ఉదయపూర్ అంటే సిటీ ఆఫ్ సన్ రైజ్... సిటీ ఆఫ్ లేక్... స్థానికులు దీన్ని 'శ్వేత నగరం' అని కూడా అంటారు. రాజపుత్రుల చరిత్ర, సంస్కృతి, విజ్ఞాన ప్రదేశాలు ఉదయపూర్ ఇప్పటికీ విశదీకరిస్తుంది. అనేక రాజమందిరాలు విలాసవంతమైన వసతిగృహాలుగా మార్చబడ్డాయి. ఈ నగరాన్ని 'తూర్పు వెనిస్ నగరం', 'ప్రేమ నగరం', 'సరస్సుల నగరం', 'కాశ్మీర్ ఆఫ్ ది రాజస్థాన్' అంటూ ఎన్నో పేర్లుతో పిలుస్తారు. అలాంటి చారిత్రాత్మకమైన ఉదరుపూర్లో చూడదగ్గ ప్రదేశాలు మీకోసం...
సిటీ ప్యాలెస్: 1559లో పిచోల సరస్సు తీరంలో ఈ ఉదయపూర్ సిటీ ప్యాలెస్ ఉంది. మూడు ఆర్చులు కలిగిన త్రిపోలియా అనే ద్వారం 1725లో నిర్మించబడింది. ఈ ద్వారం నుండి బహిరంగ ప్రదేశాలు, తోటలు, భవన గోపురాలు, మందిరాలు వసారాలు చేరుకోవచ్చు. ఇక్కడ అనేక పురాతన కళాత్మకమైన వస్తువులు, చిత్రాలు, అలంకరించిన గృహోపకరణాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.
జల్ మందిరం: 1743-1746లో పిచోలా సరసు మధ్యలో ఉన్న జాగ్ నివాస్ ద్వీపంలోని పాలరాతి రాజభవనం ఇది. అప్పట్పోల రాజకుంటుంబం వారు తమ వేసవి విడిదిగా నిర్మించుకున్నారు. ఇప్పుడిది 'ది తాజ్ హోటల్స్ రిసార్ట్స్ అండ్ ప్యాలెస్' సంస్థ కింద 5 నక్షత్రాల హోటల్గా మార్చబడింది. కొండ శిఖరం మీద నిర్మించబడిన ఈ భవనం నుండి చుట్టూ ఉన్న సరసుల సుందర దృశ్యం కనిపిస్తుంది. ఈ రాజభవనంలో వర్షపు నీటిని సేకరించి సంవత్సరమంతా వాడడానికి అనువైన నిర్మాణం చేయబడింది.
జగదీష్ ఆలయం: ఉదయపూర్ నగర మధ్యలో ఉన్న పెద్ద ఆలయం జగదీష్ మందిర్. ఈ అలయం క్రీ.శ 1651 లో మొదటి మహారాణా జగత్ సింగ్ నిర్మించారు. సింధు-ఆర్యన్ శిల్పకళతో నిర్మించబడిన నిర్మాణాలకు ఇది ఓ చక్కని ఉదాహరణ. ఈ ఆలయం గొప్ప శిల్పకళావైభవానికి, చిత్రాలకు ప్రసిద్ధి చెందినది.
పిచోలా సరస్సు: పిచోలా సరస్సులో రెండు ద్వీపాలున్నాయి. జగ్ నివాస్, జగ్ మందిర్. ఈ సరసు 4 కిలోమీటర్ల పొడవు 3 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. దీన్ని రెండవ మహారాణా ఉదయ సింగ్ నిర్మించాడు. సరస్సు మధ్యలో లేక్ ప్యాలెస్ ఉంటుంది.
సహేలియోంకి బారి: దీన్ని మహారాణితో పంపబడిన 48 మంది చెలికత్తెలు కోసం ఉదయపూర్ రాజుల చేత నిర్మించబడింది. ఫతే సాగర్ సరస్సు తీరంలో ఈ ఉద్యానవనం నిర్మించబడింది. ఈ సరస్సులో తామర కొలనులు, ఏనుగు ఆకార ఫౌంటెన్లు ఉన్నాయి.
గులాబీ తోట, జంతుప్రదర్శనశాల: రాజభవనం సమీపంలో పిచోలా సరస్సు తూర్పు దిక్కున మహారాణా సాజన్ సింగ్ చేత ఓ ఉద్యానవనం నిర్మించబడింది. ఈ ఉద్యానవనంలో సత్యార్ధ్ ప్రకాష్ స్థూపం ఉంది. ఉద్యానవనంలో ఉన్న జంతుప్రదర్శనశాలలో పులులు, చిరుతలు, పక్షులు, కృష్ణ జింకలతో పాటు ఇతర క్రూరమృగాలు ఉన్నాయి.
దూద్ తాలై: ఎ రాక్ అండ్ ఫౌంటెన్ ఉద్యానవనం, సూర్యాస్తమయ దృశ్యం పిచోలా సరస్సు నుండి చూసి ఆనందించవచ్చు. కార్ని మాతా ఆలయం నుండి ఇక్కడికి చేరుకోవడానికి రోప్వే కూడా ఉంది.
శిల్ప్ గ్రామ్: ఉదయపూర్లో హస్తకళల గ్రామం ఇది. ప్రతి ఏడాది ఇక్కడ హస్థకళా వస్తు సంత జరుగుతుంటుంది. ఇది భారతదేశంలో అతి పెద్ద హస్థకళా సంతగా గుర్తింపు పొందింది. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలు ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేసుకొని తమ హస్థకళా ఖండాలను విక్రయిస్తుంటారు.
జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్: ఆసియాలోనే అతి పెద్దదైన భారతీయ రైల్వే శిక్షణా కేంద్రం ఇది. విశాలమైన పచ్చని మైదానంలో చూపరులను ఇట్టే ఆకర్షించే ఆర్చ్ ఆకార భవనం, ప్రశాంతమైన ప్రహరీలతో ఈ ప్రదేశం సరస్సుల నగరమైన ఉదయపూర్కు మరింత శోభను చేకూరుస్తున్నది.
ఇంకా ఇక్కడ భారతీయ లోక్ కళా మందిరంలో జానపదకళల ప్రదర్శన శాలలో పప్పెట్ షో కూడా ఉంటుంది. అలాగే ఫతే సాగర్ నుండి కనిపించే మోతీమా గిరి శిఖరం మీద రాజపుత్ నాయకుడు మహారాణా ప్రతాప్ సింగ్ తన అభిమాన ఆశ్వమైన చేతక్తో కలసి నడుస్తున్నట్లు ఉన్న కంచు విహ్రహం ప్రతిష్ఠించబడి ఉంది. ఫతే సాగర్ సరస్సు మధ్యలో ఉన్న నెహ్రూ పార్క్ 41 చదరపు ఎకరాలు. ఈ ఉద్యానవనంలో సంపెగ కొలను, పూల తోటలు ఉన్నాయి. ఈ ఉద్యానవనం నుండి మహారాణా ప్రతాప్ మోతీ మహల్, ఆరావళి పర్వతాలు దర్శనం ఇస్తాయి. బగోర్ కి హవేలి అనే భవనం పిచోలీ సరస్సు ఒడ్డున గంగోరీ ఘాట్ వద్ద నిర్మించబడింది. ఈ భవనంలో ప్రస్తుతం రాజస్థానీ సాంస్కృతిక సంగీతం, నృత్యాలు ప్రదర్శించబడుతున్నాయి. ఉదయపూర్ నగరానికి 2 కిలోమీటర్ల దూరంలో 19 మంది మేవార్ రాణాల సమాధులు ఉన్నాయి. దీనికి సమీపంలో అహర్ మ్యూజియం ఉంది. ఇక్కడ కొన్ని అతి అపురూపమైన మట్టి పాత్రలు ఉన్నాయి. అలాగే కొన్ని శిల్పాలు, ఇతర వాస్తు నిర్మాణాలు ఉన్నాయి. అలాగే 10వ శతాబ్ధపు బుద్ధుడి కంచు శిల్పం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.
Authorization