పాతఢిల్లీ - కొత్త ఢిల్లీకి మధ్యలో సప్థర్ సంగ్ జాఫర్ మార్గ్లో ఈ కోట ఉంది. మేం విడిది(అజరు భవన్) చేసిన ప్రదేశానికి కేవలం కిలోమీటర్ దూరంలోనే ఆ ప్రాంతం ఉండటంతో ఉదయాన్నే కాలి నడకన అక్కడికి బయలుదేరాం. టికెట్ తీసుకొని కోటలోకి వెళ్లిన మాకు తివాచిలాంటి పచ్చని గడ్డి స్వాగతం పలికింది. రాత్రంతా కురిసిన మంచుకు కావొచ్చు ఆ పచ్చని గడ్డి సూర్యకిరణాలకు మెరుస్తూ కనిపించింది. ఈ కోటను ఢిల్లీని పాలించిన ఫిరోజ్షా తుగ్లక్ నిర్మించడం వల్ల దీనికి 'ఫిరోజ్షా కోట' అనే పేరు వచ్చింది. ఫిరోజ్షా రాజు అప్పటి వరకు ఉన్న రాజధాని నగరం దౌలతాబాద్ రక్షణ పరంగా పటిష్టంగా లేకపోవడం, తరచూ శత్రువుల దాడులకు గురవ్వడంతో, రాజధాని నగరాన్ని దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాడు, దీనికి ఫిరోజాబాద్ అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది. ఈ కోట చుట్టూ రక్షణగా ఉండేందుకు దాదాపు 15 అడుగుల ఎత్తులో ప్రహరీ గోడని నిర్మించారు. రాజులు పోయి, రాజ్యాలు గతించినప్పటికీ ప్రతి నిత్యం వందలాది మంది పర్యాటలను ఆకర్షిస్తున్నది. ఈ కోటలో క్రీ.పూ. 3వ దశాబ్దానికి చెందిన అశోకా స్తంభం ప్రత్యేక ఆకర్షణ. మూడు అంతస్థుల భవనం మీద దీన్ని నిలిపారు. పిరమిడ్ ఆకారంలో ఈ భవనాన్ని ఫిరోజ్షా ప్రత్యేకంగా నిర్మింపజేశాడట. ఈ స్థూపంపై మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కాలంనాటి నియమాలు చెక్కబడ్డాయి. 13 మీటర్ల ఎత్తు, 65 మీటర్ల వ్యాసంతో ఉన్న ఈ ఏకశిల స్తంభాన్ని అశోకుడు ఏర్పాటు చేశారు. మెరుగుపెట్టిన ఇసుకరాయితో నిర్మించిన ఈ స్తంభం ఏండ్లు గడిచినా చెక్కుచెదరకుండా ఉంది.
ఇండియా గేట్...
ఫిరోజ్షా కోట తర్వాత మా ప్రయాణం ఇండియా గేట్ వైపు సాగింది. రాజధాని నగరానికి తలమానికంగా ఉన్న ఇండియా గేట్ చూడచక్కని ప్రదేశాలలో ఒకటి. మొదటి ప్రపంచ యుద్ధం, ఆఫ్ఘన్ యుద్ధాల్లో ఈ దేశం తరపున పాల్గొని దాదాపు 90 వేల మంది సైనికులు మరణించారు. ఆ యుద్ధజవానుల స్మత్యర్థం ఈ కట్టడాన్ని నిర్మించారు. 42 మీటర్ల ఎత్తు ఉన్న ఈ అపురూప కట్టడాన్ని భరత్పూర్ ఎర్రరాయితో నిర్మించారు. ఢిల్లీలో అనేక కట్టడాలకు రూపకల్పన చేసిన ఎడ్విన్ ల్యుటెన్స్ ఈ కట్టడానికి రూపకల్పన చేశాడు. నిర్మాణానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టిన ఈ స్మారక కట్టడంపై... యుద్ధంలో మరణించిన సైనికుల అందరి పేర్లు లిఖించారంటే ఎంత అపురూపమో మాకు అర్థమైంది. మొదట ఈ కట్టడానికి 'ఆలిండియా మెమోరియల్ వార్' అనుకున్నప్పటికీ క్రమంగా ఇది 'ఇండియా గేట్' గా ప్రాచుర్యంలోకి వచ్చినట్లు తెలిసింది. ఈ స్మారక కట్టడం కింద నిత్యం 'అమర జవాన్ జ్యోతి' వెలుగుతూ ఉంటుంది. నిర్మాణ సమయంలో ఈ జ్యోతి ఆలోచన లేకపోయినప్పటికీ 1971లో 'ఇండియా-పాక్' మధ్య జరిగిన యుద్ధం తర్వాత అమర్ జవాన్ జ్యోతిని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆగస్టు 15, జనవరి 26న జెండా ఆవిష్కరణల సందర్భంగా టీవీల్లో చూసే మాకు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల కోసం నిర్మించిన ఆపురూపమైన కట్టడాన్ని దర్శించుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చింది.
కుతుబ్ మీనార్...
కుతుబ్మీనార్ ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకల కట్టడం. ఇది ఇండో-ఇస్లామియా నిర్మాణాలకు ఒక అపురూపమైన ఉదాహరణ. ఢిల్లీ లోని మెహ్రౌలీ వద్ద గల కుతుబ్ కాంప్లెక్స్లో ఉంది. యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో 'కుతుబ్ మీనార్' ఒకటి. ఎర్ర ఇసుక రాయి, పాలరాళ్ళను దీని నిర్మాణంలో వాడినట్టు దాన్ని చూస్తే తెలిసింది. ఢిల్లీని పాలించిన కుతుబుద్దీన్ ఐబక్ దీన్ని నిర్మించడంతో అతని పేరు మీదుగా 'కుతుబ్ మీనార్' అనే వచ్చింది. వాస్తవానికి కుతుబ్ అనగా 'ధవం' అని, మీనార్ అనగా 'స్తంభం' అని అలా కూడా దీనికి 'కుతుబ్ మీనార్' అనే పేరొచ్చిందని ప్రతీతి. 237.8 అడుగుల ఎత్తున మొత్తం ఐదు అంతస్తులుగా ఉన్న ఈ కట్టడాన్ని ఎక్కేందుకు 399 మెట్లు ఉన్నాయి. ఈ నిర్మాణం వెనుక ఇద్దరి రాజుల కృషి ఉన్నట్టు తెలిసింది. 1981 వరకూ ఈ మీనార్ను ఎక్కేందుకు సందర్శకులను అనుమతినిచ్చే వారట కానీ 1981 డిసెంబర్ 4న తారీఖున జరిగిన తొక్కిసలాటలో 45 మంది మరణించడంతో అప్పటి నుంచి దీన్ని ఎక్కేందుకు నిషేధం విధించారు. దీనికి తోడు వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ఈ కట్టడం నిరంతరం ఎక్కి, దిగుతున్న సందర్శÛకుల వలన కట్టడానికి జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని పైకి ఎక్కేందుకు నిషేధించారని తెలిసింది. ఈ కట్టడానికి ఉన్న మరో ప్రత్యేకత ప్రతి ఏడాది జూన్ నెలలో 22 వ తేదీన ఈ మీనార్ నీడ భూమి మీద పడదట. ఈ కట్టడం 5 డిగ్రీలు వంపు కలిగి వుండటం వలన భూమధ్య రేఖకు అటు ఇటుగా సూర్యుడి చలనం వలన దీని నీడ ఆ ప్రత్యేక రోజున మాత్రం భూమి మీద పడదు. ఇది మన దేశంలో ప్రాచీన నిర్మాణ శాస్త్రం, ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
వందేండ్లనాటి ఇనుప స్తంభం...
ఈ కుతుబ్ మీనార్ ఆవరణంలోనే వున్న మరో అద్భుతం ఇనుప స్తంభం. 4వ శతాబ్దానికి చెందిన ఈ ఇనుప స్తంభం ఎండకు ఎండినా, వానకు తడిసినా చెక్కుచెదరకుండా అలాగే ఉంది. ఇది కూడా మన పూర్వీకుల లోహ శాస్త్ర విజ్ఞానానికి మచ్చుతునక, ఈ స్తంభంపై బ్రహ్మీలిపిలో రాయబడిన శాసనాధారాల ప్రకారం పూర్వం పేరు విష్ణు ధ్వజమని తెలుస్తుంది. ఇండో-ఇస్లాం కళా సంపదను చాటి చెప్పేందుకు ఈ ప్రాంతంలో దీన్ని ప్రతిష్టించినట్లు తెలుస్తున్నది.
భగత్సింగ్ స్మృతి వనం హుస్సేనివాలా...
రాజులూ, రాజ్యాల చరిత్రకు సజీవ సాక్షంగా నిలిచిన కోటలు, నిర్మాణాలను చూసిన మేం తర్వాత ప్రయాణాన్ని ఈ దేశ యువతకు ఆదర్శంగా నిలిచిన భగత్సింగ్, రాజ్గుర్, సుఖ్దేవ్ల స్మారక నిర్మాణం కొలువుదీరిన హుస్సేన్వాలావైపు మళ్లించాం. హుస్సేనివాలా భగత్సింగ్ని ఉరితీసిన తర్వాత దహనం చేసిన ప్రదేశం. ఇది సట్లెజ్ నది ఒడ్డున ఉంది. వాస్తవానికి ఈ హుస్సేన్వాలా ప్రాంతం దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో ఉంది. కానీ దేశ యువతకు ఆరాధ్య దైవాలుగా నిలిచిన భగత్ సింగ్ను స్మరించుకునేందుకు భారత ప్రభుత్వం 1961 జనవరి 17న 12 గ్రామాలను పాకిస్తాన్కు అప్పగించి ఈ ప్రాంతాన్ని భారత్లో మిళితం చేసింది. ప్రభుత్వం జాతీయోద్యమ వీరుల స్మారకార్థం భగత్సింగ్ దహనసంస్కారం జరిగిన ప్రదేశంలో 1968లో స్మృతి వనాన్ని నిర్మించారు. దీన్ని అప్పటి పంజాబ్ ముఖ్యమంతి జైల్ సింగ్ కృషితో నిర్మించారు. భగత్సింగ్ను ఉరితీసిన రోజున మార్చి 23న ఇక్కడ ఏటా 'షహీద్ మేలా' (అమరవీరుల సంత) పేరుతో పెద్ద ఉత్సవం జరుపుతారు. వేలాది మంది జనం దేశ నలుమూలల నుంచి ఇక్కడికి చేరుకొని ఆ వీరులను స్మరించుకుంటారు. ఈ ప్రాంతంలోనే భగత్సింగ్ సహచరుడు బీకే దత్త్ చివరి కోరిక మేరకు అతన్ని కూడా అక్కడే దహనం చేశారని, అలాగే భగత్సింగ్ తల్లి విద్యావతిని కూడా వారి సరసనే దహనం చేశారు.
చిన్పప్పటినుంచి పుస్తకాల్లో, మీటింగ్ల్లో ఆ వీరుల పోరాటాన్ని కథలు కథలుగా విన్న మాకు స్వయంగా వారి స్మారక స్థలాన్ని దర్శించుకొని రావడం జీవితంలో మరిచిపోలేని అనుభవమని చెప్పవచ్చు. మూడు రోజులు కొనసాగిన మా ఉత్తర భారత పర్యటనలో చివరికి మాత్రం ఆ వీరుల జ్ఞాపకాలను గుండెలో భద్రపరుచుకొని తిరుగు ముఖం పట్టాం. చరిత్ర అంటే సంఘటనల సమాహారమే అని అన్నట్లు ఈ మట్టి పొరల్లో దాగివున్న ఈ దేశ మహోన్నత చరిత్రను ప్రత్యక్షంగా చూసి, గొప్ప అనుభూతిని పొందామని చెప్పవచ్చు.
- యు. ఎల్లేష్
జాయింట్ రిజిస్ట్రార్
ఉస్మానియా విశ్వవిద్యాలయం
9490706297
Authorization