ప్రాచీన వైభవాన్ని వెనక్కి తీసుకురాలేం. రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు. రాజరికం నశించింది. కానీ వాళ్లు నడయాడిన నేల మాత్రం సజీవంగానే ఉంది. నాటి పాలనకు సాక్ష్యంగా నిలిచిన కోట గోడలు ఓ సారి తొంగి చూడమని ఆశగా పిలుస్తున్నాయి. కాస్త సమయం కేటాయించి నాతో కబుర్లాడితే గుండెల్లో దాచుకున్న ఏండ్ల చరిత్రను కథలు.. కథలుగా... వినిపిస్తానని మరి మరీ చెబుతోంది పానగల్ ఖిల్లా.
సామరస్యానికి ప్రతీక...
వనపర్తి జిల్లా కేంద్రానికి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉంది పానగల్ కోట. ఈ కోటను ఎత్తైన దుర్గం మీద నిర్మించారు. కోట చూడటానికి గుర్రపు నాడా ఆకారంలో ఉండి, తూర్పు దిక్కున రెండు మొనలను కలిగి ఉంటుంది. కొండపై 20 అడుగుల ఎత్తున్న ప్రాకారాలను నిర్మించారు. సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తులో, ఐదు చదరపు మైళ్ళ వైశాల్యంలో పెద్ద పెద్ద బండరాళ్ళతో నిర్మించారు. కళ్యాణి చాళుక్యులు, రాష్ట్ర కూటులు, కాకతీయులు, ముసునూరి నాయకులు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, బారీద్ షాహీలు, మొఘలాయిలు, అసఫ్ జాహీల పాలనలో కొనసాగిన ఈ కోట వందకు పైగా చిన్న, పెద్ద యుద్ధాలను చవిచూసిందని పరిశోధకుల అంచనా. వివిధ కాలాల్లో పరిపాలించిన రాజులు వారి వారి శిల్ప కళా శైలికి అనుగుణంగా కొన్ని నిర్మాణాలు చేశారు. ఆయా కాలాలలోని రాజులు ప్రతిష్టించిన ఉర్దూ, కన్నడ, తెలుగు శాసనాలు మనకు కోటలో కనిపిస్తాయి. హిందూ రాజుల కాలంలో అనేక మందిరాలు, అద్భుతమైన మహళ్ళు , సైనిక స్థావరాలు, అశ్వ, గజశాలల నిర్మాణాలు... ముస్లిం రాజుల పాలనలో మసీదులు, దర్గాలు, రాణి మహళ్ళ నిర్మాణాలు కనిపిస్తాయి.
ముండ్ల గౌని ద్వారం...
శత్రుదుర్బేధ్యమైన ఈ కోటలో 60 దాకా బురుజులు ఉన్నాయి. ఎత్తైన దుర్గం మీద విశాలమైన పల్లం కలిగి అందులో బావులు, గుడులు, గోపురాలు, మసీదులు ఉంటాయి. కోట తూర్పు భాగంలో నాలుగు ప్రాకారాలు, వాటిపై ఫిరంగుల స్థావరాలు, సైన్యానికి ఏర్పాటు చేసిన విడిదిశాలలు కనిపిస్తాయి. చాలా విశాలమైన ఈ కోటలోకి ప్రవేశించడానికి సప్త ప్రాకారాలు దాటాల్సి ఉంటుంది. వీటిలో చాలా వరకు నేడు శిథిలమై ఉన్నాయి. కాని ప్రధాన ప్రాకార ద్వారం మాత్రం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఈ ద్వారానికి ''ముండ్ల గౌని'' ద్వారమని పేరు. ఈ ద్వారంపై ఉన్న కళానైపుణ్యం ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటుంది. ద్వారం తలుపులపై బంగారం, పంచలోహాలతో చేసిన చెక్కడాలు, తాపడాలు ఉండేవట.
రామ గుండం...
కోటలో ఒకే రాతిపై పెద్ద నడబావిని తవ్వించి దానికి రామ గుండం అని పేరు పెట్టారు. నాడు రామగుండంలోని నీటిని తోడి పల్లపు ప్రాంతంలో ఉన్న భూములకు పారించి, పంటలు పండించేవారు. ఇప్పటికీ బావికి రెండువైపులా పెద్ద మోట, చిన్న మోట అనే కట్టడాలు కనిపిస్తాయి. రామ గుండం రాతిపై దక్షిణం వైపు పాదముద్రలు ఉన్నాయి.
ఖైరాత్ఖాత్ శాసనం...
ఈ కోటలో చాలా శాసనాలు లభించాయి. ఒకటి తెలుగు, కన్నడ మిశ్రమలిపిలో వున్న శాసనం. ఇది శిథిలమైనందున, అందులోని విషయం పూర్తిగా తెలిసిరాలేదు. కోటలో గణపతి గుండు అను మరో శాసనం ఉంది. దీనికి ''ఖైరాత్ఖాన్ శాసనం'' అని పేరు. ఇది తెలుగు, కన్నడ, అరబిక్ భాషల మిశ్రమంగా ఉన్నట్టు చెబుతారు. కోటలో మక్కా మసీదు పేరుతో నిర్మించిన ప్రార్థనామందిరం ఉంది. అది ఇప్పటికీ చెక్కుచెదరలేదు. మసీదుపై ఉన్న మినారులను మాత్రం కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ మసీదు ముందు ప్రధాన ద్వారానికి రెండువైపుల రాతి సింహాలు ఉన్నాయి. ఇవి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
ఉయ్యాల మండపం...
కోటలో నాటి రాజుల విరామ సమయాలు గడపడానికి, సరదాగా ఊగడానికి ఒక పెద్ద ఊయలను, దానికో ఆరామాన్ని నిర్మించారు. దీనికి ఉయ్యాల మండపం అని పేరు. దుర్గంలో దర్గాలు... హజ్రత్ అగా దావుద్ దర్గా ఉంది. ఇక్కడికి హిందూ, ముస్లిం భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. దుర్గం దిగువ భాగంలోనూ ప్రసిద్ధ బాలపీర్ల దర్గా ఉంది. హిందూ, ముస్లింల సమైక్యతకు ఈ దర్గాలు ప్రతీకలుగా నిలుస్తున్నాయి.
-రూప
7661910634
Authorization