ఉరుకులు పరుగుల జీవితంలో పని ఒత్తిడి ఒకవైపు చికాకు పెడుతుంటే కాసేపు ఎక్కడికైనా వెళ్ళి సేద తీరాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్న సమయంలో బెంగుళూర్లో మూడు రోజుల కాన్ఫరెన్స్ అంటూ వచ్చిన ఈమెయిల్ బాగా దప్పిక కొన్న వ్యక్తికి చల్లని నీళ్ళు అందించినట్టు అయింది. తెలిసిన మిత్రులను ఆరాతీస్తే వాళ్ళకు కూడా కాన్ఫరెన్స్ నుంచి ఇన్విటేషన్ వచ్చిందని తెలియగానే అందరం కలిసి చలోమంటూ బెంగుళూర్ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాం. ఇది వరకే కర్నాటకలోని చాలా ప్రదేశాలు చూసినప్పటికీ బెంగుళూర్ అనగానే ఆ చల్లని వాతావరణం, పచ్చని చెట్లు, ఎతైన ప్రాకారాలు మళ్ళీ ఓసారి కండ్ల ముందు మెదిలే సరికి మళ్ళోసారి చూసినా తప్పేమీ లేదు అంటూ అందరం కలిసి బెంగుళూర్ ప్రయాణం కట్టాం.
చాలా కాలంగా మన హైదరాబాద్లో భాగం కావడం, మన భాషకు దగ్గరి పోలిక ఉండటం, మనం మాట్లాడే భాషను అక్కడ చాలా మంది ఈజీగానే అర్థం చేసుకోవడం, చాలా మంది తెలుగు స్పష్టంగా మాట్లాడటం ఇవన్నీ మనకు దగ్గరి వాళ్ళు అనే ఫీలింగ్ కలగడానికి కారణం కావచ్చు. ఏదీ ఎమైతేనేం మళ్ళోసారి మా పర్యటన బెంగుళూర్కే సాగింది. మా కాన్ఫరెన్స్ మూడు రోజులు బెంగుళూర్ నగరంలోనే కావడంలో ఈ సారి సిటీలోని అన్నీ ముఖ్యమైన ప్రాంతాలను చుట్టి రావాలనీ ప్లాన్ వేసుకున్నాం. మేం విడిది చేసిన ప్రదేశం కూడా సిటీ నడిబోడ్డున కావడంతో అన్నీ ప్రదేశాలను చుట్టి రావడానికి చాలా సులభమైంది.
సమ్మర్ ప్యాలెస్
బెంగుళూర్లో ప్రసిద్ధి చెందిన ప్రదేశాల్లో టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ ఒకటి. బెంగళూరు టిప్పు సుల్తాన్ హయాంలో ఈ ప్యాలెస్ వేసవి విడిదిగా ఉండేది. స్వతంత్ర సంగ్రామంలో ఈ విడిది కీలక భూమిక వహించింది. కలప, రాతి, మోర్టార్, ప్లాస్టర్తో నిర్మించిన ఈ భవనం నిత్యం అద్భుతమైన నిర్మాణమనే చెప్పాలే. ఇండో - ఇస్లామిక్ శైలిని పోలి నిర్మించిన ఈ భవనం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్యాలెస్ ప్రాంగణం అంతా రకరకాల పూల మొక్కలతో, అందమైన పుష్పాలతో సువాసనలను వెదజల్లుతూ ఉంటుంది. 1781 సంవత్సరంలో నవాబ్ హైదర్ అలీ ఖాన్ ఈ భవన నిర్మాణాన్ని ప్రారంభిస్తే 1791లో పూర్తయింది. రెండుఅంతస్తులుగా నిర్మించిన ఈ ప్యాలెస్లో ఇరువైపుల కలపతో చేసిన మెట్లు, గోడలకు ఇరువైపుల, పై కప్పుకు వివిధ చిత్రాల డిజైన్స్ చూపరులను ఆకట్టుకుంటాయి. టిప్పు సుల్తాన్ మరణాంతరం దీన్ని ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా మలిచి గ్రౌండ్ ఫ్లోర్ గదుల్లో టిప్పు వాడిన కత్తులు, ఖడ్గాలు, వస్తువులు ప్రదర్శిస్తుంటారు. అనుమతి లేనిదే ఫొటోలు తీసుకోరాదు. ప్రతి రోజు ఉదయం 8.30 నుండి సాయంత్రం 5.50 వరకూ ఈ ప్యాలెస్ సందర్శకుల కోసం తెరిచే ఉంటుంది
విధాన సౌధ
సమ్మర్ ప్యాలెస్ను చూశాక అక్కడికి దగ్గర ఉన్న విధాన సౌధ వైపు వెళ్ళాం. బెంగళూరు చూడ్డానికి వెళ్ళిన వాళ్ళు తప్పక చూడాల్సింది మరో అద్భుతమైన కట్టడం విధాన సౌధ. అంటే మన రాష్ట్రంలోని అసెంబ్లీ లాంటిది. 46 మీటర్ల ఎత్తు వుండే ఈ భవనం నగరంలోని ఎత్తైన హర్మ్యాలలో ఒకటి.అటు సంప్రదాయ ద్రావిడ ఇటు ఆధునిక శైలి నిర్మాణాల మేలు కలయికతో ఈ భవనాన్ని రూపకల్పన చేశారు. మేం వెళ్ళింది సెలవు దినం కావడంతో విద్యుత్ దీపాలతో దగదగ మెరుస్తూ కనిపించింది.
సెలవు దినాల్లో అయిన ప్రతి సాయంత్రం 6 గంటల నుంచి 8.30 వరకు ఈ భవనం విద్యుత్ దీపాలతో వెలుగుతూ ఉంటుందని తెలిసింది. బెంగుళూర్ సీటీ జంక్షన్కు కేవలం కొద్ది దూరంలో ఉన్న ఈ అద్భుత భవనాన్ని బెంగుళూర్ వెళ్ళిన ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిందే.
ఆ భవనానికి ఎదురుగా భవనవైపే ఏలు చూపెడుతూ ఉండే అంబేద్కర్ విగ్రహం మరో ప్రత్యేకత అని చెప్పొచ్చు. విధాన సౌధ భవనం రోడ్డుకు పక్కనే కావడంతో దూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా దాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు, లేదా నగరంలోనే ఉంటూ అటు వైపుగా వెళుతున్న వాళ్ళు కూడా విస్తారమైన పచ్చిక బయళ్ళతో ఉండే ఈ భవనం ముందూ కాసేపు ఆగి నిలుచొని తప్పక ఫోటోలు దిగి వెళ్ళడం కనిపించింది. మేం వెళ్ళిందే పర్యటనకు కావడంతో మా వంతూ ఫోటోలు దిగి అక్కడినుంచి బయలు దేరాం.
హై కోర్టు భవనం
విధాన సౌధకు ఎదురుగా ఉన్న మరో పర్యాటక ప్రదేశమే ఆ రాష్ట్ర హై కోర్టు భవనం. ఆధునిక సాంప్రదాయ నిర్మాణ శైలికి ఈ భవనం చక్కటి తార్కాణం. అట్టర కచేరి గా పిలవబడే ఈ భవనాన్ని పూర్తిగా ఎర్రటి ఇటుక రాయితో నిర్మిం చారు. పూర్వం మైసూర్ రాజ్యంగా పిలవబడిన కర్ణాటక లో 1884 లో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏర్పడింది. 1921 లో దీనికి కర్ణాటక హై కోర్ట్ గా నామకరణం చేశారు. అట్టర కచేరి అంటే పద్దెనిమిది కార్యాలయాలు అని అర్ధం. ఆధునిక సాంప్రదాయ నిర్మాణ శైలికి ఈ భవనం చక్కటి తార్కాణం.అంతకు ముందు
'పాత ప్రభుత్వ భవనాలు' గా ఉన్న ఈ భవనాలకు టిప్పు సుల్తాన్ భవనం నుంచి ఇక్కడికి పద్దెనిమిది ప్రభుత్వ శాఖల కార్యాలయాలు మార్చాక అట్టర కచేరి గా పేరు మార్చారు. అయితే పాలకులు మారిన తర్వాత దీన్ని సరిగ్గా పట్టించుకునే నాధుడు లేకపోవడంతో క్రమంగా శిధిలావస్థకు చేరుకుంది. అయితే ప్రజాహితార్ధం ఒక బిల్లు పాస్ అవడంతో ఈ భవనాలను కాపాడాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అక్కడ ఫోటోలు దిగడానికి నిషేధం కావడంతో మేం కేవలం ఆ భవనాన్ని తిలకించడానికే పరిమితమయ్యాం. అప్పటికే చీకటి కావడంతో మా పర్యటనను అక్కడితో ముగించాం.
భారత వైజ్ఞానిక సంస్థ
రెండో రోజు మా పర్యటనను దేశంలో ప్రఖ్యాతి గాంచిన భారత వైజ్ఞానిక సంస్థ వైపు బయలు దేరాం. ఇది కూడా హైకోర్టుకు కాస్త దూరంలో ఉన్న మరో ప్రదేశమే బెంగుళూర్లోని భారత వైజ్ఞానిక సంస్థ. ఇది 1909 లో బెంగళూరులో స్థాపించిన భారత వైజ్ఞానిక సంస్థ దేశంలోని ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటి. ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో వుంది. అప్పట్లో భవన నిర్మాణానికి ఆధునికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ భవనం చూస్తే చాలు. ఈ భవన ప్రాంగణంలో వివిధ మైధానాలు, వేర్వేరు భవనాలు, అలాగే అంతర్జా తీయ ప్రమాణాలకు దీటుగా స్త్రీ, పురుషులకు వేరు వేరుగా అయిదు హాస్టళ్ళు, అనేక మౌలిక వసతులు వున్నాయి. వీటికి తోడూ, ఇదే ఆవరణలో ఉపాధ్యాయులకు, సిబ్బందికి, ఇంటి వసతి, గ్రంధాలయం, షాపింగ్ సెంటర్, మసాజ్ పార్లర్ల లాంటివి కూడా వున్నాయి. విశాల మైదానం ఉన్న ఈ సంస్థ ప్రాంగణంలో దేశీయ, విదేశీయ వక్ష జాతుల సేకరణతో ఈ ఆవరణలో పచ్చదనం ఎల్లెడలా పరుచుకుని వుంటుంది.
బెంగళూరు ప్యాలెస్
నగరం నడిబొడ్డున సదాశివ నగర్ జయామహల్ మధ్య ఈ ప్యాలెస్ ఉంది. ఇంగ్లండ్లోని విన్సర్ కాసిల్ మాదిరిగా తయారు చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ భవన నిర్మాణ ప్రక్రియ చేసినట్లుగా తెలిసింది. రెవ్ గారేట్ 1862 లో ప్రారంభించారు. అక్కడున్న వాటిని పరిశీలిస్తే తెలిసింది. 45000 చదరపు అడుగులలో విస్తరించి వున్న ఈ రాజభవనం పూర్తి చేసేందుకు 82 ఏండ్లు పట్టింది. భవనం ముందు వాకిట్లోంచి లోనికి వెళ్తుంటే దాని అందం ముగ్ధుల్ని చేసింది.ఈ భవనాన్ని తర్వాతి కాలంలో వోడేయర్ రాజవంశీకుడైన చామరాజ వోడేయర్ కొనుగోలు చేయడంతో వాళ్ళ ఆధీనంలో ఉన్నట్లు తెలిసింది. పురాతన భవనం కావడంతో కొంత ప్రాంతం శిథిలం కావడంతో ఇటీవలే పునరుద్ధరించినట్టు తెలుస్తోంది. అంతస్తులుగా ఉన్న ఈ భవనం దిగువ ప్రాంగణంలో నీలి రంగు సిరామిక్ టైల్స్ పొదిగిన గ్రానైట్ సీట్లు రాత్రి వేళల్లో చూడటానికి చాలా అందంగా వుంటాయి. పై అంతస్తులో రాజుగారు సభ చేసిన విశాలమైన దర్బార్ హాల్ చూడవచ్చు. రాజభవనం లోపలి గోడలు గ్రీక్, డచ్, ప్రఖ్యాత రాజా రవివర్మ చిత్రాల అలంకరణలతో అందాన్ని ఇనుమడింప చేసుకున్నాయి. ప్రాచీన కట్టడాలు, అర్కిటెక్స్, పెయింటింగ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఈ బెంగుళూర్ ప్యాలెస్ తప్పకుండా నచ్చుతుంది.
మంత్రి స్క్వేర్ మాల
బెంగళూరులోని కట్టడాలు, నిర్మాణాలు నగర ప్రాచీన సంప్రదాయాన్ని, గత వైభవాన్ని తెలియజేస్తుంటే అధునిక నగర జీవనానికి ప్రతీక నగరంలోని షాపింగ్ కాంప్లెక్స్లు. అలాంటి షాపింగ్ కాంప్లెక్షే మంత్రి స్వ్యేర్ మాల్. ఇది మల్లేశ్వరం ప్రాంతం లోని ఎం ఎన్ కామ్ప్లెక్స్ కి దగ్గరో సంపిగే రోడ్డు నెంబర్ ఒకటిలో వుంది. లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ మాల్ బహుశా దేశంలో కల్లా పెద్దది కావచ్చు. వినోదం, షాపింగ్, ఆహరం అందించే రక రకాల దుకాణాల సముదాయం తో మంత్రి స్క్వేర్ బెంగళూరు కు మహానగరమనే ఖ్యాతిని తెచ్చిందనడంతో అభ్యంతరం లేకపోవచ్చు. ఒక రకంగా నగర జీవికి కేరాఫ్ అడ్రస్ ఈ మాల్. బెంగళూరు లో లైఫ్ స్టైల్, రిలయన్స్ ట్రెండ్స్, మార్క్స్, షాపర్స్ స్టాప్, పాంటలూన్స్ లాంటి అయిదు పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్లు ఒకే చూరు క్రింద వున్న ఏకైక మాల్ ఇదే అని అక్కడి స్థానికులు చెబుతారు. దీన్ని దక్షణాఫ్రికా కు చెందినా బెన్టేల్ అసోసియేట్స్ రూపకల్పన చేసినట్లు చెబుతారు. దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్ లను అందించే 250 దుకాణాలు ఈ మాల్ లో వున్నాయట ఈ మాల్ లో అంతర్జాతీయ బ్రాండ్స్కు చెందిన షాప్స్, ఐనాక్స్ థియేటర్స్ అన్నీ కండ్లు మిరమిట్లు గొలుపుతాయి.
కబ్బన్ పార్కు
బెంగుళూరు నగరంలో ఉన్న మరో పర్యాటకు ప్రాంతం కబ్బన్ పార్క్. ఇది నగరం మధ్యలో ఉంది. దీన్ని1870లో అప్పటి మైసూరు రాష్ట్రానికి ముఖ్య ఇంజనీర్గా పనిచేస్తున్న రిచర్డ్ సాంకే ప్రారంభించాడట. మొదట్లో వంద ఎకరాల్లో ప్రారంభమైన ఈ ఉద్యానవనం తర్వాత విస్తరించి ప్రస్తుతం సుమారు 300 ఎకరాలకు వ్యాపించింది. అనేక వైవిధ్యమైన వ క్ష, పుష్ప జాతులకు ఈ పార్కులో ఉన్నాయి. దీని చుట్టూ అందంగా నిర్మించిన భవనాలు, ఆవరణ లోపల ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి.
మొదట్లో ఈ పార్కును 1870 లో మైసూరు నగర కమిషనరుగా పనిచేస్తున్న సర్ జాన్ మీడే పేరు మీదుగా మీడే పార్కు అని పిలిచేవారుట తరువాత అదే పదవిలోనే అత్యధిక కాలం కమిషనరు గా పనిచేసిన మార్క్ కబ్బన్ పేరు మీదుగా కబ్బన్ పార్కు అని పేరు పెట్టారు. 1927లో మైసూరు మహరాజా చామరాజేంద్ర ఒడయార్ పాలన
రజతోత్సవాల సందర్భంగా ఈ పార్కుకు శ్రీ చామరాజేంద్ర పార్కు అని పేరు మార్చారట. ఉదయం సాయంత్రం వేళలో పాదచారులతో, పర్యాటకులతో ఈ పార్క్ అంతా కిక్కిరిసి ఉంటుంది. నగరం జీవితంలో విసిగి వేసారిన వాళ్ళు ఈ కబ్బన్ పార్క్కు వెళితే చాలు కాసేపు సేద తీరి రావచ్చు.
- డేవిడ్
8309844923
Authorization