ఎక్కడికెళ్లినా పచ్చదనం, నీలి ఆకాశం, పెద్ద పెద్ద లోయ లు, ఆ లోయలలో ప్రవహించే అందమైన సెలయేర్లు, అక్కడక్కడా జలపాతాలు, కొండలు, అడవులు, కాఫీ తోటలు, మిరియాలు, యాలకుల తోటలు, కావేరీ నదిలో నౌకా విహారం, ఏనుగుల మందల షికారు, గిరిజనుల ఉత్సవాలు... మొదలయిన వాటినన్నింటినీ కలగలిపి చూడాలంటే కూర్గ్ వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళిన వారు ఎవరైనా అక్కడి ప్రకృతి సౌందర్యానికి దాసోహం కాక తప్పదు.
ఒక వైపున చల్లటి సాయంత్రాల్లో సేదదీరడానికి అనువైన సముద్ర తీర ప్రాంతాలు, ఓ వైపు ఎతైన పర్వత ప్రాంతాలు, మరో వైపు పచ్చటి అటవీ ప్రాంతాలు.. ఇలా ప్రకృతి అందాలన్నింటినీ కర్నాటక తనలో దాచుకుంది. ఈ వేసవిలో అనేక మంది ఈ ప్రాంతాలకు పర్యాటకానికి వెలుతుంటారు. అక్కడి ప్రకృతి అందాలన్నింటిని తనివితీరా చూసి మైమరిచిపోతుంటారు.
చల్లని వాతావరణం
ఇంతటి అందమైన కూర్గ్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈ ప్రాంతాన్ని కొడగు అని కూడా అంటారు. మడికెరి, సోమవారపేట, విరాజపేట అనే మూడు తాలూకాలతో కూడిన జిల్లా కొడుగు. కర్నాటక రాష్ట్రంలో ఈ కొడుగునే అతి చిన్న జిల్లా. ప్రకృతి అందాలతో తులతూగే ఈ జిల్లాని సదర్శించడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో పర్యాటకులు నిత్యం ఇక్కడికి వస్తుంటారు.ఎటువైపు చూసినా కాఫీ తోటలు, ఆ తోటల మధ్య నివాసం ఏర్పరుచుకున్న ప్రజలు అగుపిస్తారు. ఏ రుతువులోనైనా ఉష్ణోగ్రత 20-25 డిగ్రీలకు మించని వాతావరణంలో ఎంతో ఆహ్లాదంగా గడపొచ్చు. పర్యాటకు లను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడి కాఫీ ఎంతో మధు రంగా ఉంటుంది.
ప్రకృతి అందాలతో పాటు...
కూర్గ్లో చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి అందాలకు నిలయమైన జలపాతాలు, పర్వత శిఖరాలతో పాటు ధార్మిక ప్రాంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. కర్నాటక జీవనదిగా పర్కొనబడే కావేరి జన్మస్థలమైన భాగమండలం, టిబేటియన్ గోల్డన్ టెంపుల్, ఓంకారేశ్వర దేవస్థానాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి హిందూ, బౌధ మతానికి సంబంధించిన భక్తులు ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు.
జలపాతాల నిలయం
హారంగి డ్యాం, కావేరి నిసర్గధామ, దుబారే ఎలిఫెంట్ క్యాంప్, అబ్బి జలపాతం, ఇర్ఫు జలపాతం, మళ్లళ్లి జలపాతం ఇలా ఎన్నో జలపాతాలను ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు. అదే విధంగా మడికేరి కోట, నాల్కోనాడ్ ప్యాలెస్ వంటివి కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కాఫీ
ఇక్కడి చల్లటి వాతావరణం కాఫీ తోటల పెంపకానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కూర్గ్ కాఫీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ మొట్టమొదట సారి కాఫీని పరిచయం చేసినది బ్రిటీష్ వారు. ముఖ్యంగా కూర్గ్లో దొరికే అరేబియా, రొబస్టా రకాలు ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాముఖ్యం చెందినవి. అదే విధంగా ఈ ప్రాంతం తేనే, మిరియాలు, యాలకులకు చూడా చాలా ప్రాచూర్యం.
జాస్ సిటీ
కూర్గ్ జిల్లాలో రాజాస్ సీట్ అనేది ఓ ప్రధాన పర్యాటక ప్రదేశం. వివిధ సీజన్లలో పూసే పూల చెట్లతో, అందమైన ఫౌంటెన్లతో చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ ఫౌంటెన్లలోని నీటి ప్రవాహం చక్కటి సంగీతాన్ని అందిస్తాయి. రంగు రంగుల నీటి ధారలు వీనుల విందైన సంగీతంతో వెదజల్లుతూ ఎంతో వినోదాన్ని కలిగిస్తాయి. కూర్గ్ రాజులు ఈ ప్రదేశాన్ని తమ వినోదాలకు, ఆటవిడుపుకు ఉపయోగిచేవారు. అందుకే దీనికి రాజాస్ సీట్ అనే పేరు వచ్చింది. ఈ కట్టడాన్ని ఇటుక, సున్నం వంటి వాటితో నిర్మించారు. అలాలగే ఎన్నో స్తంభాలు, ఆర్చీలు కలిగి ఉంటుంది. ఈ కట్టడం సమీప కొండలు, లోయల కంటే ఎత్తుగా నిర్మించటంతో ఈ ప్రదేశం నుండి చూస్తే పరిసరాలు బాగా కనపడతాయి. బంగారు కాంతులను వెదజల్లే సూర్యోదయం, సూర్యాస్తమయం పర్యాటకులకు మరువలేని అనుభూతులనిస్తుంది. పిల్లలు సరదాగా గడిపేందుకు టారు ట్రైన్ కూడా ఇక్కడ ఉంది.
ఓంకారేశ్వర ఆలయం
మడికెరి కోటకు కింది భాగంలో ఈ ఆలయం ఉంది. ఇస్లామిక్, గోథిక్ శిల్పకళా సంగమశైలి ఈ ఆలయ నిర్మాణంలో మనకు కనిపిస్తుంది. కొండపై నుండి చూస్తే ఉద్యానవనాలు, పర్యాటకశాఖ వారి మడికెరి హోటల్ కనిపిస్తాయి. పదహారవ శతాబ్దకాలంలో ముద్దురాజు పరిపాలనలో ఈ ప్రాంతాన్ని ముద్దురాజుకేరిగా పిలిచేవారు. కాలక్రమేణ పేర్లలలో రకరకాల మార్పులు జరుగుతూ చివరకు మడికెరిగా మారింది.
తలకావేరి
కావేరినది జన్మస్థానం తలకావేరి. మడికెరికి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పవిత్ర నదీ సంగమానికి స్థానికులే కాక తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల నుండి యాత్రికులు వస్తుంటారు. సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే తలకావేరిలోనికి నీరు వచ్చి చేరుతుంది. వేలాది మంది ఇక్కడ పవిత్ర స్నానాలాచరిస్తారు.
అబ్బె జలపాతం
మడికెరికు 8 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. కూర్గుకు వచ్చిన వారు ఈ జలపాతాన్ని తప్పక సందర్శిస్తారు. మలుపులతో, ఎత్తుపల్లాల దారి గుండా ప్రయాణించి ఈ జలపాతాన్ని చేరాలి. పొగమంచులాంటి తెల్లని జలపాత బిందువులు జలతారుగా తళుక్కున మెరుస్తూ హోరుమని శబ్దం చేస్తూ అతివేగంగా ఉదృతరూపంలో కిందకు ప్రవహిస్తుంది. ఈ జలపాతాన్ని వంతెనపై నుండి మాత్రమే చూడవచ్చు. దిగటానికి మాత్రం అనుమతి లేదు.
కుషాల్ఘర్
కూర్గ్ ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతాన్ని చూసి తీరాల్సిందే. కూర్గులోని ఇతర ప్రదేశాలకంటే ఇక్కడి వాతావరణం భిన్నంగా ఉంటుంది. తేమశాతం అధికంగా ఉండి వాతావరణం చల్లగా ఉంటుంది. అలాగే ఇక్కడి పీఠభూమి, నిసర్గదామ్ వేలమంది బౌద్ధ భిక్షువులు ఉంటున్న గోల్డెన్ టెంపుల్గా పిలిచే టిబెటన్ల మఠం చూడదగినది.
ఎప్పుడు వెళ్ళాలి?
కూర్గ్ అందాలను చూడాలనుకొన్నవారు నవంబర్ నుంచి మే రెండో వారం వరకూ అక్కడికి వెళితే మంచిది. ఈ సమయంలో ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడకి వస్తుంటారు. ముఖ్యంగా వేసవి సెలవులు గడపడానికి ఈ పర్యాటక ప్రదేశం చాలా ఆహ్లాదంగా ఉంటుంది.
ఎలా వెళ్లాలంటే?
బెంగళూరు నుంచి కూర్గ్కు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. అదే విధంగా మైసూరు, హాసన్ నుంచి కూడా నేరుగా వెళ్లవచ్చు. కూర్గ్కు దగ్గరగా ఉన్న విమానాశ్రయం మంగళూరు. మంగళూరు నుంచి నేరుగా ట్యాక్సీ ద్వారా మనం కూర్గ్కు వెళ్లవచ్చు.
Authorization