అనురాధాపుర నుండి కొలొంబో వచ్చేదారిలో సిగిరియా అనే ప్రదేశం ఉంది. అక్కడికి చేరుకోవాలంటే రమారమి 77 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రదేశాన్ని చక్కని పర్యాటక ప్రదేశంగా మలిచారు. ఊరంతా అరణ్యం మధ్యన ఉన్నట్టే ఉంది గాని రోడ్డు సౌకర్యం బాగానే ఉంది. కొన్ని షాప్లు, హోటళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఉన్న చిన్న హోటల్లో టీ తాగాను. ఆ హౌటల్ కు ఉన్న తెల్లని గోడల మాదిరిగా ఉన్న అట్టల మీద అక్కడకి వచ్చి తిన్నటువంటి కష్టమర్లు తమ అభిప్రాయాల్ని రాశారు. హిందీతో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, డచ్ ఇంకా స్వీడిష్, జపనీస్ లాంటి భాషల్లో రాసి ఉన్నాయి. రకరకాల చేతి రాతలు. ఆ హోటల్ వాళ్ళకు మంచి టేస్ట్ ఉంది అనిపించింది.
ఇక్కడికి దగ్గర్లో లయన్ రాక్ అనే ప్రదేశం ఉంది. చాలా ఎత్తుగా ఉన్న ఒక పెద్ద వెడల్పాటి రాతి మీద ఒక కోటను నిర్మించారు. దీనికి చుట్టూరా అనేక మైళ్ళ పరిధి లో నీటితో నిండిన ప్రాకారాలు, కందకాలు ఉన్నాయి. రాతిని బాగా ఉపయోగించడం వల్ల కొన్ని వందల ఏళ్ళు అయినా ఇవన్నీ అలా ఉన్నాయి.. పోయినవి పోగా..! పైన రాతి మీద ఉన్న కోటని చూడాలంటే దాదాపుగా 1200 పైన మెట్లు ఎక్కాలి. పిక్కబలం ఉంటే తప్పా అధిరోహించుట కష్టమే. ఈ కోటను కశ్యపుడనే రాజు కట్టించాడని చెప్పారు. ఈ కశ్యపుడు రాజ్యాన్ని ఆక్రమించుట కోసం సవతి సోదరునితో యుద్ధం చేసి దక్షిణ భారత దేశానికిపోయేలా చేశాడు. తండ్రిని చెరసాలలో బంధించాడు. దుర్భేద్యమైన కోటని నిర్మించాలని సిగిరియా కోటను కట్టాడు. పైగా ఆ పర్వతం పైన స్నానఘట్టాలు, విశాలమైన గదులు కనబడతాయి. వాటితో పాటు గుహలు, రహస్య మార్గాలు ఉన్నాయి. ఒక పెద్ద సింహం పాదాలు శిల్పంగా చెక్కారు.
బౌద్ధ ఆరామాలు ఎక్కువ...
తరవాత కాలంలో 14 వ శతాబ్దంలో ఈ నిర్మాణాన్ని బౌద్ధ ఆరామాలుగా మార్చారు. శ్రీలంకలో బుద్ధ వైభవం బాగా కనిపిస్తుంది. ఎక్కడ చూసిన ప్రాచీన బౌద్ధ శిల్పాల, నిర్మాణాల వైనం కళ్ళకి కట్టినట్లు కనబడుతుంది. ఇంత చిన్న భూభాగంలోనే పాతిక వేలకు పై చిలుకు అవశేషాలు తవ్వినప్పుడల్లా బయటపడ్డాయి. ఇంకా పడుతూనే ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్న జనాలకి కూడా ఎంతో కొంత చరిత్ర తెలుసు. ఈ చిన్న హోటల్లో ఉన్నప్పుడు ఒక స్థానిక వ్యక్తిని అడగ్గా తనకి తెలిసిన చాలా విశేషాలు చెప్పాడు.
తెలుగు భాషలాగానే..!
ఈ కశ్యపుడు అనే రాజు రావణుడి వంశానికి చెందిన వారిగా ఇక్కడి వారు చెపుతారు. ఇక్కడ ఊర్లలో కనబడిన షాప్లు, బోర్డుల మీద ఉపాలి, సంఘమిత్ర, అశోక, అసుర, చానుక ఇలాంటి పేర్లు కనబడ్డాయి. అపభ్రంశం కాబడిన సంస్క త శబ్దాలు వీరి భాష లో ఎక్కువ అనిపించింది. శ్రీ అని మాట నిసిరి అని విజయ అనే మాటని విజెయ అని ఇలా కొన్ని కొన్ని సింఘళ భాష మాటాడుతుంటే వినే వారికి తెలుగు భాష లాగానే అనిపిస్తుంది. మనుషుల్లో కూడా బాగా నల్లని వారు ఉన్నారు. చామన ఛాయ ఉన్నారు. మంచి ఛాయ ఉన్నవారు ఉన్నారు. ప్రతి చోటా సింఘళ భాష కింద తప్పక తమిళంలో రాయబడి ఉన్నట్టు కనిపించింది.
ఇక్కడికి వలస వచ్చిన తమిళుల్లో రెండు రకాల వారున్నారు. ఎప్పుడో చోళ రాజుల సమయంలో వలస వచ్చిన వారు సింఘలీస్ తమిళులు కాగా బ్రిటీష్ వారి హయాంలో ఇక్కడి తేయాకు తోటల్లో పనిచేసేందుకు వచ్చి స్థిరపడిన వారు ఇంకో రకం తమిళులు. రెండవ కోవకి చెందిన వారి నుంచే ఈలం పోరాటం చెలరేగింది. 74 శాతానికి పైగా స్థానిక సింఘళీయులు ఉన్నారు. డచ్, బ్రిటీష్ వారి పాలన వల్ల క్రైస్తవ జన ప్రభావం ఆరు శాతం దాకా ఉన్నది. కుల ప్రభావం ఇక్కడి థేర వాద బౌద్ధ మతంలో కూడా ఉన్నది. అయితే ఇండియాలో ఉన్నంత స్ట్రిక్ట్ గా ఉండదు.
కేరళలో మాదిరిగా...
స్త్రీల వస్త్రధారణలో చెప్పాలంటే చీర కట్టు బాగా ఉంటుంది. అదే సమయంలో ఫ్రాక్లు,షర్ట్సు వేసుకున్న స్త్రీలు కూడా చాలా ఎక్కువగానే బయట ఏ ఊరి లోనైనా కనిపిస్తూనే ఉంటారు. దానికి తోడు గొడుగు ఒకటి చేతిలో పట్టుకుంటారు. వాన ఉన్నా లేకపోయినా..! రూరల్ పావర్టీ బాగా తక్కువ 5.3 శాతం మాత్రమే..! పరిసరాల శుభ్రత బాగా ఉంది. ఇంటి నిర్మాణం ఎక్కడ చూసిన కేరళలో మాదిరిగా వాలుగా ఉండే ఇళ్ళు. చిన్నగా ఉన్నా చాలా ప్రత్యేకంగా అనిపించింది.
ప్రతి ఇంట్లో పూల మొక్కలు
అసలు వీరికి ఇండియా పట్ల ఉన్న అభిప్రాయం ఏమిటి అని కొందరు స్థానిక వ్యక్తుల్ని కదిపితే మరీ అంత సానుకూలత లేదు. అలాగని అసహ్యమూ లేదు. అయితే ఇండియా అనేది ఒక అగ్ర దేశం లాంటిది అనే భావం మాత్రం వారిలో ఉన్నట్లు గమనించాను. పైకి చెప్పకపోయినా..! ఇప్పుడు చైనా అనేక ప్రాజెక్టులతో సాయమందిస్తూ ఈ ద్వీప రాజ్యాన్ని తమ ప్రభావంలోకి తెచ్చుకోవడానికి బాగా ప్రయత్నిస్తున్నది. నగరాలు ఇంచు మించు కొంత తేడాతో ఒకేలాగా ఉంటాయి. ఒక దేశం దాని గ్రామీణ ప్రదేశాలు, ఇంకా సాధారణ ప్రజానీకం నివసించే విధానంలో భిన్నత్వం ఒక ఆసక్తిని కలిగించేదిగా ఉంటుంది. అది ఏ దేశం అయినా..! అందుకు శ్రీలంక మాత్రం భిన్నం ఎందుకు అవుతుంది..? కొలొంబో నుంచి అనురాధపురకి ప్రయాణించే దారిలో కొన్ని ఊళ్ళు కనబడగా వాటిని ఫొటోలు తీశాను. ఒక తల్లి, పిల్ల వాడిని ఎత్తుకుని ఉంది. ఇంకా ఆ ఇల్లు నిర్మాణ దశలోనే ఉన్నట్లుంది. నన్ను ఆకట్టుకున్న అంశాల్లో ఒకటి ఏమిటంటే ఇంటి నిర్మాణ శైలి. పైన రూఫ్ స్లోప్గా ఉండి కురిసే వాన చినుకులు కింద పడిపోవడానికి అనువుగా ఉన్నాయి. మళ్ళీ.. లోపల కూడా గదులు వరసగా కాకుండా ఏ గది ఆ గది వేరు వేరుగా ప్రత్యేకంగా ఉన్నాయి. డేనిష్, డచ్, పోర్చ్ గీస్ ఇంకా బ్రిటీష్ వాళ్ళు పాలించబట్టి అనుకుంటా వాళ్ళ నిర్మాణ శైలిని అనుకరించినట్టున్నారు. శుభ్రత బాగుంది. ప్రతి ఇంట్లో పూల మొక్కలు ఉన్నాయి.
ఫ్రాక్లు, షర్ట్లు వేసుకున్న స్త్రీలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎక్కువ మంది బుద్ధిష్ట్లుగానే ఉన్నారు. గ్రామ ప్రాంతాల్లో సెంటర్లలో బుద్ధుని ప్రతిమలు చాలా అందంగా ఉంచారు. దాని చుట్టూ అద్దాలు పెట్టారు. సింపుల్గానూ, నీట్ గానూ ఉన్నాయి. అనవసరమైన ఆడంబరం ఎక్కడా కనిపించలేదు. ఫ్లరు యాష్ బ్రిక్స్తో గోడ నిర్మించి సిమెంట్ చేస్తున్న ఇళ్ళు కనిపించాయి. మంచి మోడల్గా ఉన్నాయి. ప్రకృతి దృశ్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీలంక అంతా నేను చూసిన మేరకు ఆకు పచ్చగా నిగ నిగ లాడుతూ ఉంది. శ్రీలంకేయులు మౌలికంగా శాంతిప్రియులుగా తోచింది. మేం అనురాధపురలో హెరిటేజ్ హోటల్లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అక్టోబర్ రెండు గాంధీ గారి జయంతి. మనకి తెలిసిందే. మా హోటల్లో ఉన్న కొంతమంది భారతీయ మిత్రులు ఆయన స్మ తి లో ఒక కార్యక్రమం చేస్తున్నాం రమ్మంటే వెళ్ళాను. నివాళి అన్నమాట. యథా ప్రకారం స్పీచ్లు ఇచ్చిన తర్వాత మన వాళ్ళు భారత్ మాతా కీ జై అని అరవడం చేస్తున్నారు. మళ్ళీ పెద్ద సౌండ్తో. హోటల్లోని ఆ దేశపు స్టాఫ్ కొంత ఇబ్బందిగా ముఖం పెట్టారు. ఒక డ్రైవర్ మాత్రం మా వైపు తీవ్రంగా చూశాడు. కొంపదీసి ఇది జాతుల గొడవగా మారదు గదా అని తోచింది... అసలే ఇప్పుడిప్పుడే రెండు దేశాల వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తున్నాయి, అంతర్యుద్ధం తర్వాత..! అలాంటిది ఏమీ జరగలేదు. లేచిన వేళ బాగుంది. మళ్ళీ శ్రీలంక లోకి వెళదాం. అపుడే చెప్పాను గదా వీలున్నప్పుడల్లా రాస్తుంటాను! ఈ సారి కాండీ కి కొంత దూరంలో గల బండారగామ అనే ఊరి లోకి వెళదాం. ఇక్కడ కూడా అంతే ప్రకృతి అందాలు. ఎటు చూసినా చక్కని పచ్చదనం, శుభ్రంగా ఉన్న రోడ్లు. జనాలు కూడా పెద్దగా లేరు రోడ్ల మీద. ముందే చెప్పినట్లుగా ఒక చిన్న సైజు కేరళ మాదిరిగా ఉన్నది ఈ ప్రదేశమంతా. నేను ఇదంతా చూసి ఇక్కడి స్లోప్గా ఉండే ఇళ్ళు, పచ్చదనం మీద ఏదో తెలియని ప్రేమ పాకిందేమోనని. పెద్ద దూరం ఏముందని. ఇప్పుడంటే పాస్ పోర్టు అవీ గాని.. ఒకానొక సమయంలో నావలతో ఈ సముద్రాన్ని దాటి రాకపోకలు సాగించేవారు.
పురాతనమైన నాట్యం...
ఒక సమావేశంకు వెళ్ళా. అది ప్రపంచ శాంతికి సంబందించినది. అక్కడి సర్వోదయ సంస్థ దాన్ని నిర్వహిస్తున్నది. ఇక్కడ అనేక దేశాల, మన దేశంలోని రాష్ట్రాల వారిని కలిసే అవకాశం కలిగింది. విచిత్రం ఏమిటంటే ఈ సర్వోదయ సంస్థ మన గాంధీజీ ఆశయాలతో ప్రభావితమైనది. ఇక్కడి యువతకు ఎంతో తోడ్పాటు అందిస్తున్నది. ఆ రోజు కార్యక్రమాలు ప్రారంభం అయ్యే ముందు దానికి ముఖ్య అతిధిగా ఆ దేశ సాంస్కతిక, ఉన్నత విద్యా శాఖా మంత్రి పాల్గొన్నారు.
ఆ సందర్భంగా ఒక మంచి నాట్యాన్ని చూడగలిగాను. ఆయన్ని స్వాగతిస్తూ చేసిన నాట్యం కొహౌంబో కంకారియాగా పేర్కొన్నారు. ఇది కాండీ మధ్య పర్వత భూముల్లో నుంచి వచ్చిన నాట్యంగా చెబుతారు. చాలా పురాతమైన ఈ నాట్యం శ్రీలంకలోని రాజు పాండువసుదేవ అనే అతనికి మానసిక దౌర్బల్యం కలిగినపుడు మన భారత దేశం నుంచి వచ్చి ప్రదర్శించినదట. ఆ తర్వాత ఇది ఎంతో ప్రాచుర్యం పొంది మిగిలిన శ్రీలంకలోని అన్ని ప్రాంతాలలోకి పాకింది. కాండీ లోని బుద్ధ దేవుని గుడిలోనూ దీని ప్రతి యేడు ప్రదర్శిస్తారు.
మనం మన దగ్గరలో ఉన్న దేశాలతో పోలిస్తే ఎంతో దగ్గరి తనం సాంస్కతిక ఐకమత్యం కనిపిస్తుంది. అది పెద్దగా మన దేశీయులు పట్టించుకోకపోవడం వల్ల ఎంతో నష్టం కలుగుతుంది. ఈ సారి ఈ ద్వీపాన్ని సందర్శించినప్పుడు ఇవన్నీ పరిశీలించండి. అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా ఆసియాలోని ఎన్నో దేశాల్ని ఇలా దగ్గరగా పరిశీలించాలనేది నా కోరిక. యూరపు, అమెరికా కంటే కూడా వీరి గురించి మనకు తెలిసింది తక్కువ. అది నిజంగా సిగ్గుపడాల్సిన అంశమే. - మూర్తి కెవివిఎస్
Authorization