వైవిధ్యం మన సొంతం. అది భాష కావొచ్చు, ప్రాంతం కావొచ్చు. మనుషులు కావొచ్చు, కళలు కావొచ్చు. ఎందులోనైనా సరే వైవిధ్యాన్ని చూపించడం ఆ వైవిధ్యంలో అద్భుతాలు ఆవిష్కరించడం మన సొంతం. అందుకే వందల ఏండ్ల పూర్వం నుండే మన దగ్గర ఆశ్చర్యపరిచే ఇంజనీరింగ్ ప్రతిభ, అబ్బురపరిచే ఆర్కిటెక్చర్ నైపుణ్యం, సౌందర్యమైన సృజనాత్మకత కనిపిస్తాయి. వీటికి ఉదాహరణలుగా ఆ కాలపు నిర్మాణాలను చూడవచ్చు. అలాంటి వాటిలో ఒకటి కాకతీయ రాజులు నిర్మించిన రామప్ప దేవాలయం. ఈ గుడి కంటే గుడిలోని శిల్ప సంపద ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. అంతే కాదు ఈ దేవాలయానికి మరో విశిష్టత ఉంది. అదేంటంటే గుడి కట్టించిన వారి పేరుతోనో.. గుడిలోని మూల విరాట్ పేరుతోనో.. గుడి ప్రాచుర్యం పొందకుండా... గుడి నిర్మించిన శిల్పి పేరుతో ప్రాచుర్యం పొందడం. మరో విశేషం గుడిని సాండ్ స్టోన్ మీద నిర్మించడం. నల్లచలువ రాతిని, సాండ్ స్టోన్ కలిపి నిర్మించడం వల్ల గుడి సహజ రంగులో కనిపిస్తున్నది.
గుడి మెట్ల దగ్గర నుంచి మొదలుకొని పై కప్పు వరకు ప్రతి చోట ఎన్నో శిల్పాలు. అబ్బురపరిచే శిల్పకళ పర్యాటకులను చూపు తిప్పుకోలేనంతగా ఆకట్టుకుంటాయి. వరంగల్ జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో 800 ఏండ్ల సంవత్సరాల క్రితం దేవాలయాన్ని నిర్మించారు. అంటే క్రీస్తు శకం 1213 లో ఈ దేవాలయాన్ని నిర్మించారు. కాకతీయ రాజు రుద్రదేవుడి హయంలో ప్రారంభమైన గుడి నిర్మాణం గణపతి దేవ చక్రవర్తి కాలంలో పూర్తయిందట. వారి తరఫున రేచర్ల రామయ్య అనే సామంత రాజు ఈ దేవాలయాన్ని కట్టించాడు. దీన్ని పచ్చటి ప్రకృతి ఒడిలో సువిశాలమైన ప్రాంతంలో సాండ్ స్టోన్ తో నిర్మించిన అపురూప కట్టడం. నిర్మాణంలో వినియోగించిన రాయితో పాటు ఆర్కిటెక్చర్ నైపుణ్యం, ఓ ప్రత్యేక సాంకేతిక సూత్రాన్ని అనుసరించి సూర్య కిరణాలు నేరుగా గుడి లోపలికి ప్రసరించడం వల్ల నిత్యం కాంతివంతంగా కనిపిస్తుంది. ఇలా వెలుతురు పడటానికి మరో కారణం ప్రహారీ గోడను పూర్తిగా కట్టకుండా సగం వరకు వదిలేయడం.
శిల్ప సంపద మాయ!
పాలంపేట కు కిలో మీటర్ దూరంలో రామప్ప దేవాలయం ఉంది. ప్రవేశ ద్వారం రామప్ప గుడికి స్వాగతం అన్నట్టు బోర్డు పలకరిస్తుంది. దాన్ని దాటుకొని ముందుకు సాగితే దారికి రెండు వైపులా పచ్చని చెట్లు, దూరంగా ఎత్తైన పచ్చటి కొండలు, చిన్న చిన్న ఇండ్లతో పల్లె వాతావరణం ఆహ్లాదపరుస్తుంది. అలా ముందుకు సాగితే రామప్ప దేవాలయం గేటు దగ్గరకు చేరుకుంటాం. చుట్టూ విశాలమైన తోట, మధ్యలో సిమెంట్ రోడ్డు, రోడ్డుకు ఇరువైపుల నిలుచున్న ఎత్తైన చెట్లు, వాటి మధ్య నుంచి ఊరిస్తూన్న కనిపించేదే రామప్ప దేవాలయం. దాన్ని దాటుకొని ముందుకెళ్తే మనిషి ఎత్తు ఉండే ప్రహారీ గోడ. దాని మధ్య నుంచి ద్వారం. అది దాటితే దేవాలయ ప్రాంగణంలోకి అడుగు పెడతాం. అక్కడికి వెళ్లిన వెంటనే శిల్ప సంపద మాయలో పడిపోతాం. గుడి ప్రాంగణంలోకి వెళ్లాగానే నిలువెత్తు సాండ్ స్టోన్ అబ్బురపరుస్తుంది. ఎదురుగా ఆరు అడుగుల ఎత్తైన మండపం మీద నిర్మించిన దేవాలయం, దాని ముందే కనిపించే తొమ్మిది అడుగుల ఎత్తైన నందీశ్వర మండపం, మరో దిక్కు శాసన మండపం. ఏది ముందు చూడాలో అనే అయోమయంలో పడిపోతారు.
నక్షత్రాకారంలో...
రామప్ప దేవాలయాన్ని పై నుంచి చూస్తే భూమి మీద వెలుగుతున్న నక్షత్రంలా కనిపిస్తుంది. దేవాలయ నిర్మాణం మొత్తం నక్షత్ర ఆకారంలో ఉండటమే దీనికి కారణం. ఇక దేవాలయం బయట, లోపల చెక్కడాల్లో ఈ గుర్తు కనిపిస్తుంది. కింది భాగం మొత్తం ఎరుపు, తెలుపు మిశ్రమ వర్ణంలోను, పై భాగం తెలుపు రంగులో కనిపించేలా రాళ్లను ఎంచుకున్నారు. గుడికి నాలుగు దిక్కుల నాలుగు ప్రవేశ ద్వారాలు. ప్రతి ద్వారానికి పై భాగంలో నల్లటి రాతితో చెక్కిన మదనికల విగ్రహాలు అద్భుతంగా కనిపిస్తాయి. వీటినే రాగిణి, నాగిని విగ్రహాలు అంటారు. ఇక దేవాలయాన్ని దగ్గర నుంచి గమనిస్తే ప్రతి అంగుళం రకరకాల నృత్యభంగిమలతో, పువ్వులు, తీగలు, ఏనుగులు, సింహాలు, వాయిద్యాలాంటి శిల్పాలతో అందంగా, అద్భుతంగా, అనిర్వచనీయంగా కనిపిస్తుంది. దేవాలయం మొత్తం గోడలు, స్థంబాలు, పై కప్పు. ఎక్కడ చూసిన శిల్పకళ అబ్బురపరుస్తుంది.
మూడు రకాల శిల్పాలు...
రామప్ప ఆలయంలో ముఖ్యంగా మూడు రకాల శిల్పాలు కనిపిస్తాయి. ఒకటి దేవతామూర్తుల శిల్పాలు, రెండు ఊత శిల్పాలు, మూడు జానపద శిల్పాలు. మొదటి రెండు తరగతులకు చెందిన శిల్పాలు నల్లరాతితో చేసినవి కాగా, మూడవ తరగతికి చెందిన శిల్పాలు స్థానికంగా లభించే ఎర్ర రాతితో చేసినవి. దేవతా మూర్తుల శిల్పాలు దేవాలయ అంతర్భాగాల్లో ఉండగా, ఊత శిల్పాలు దేవాలయం చుట్టూ గోడలు, స్తంభాల పైనున్న చూరును ఎత్తి పట్టుకున్నట్లుగా ఉంటాయి. ఇలాంటివి ఆలయ మూడు ప్రవేశ ద్వారాలకు రెండు వైపులా రెండేసి... అలా ద్వారానికి నాలుగు చొప్పున మొత్తం పన్నెండు నిలువెత్తు శిల్పాలు ఉన్నాయి. నృత్యభంగిమల్లో ఉన్న ఈ స్త్రీ శిల్పాలను మదనికలు, సాలభంజికలు, నర్తకీమణులు తదితర పేర్లతో పిలుస్తారు. నిలువెత్తు ఏకశిలా ఏనుగు విగ్రహాలు కొన్ని ప్రవేశ ద్వారాల్లో కనిపిస్తాయి. లేచి పరుగెత్తడానికి సిద్ధంగా ఉందనేట్లు చెక్కిన నంది మండపంలోని ఏకశిలా నంది విగ్రహం కాకతీయ శైలికి ప్రతీకగా వెలుగొందుతున్నది.
అలాగే గర్భగుడిలోని నాలుగు అడుగుల ఎత్తైన శివలింగం కూడా కాకతీయ శిల్ప శైలి ప్రత్యేకతను చాటి చెబుతుంది. రంగ మండపం నైరుతి స్తంభానికి చెక్కిన రతీ మన్మథులు, పాల సముద్ర మథనం, వాయువ్య స్తంభానికి చెక్కిన గోపికలు, కృష్ణుల మధుర భక్తి శిల్పాలు నాలుగు అంగుళాల ఎత్తులోనే ఎంత అందాన్ని, నైపుణ్యతను వ్యక్తపరుస్తాయో చూస్తేనే అర్థమవుతుంది. తెలంగాణలో ఉన్న రెండున్నర వేల ప్రాచీన దేవాలయాల్లో ఇది తలమానికమైనది కాబట్టి ఒక్క సారైనా తప్పక సందర్శించాల్సిందే!
శిల్పిపేరుతో నామకరణం...
దేశంలోనే శిల్పి పేరుతో ప్రసిద్ధి చెందిన దేవాలయంగా రామప్ప దేవాలయాన్ని చెప్పుకోవచ్చు. రామప్ప మంచి శిల్పకారుడు. ఇతను కర్ణాటక వాసి. శిల్పి గొప్పతనం శిల్పినైపుణ్యతలో కనిపిస్తుంది కాబట్టి ఈ దేవాలయానికి రామప్ప దేవాలయం అని నామకరణం చేశారు. రామప్ప ఈ దేవాలయ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు చూపించారు. రాయిలో సరిగమలు పలికించారు, చిన్న సూది పట్టేంత రంధ్రాలు చెక్కారు, హై హీల్స్ అంటే ఎత్తు చెప్పులు వాడినట్టుగా చెక్కారు, గాలి, వెలుతురు కోసం ప్రహారీ గోడ నిర్మాణం, దేవాలయం చుట్టూ మదనికలు, సాలబంజికలు, నృత్యభంగిమలు, రాగిని శిల్పాలు చెక్కారు. రామప్ప దేవాలయాన్ని కేవలం ఆధ్యాత్మిక కోణంలో మాత్రమే చూడటం కాదు ఇది ఒక వైజ్ఞానిక దర్శనం. రామప్ప దేవాలయం ఓ విజ్ఞాన భాండాగారం. కేవలం శిల్పకళ గురించే కాదు. నాట్యం గురించి, వాయిద్యాల గురించి, ఆ కాలపు ఆహార్యం గురించి తెలుసుకోవాలంటే ఈ ఆలయానికి వెళ్లాల్సిందే!
Authorization