలు చేరుకున్నారు. అందరూ శ్రద్ధగా నాయకుల ఉపన్యాసాలు వింటున్నారు. జలియన్ వాలా బాగ్ ఇరుకైన సందులో ఉంటుంది. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కాల్పులు మొదలయ్యాయి. ఇరుకైన సందుల నుండి పారిపోవడానికి కూడా అవకాశం లేదు. కొంత మంది తమ ప్రాణాలను కాపాడుకోడానికి అక్కడే ఉన్న ఓ బావిలో దూకారు. అయినా వదల్లేదు బ్రిటిష్ ముష్క రులు. వందలమంది ఆ కాల్పుల్లో మరణించారు. గాయపడినవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 379 మంది (337 పురుషులు, 41 మంది బాలురు, 6 వారాల పసికందు) మర ణించారు. అంతేకాకుండా 200 మంది గాయపడ్డారు. అక్కడ స్మారక చిహ్నంపైన రాసిన సమాచారం ప్రకారం ఆ పార్కులో ఉండే బావిలోంచి 120 శవాలను బయటకు తీశారు. కాల్పుల కారణంగా నగరంలో కర్ఫ్యూ విధించారు. దాంతో గాయపడిన వారిని కనీసం ఆస్పత్రికి తీసుకెళ్ళడం కూడా సాధ్యం కాలేదు.
ఇలా డయ్యర్ పాశవిక చర్య ఫలితంగా భారతీయుల రక్తంతో ఆ నేల ముద్దయింది. స్వర్ణదేవాలయానికి అతి సమీపంలో ఉండే ఈ జలియన్వాలాబాగ్ రోడ్డు పక్కనే పెద్ద పెద్ద అక్షరాలతో స్ఫూర్తినిచ్చే విధంగా ప్రవేశ ద్వారం ఉంటుంది. లోపలకు వెళ్ళే కొద్ది ఎంతో విశాలపైన పార్కు. పచ్చదనంతో నిండి ఉంటుంది. ఆనాడు సిపాయిలు జరిపిన కాల్పులకు గుర్తుగా అక్కడక్కడ పార్కులో తుపాకీలు పట్టుకున్న సిపాయిల ఆకారాలు కనిపిస్తాయి. కాల్పులకు భయపడి అక్కడి బావిలో పడి చనిపోయిన వారికి గుర్తుగా ఆ బావి చుట్టూ కంచెవేసి 'అమరుల బావి' గా నామకరణం చేసి సందర్శకులు చూడటానికి అను కూలంగా ఏర్పాటు చేశారు. పార్కు మైదానంలోనే ఎత్తైన అమరుల స్తూపం ఉంది. అలాగే ఓ అమర జ్యోతి అక్కడ ఇరవైనాలుగ్గంటలూ వెలుగుతూనే ఉంటుంది. బుల్లెట్లు తగిలి రంధ్రాలు పడిన గుర్తులు అక్కడి ప్రతి గోడపైనా కనిపిస్తాయి.
ఆ పార్కులో నడిచినంత సేపు ఆనాటి జ్ఞాపకాలతో మనసు ఉద్వేగభరితమైంది. బ్రిటిషు వారి అమానవీయ చర్యపై లోలోన ఆగ్రహం రగుల్కొంది. ఇంత దారుణానికి ఎలా ఒడగట్టారా అనిపించింది.బ్రిటిష్ వారి తూటాలకు బలైన భారతీయులను తలచుకుంటే ఒక్కసారిగా గుండె బరువెక్కింది. ప్రతి గోడలోనూ వందేమాతరం అనే శబ్దం ధ్వనించింది. ఆనాటి వారి త్యాగాలతో ఇప్పుడు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న ప్రతి భారతీయుడు ఒక్కసారైనా జలియన్ వాలా బాగ్ను సందర్శించి తీరాల్సిందేననిపించింది.
స్వర్ణదేవాలయం
అమృత్సర్లోని మరో అద్భుతమైన కట్టడం స్వర్ణదేవాలయం. సిక్కు మతస్తులకు అతి పవిత్రమైన ఈ అలయానికి నాలుగు వందల ఏండ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయ నిర్మాణంలో ఏడు వందల కిలోల బంగారం వాడారు. బహుశా అందుకే దీనికి స్వర్ణదేవాలయం అని పేరు వచ్చివుంటుంది. ఈ ఆలయానికి సిక్కు మతస్తులే గాక దేశ నలుమూలల నుంచి ఎంతో మంది వస్తుంటారు. రోజూ ఈ ఆలయాన్ని మూడున్నర లక్షలమంది దర్శిస్తుంటారు. పండుగరోజుల్లో అయితే వీరి సంఖ్య పది లక్షలవరకు వుంటుంది. ఈ ఆలయ వార్షికాదాయం ఐదు వందల కోట్ల రూపాయలకు పైనే వుంటుంది. పండగ దినాలలో ఆదాయం నాలుగు కోట్లు వుంటుంది. ఈ అమృతసర్ స్వర్ణ దేవాలయం సంపద విలువ వెయ్యి కోట్ల రూపాయల పైనే అన్నది అంచనా.
ఈ దేవాలయం చుట్టూ పాలరాతితో కట్టిన ఎతైన ప్రహరీ గోడ ఉంది. అది ఎంతో కళాత్మకంగా అందంగా చూడటానికి అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని శుభ్రతకు మారుపేరుగా చెప్పుకోవచ్చు. లోపల అడుగుపెట్టడానికి ముందు కాళ్ళు కడుక్కోడానికి ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అందులో కాళ్ళు కడుక్కొని లోపలికి అడుగుపెట్టాలి. మరో విషయం ఏమిటంటే ఈ ఆలయంలో ఉన్నంతసేపు ప్రతి ఒక్కరూ తలపై వస్త్రాన్ని ధరించాల్సిందే. మరో విశేషం ఏమిటంటే ఈ ఆలయం 24 గంటలు తెరిచే ఉంటుంది. అలాగే ఇక్కడి లంగర్ (రొట్టెలు), నేతితో చేసిన ప్రసాదం అత్యంత మధురం. వాటితోనే మన కడుపు నింపుకోవచ్చు. ప్రహరి దాటి సుమారు అరకిలో మీటరు నడిస్తే తప్ప ఆలయంలోకి ప్రవేశించలేం. దారిలో వెళ్ళే టప్పుడు సందర్శకులకు అక్కడక్కడ మంచినీటి ఏర్పాటు ఉంటుంది. ఆలయానికి చుట్టూ నీటి కొలను. కొందరు అందులో స్నానాలు చేసి ఆలయంలోకి వెళుతుంటారు. ఆలయం లోపల ఉండే గురునానక్ సమాధి వద్ద నిత్యం పద్యాలను ఆలపిస్తూ ఉంటారు. ఆలయం పైన రెండు అంతస్థుల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే లోపల ఫొటోలు తీసుకోవడానికి అనుమతి ఉండదు. ఆ ఆలయం రాత్రి పూట విద్యుత్ కాంతులతో ఎంతో శోభాయమానంగా కనిపిస్తుంది.ఇక్కడ సామూహిక వంటశాల ఉంటుంది. 24 గంటలు లంగర్(రొట్టెలు) సందర్శకులకు ఉచితంగా అందిస్తుంటారు. దేశంలోనే పర్యాటకులు సందర్మించే దాంట్లో ఈ ఆలయం మూడో స్థానంలో ఉంది. ఇంతటి ఆద్భుతమైన ఈ కట్టడాన్ని గురు అర్జున్ సాహెబ్ డిజైన్ చేశారు. 1588లో దీన్ని కట్టడం ప్రారంభిస్తే 1601లో పూర్తి చేశారు.
వాఘా బార్డర్
ఇండియా పాక్ సరిహద్దుల్లో పంజాబ్ రాష్ట్రంలోని అట్టారి అనే ప్రాంతంలో ఉండే వాఘా బార్డర్కు అత్యంత ప్రాధాన్యం ఉంది. అట్టారి చేరుకోవాలంటే అమృత్సర్ నుంచి అరగంట ప్రయాణం. ఇక్కడి నుంచి లాహోర్ కేవలం 23 కిలో మీటర్లు మాత్రమే. ఈ బార్డర్ వద్ద ప్రతి రోజు సాయంత్రం 5:30 గంటల నుంచి 6 గంటల వరకు అటు పాకిస్తాన్ సేనలు, ఇటు ఇండియా సేనలు కవాతు చేస్తుంటారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు ఉదయం నుంచే వేల సంఖ్యలో పర్యాటకులు అక్కడకు చేరుకుంటారు. ఆ సమయంలో దేశభక్తి గీతాలతో, ఆట పాటలతో ఆ ప్రాంతం ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుంది. అటు పాక్ ప్రజలు ఇటు భారతీయులు నినాదాలు చేస్తుంటారు. ఈ నినాదాల మధ్య ఇరుదేశాలు తమ తమ జాతీయ జెండాలను ఎగురవేస్తారు.
భారత్ సరిహద్దు గేటుకు కొంత దూరంలో పాక్ సరిహద్దు ద్వారం ఉంటుంది. వారు తమ జాతిపితగా భావించే మహ్మద్ ఆలీజిన్నా ఫొటోతో పెద్ద గోడ కనిపిస్తుంది. దానిపైన ఆజాదీ అని రాసి ఉంటుంది. కవాతు ప్రారంభమైన తర్వాత పావుగంట సేపు రెండు వైపుల వారు సరిహద్దు గేట్లను తెరిచి ఉంచుతారు. ఆ సమయంలో మన సైనికులు, పాక్ సైనికులు ఇద్దరూ స్నేహపూర్వకంగా కరచాలనం చేసుకుంటారు. ఆగస్టు 15 రోజు ఇక్కడ జరిగే సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఆ బార్డర్కు మరో ప్రత్యేక ఏమిటంటో మొదటిసారి ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళడానికి రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు. వీసా, పాస్పోర్ట్ ఉన్నవారు ఇందులో ప్రయాణం చేయవచ్చు.1976 సిమ్లా ఒప్పందం తర్వాత సంఝౌతా ఎక్స్ప్రెస్ వారానికి రెండు సార్లు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇరు దేశాల మధ్య రాకపోకలు జరుగుతాయి.
హైదరాబాద్ నుంచి అమృత్సర్ వరకు ప్రయాణం కాస్త కష్టంగా అనిపించినా అక్కడకు వెళ్ళిన తర్వాత చూసిన ఈ మూడు ప్రదేశాలు స్ఫూర్తిని, ఆనాటి చరిత్రను, దేశ భక్తిని మనసునిండుగా నింపాయి.
- సలీమ
Authorization