అబుదాబిలో ఉండే షేక్ జాయేద్ గ్రాండ్ మసీదు. షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్-నహ్యాన్ జ్ఞాపకార్థం 'షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు' నిర్మించారు. దీన్ని 1996లో నిర్మాణాన్ని ప్రారంభించారు, మసీదు నిర్మాణం 2007 సంవత్సరంలో పూర్తయింది. ఇస్లామిక్ సంస్కృతి, సంప్రదాయాలను చాటే అద్భుతమైన నిర్మాణమిది. ఈ మసీదులోని ప్రతీది విశిష్టమైనదే. దాదాపు 1,80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మసీదులో 82 గుమ్మటాలు, 1000 స్తంభాలు, 24 దీపస్తంభాలున్నాయి. సూర్యకాంతి ధారాళంగా ప్రసరించేట్టు నిర్మించిన ఈ మసీదు చుట్టూ నీటి కొలనులు ఉన్నాయి.
మసీదు నిర్మాణానికి వాడిన నాణ్యమైన, విభిన్నమైన చలువ పాలరాయిని మన దేశంలోని రాజస్థాన్, మాసి డోనియా, ఇటలీ, చైనా దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. మసీదులోపల ఉండే డెకరేషన్ మెటీరియల్స్ను టర్కీ, యూకే, ఇండియా, చైనా, మలేషియా, జర్మనీ, ఆస్ట్రియా, న్యూజిలాండ్ ఇలా వివిధ దేశాలనుంచి దిగుమతి చేసుకున్నారు. ప్రపంచంలోనే అతి పొడవైన కార్పెట్ను ఈ మసీదుకోసం నేయించారు. ఉన్ని, నూలు కలబోతగా రూపొందిన ఈ కార్పెట్ పొడవు 5,700 చదరపు మీటర్లు. రాత్రివేళల్లో తెలుపు, బంగారు వన్నె కాంతుల్లో ఈ మసీదు అత్యద్భు తంగా ఉంటుంది. చంద్రబింబం పెరుగుదలలో హెచ్చుతగ్గులను బట్టి ఈ పాలరాతి మసీదు కాంతులీనుతుంది. ఇందుకోసం 22 లైట్ టవర్స్ను ఏర్పాటు చేశారు. మసీదులో ఓ పెద్ద లైబ్రరీ ఉంది. అరబిక్ భాషతో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, ఇటాలియన్, కొరియన్ భాషల్లో వివిధ పుస్తకాలు లభ్యమవుతాయి. షేక్ జాయేద్ గ్రాండ్ మసీదులోకి శుక్రవారం ఉదయం మినహా మిగతా అన్ని రోజుల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి, రాత్రి పది గంటల దాకా సందర్శకులను అనుమతిస్తారు. శుక్రవారం మాత్రం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలనుండి రాత్రి పది గంటల దాకా అనుమతి ఉంటుంది. సూర్యాస్తమ సమయం లో షేక్ జాయేద్ గ్రాండ్ మసీదును తిలకించటానికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. మక్కా, మదీన తర్వాత ప్రపంచంలోనే ఇది అతి పెద్ద మసీదు. ఈ మసీదులో ఒకేసారి 40,000 మంది ప్రార్థన చేయవచ్చు.
Authorization