దేవరకొండ కోట తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోటలన్నింటిలో ప్రత్యేకత సంతరించుకుంది.13వ శతాబ్దంలో ఈ కోట నిర్మించబడింది. దేవరకొండకి సురగిరి అంటే దేవతల కొండగా కూడా మరో పేరుంది. కోట చుట్టూ 8 చోట్ల ఆంజనేయ స్వామి రూపాన్ని శిలల్లో చెక్కి అష్టదిగ్బంధనం చేశారని, అందుకే ఈ కొండని దేవరకొండ అని పిలుస్తారు అంటారు.
హైదరాబాద్కి 110 కీ.మీటర్లు, నాగార్జున సాగర్కి 45 కీ.మీటర్ల దూరంలో నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్కు వెళ్లే దారిలో మల్లేపల్లి సెంటర్కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కంపల్లి ప్రాజెక్టుకు చేరువలో ఈ దేవరకొండ కోట ఉంది.
ఏడు కొండల మధ్య
15 వ శతాబ్దం నాటి దేవరకొండ కైఫీయత్ ద్వారా మనకు దేవరకొండ కోట విశేషాలు వెల్లడి అయ్యాయి. సుమారు 700 సంవత్సరాల కిందట అంటే 13 వ శతాబ్దంలో నిర్మించబడ్డ ఈ కోట కాకతీయులకు సామంతులుగా ఉండి తర్వాత కాలంలో స్వతంత్రులైన పద్మనాయకుల రాజధానిగా విలసిల్లింది. అనపోత నాయకుడు, రెండవ మాదానాయుడు కాలంలో కోట నిర్మాణం పూర్తికాగా మాదానాయుడి వారసులు దేవరకొండని, అనపోత నాయకుడి వారసులు రాచకొండని రాజధానిగా చేసుకొని 1236 సంవత్సరం నుండి 1486 సంవత్సరం వరకు తమ పరిపాలన సాగించారు. తరువాత కాలంలో ఈ కోటలు బహ్మని సుల్తానులు, కుతుబ్షాహిల వశం అయ్యాయి. 500 అడుగుల ఎత్తులో ఏడు కొండల మధ్య రాళ్లతో నిర్మితమైన ఈ కోట చుట్టూ రక్షణగా మట్టి, రాళ్లతో కట్టిన కోట గోడలు ఉన్నాయి.
ఎన్నో నిర్మాణాలు
ఈ కోట విస్తీర్ణం దాదాపుగా పది కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మొత్తం 7 గుట్టలని చుట్టి ఉన్న ఆ శిలా ప్రాకారంలో సుమారు 360 బురుజులు, రాతితో కట్టిన 9 ప్రధాన ద్వారాలు, 32 ప్రాకార ద్వారాలు, 23 పెద్ద బావులు, 53 దిగుడు బావులు, కోనేరులు, చిన్న కొలనులు, సైనికుల నివాసాలు, భవనాలు, 13 ధాన్యాగారాలు , రాజమందిరం, అంత్ణపురం, సభా వేదికలు ఉన్నాయి. అంతేకాకుండా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ప్రాకారాల మెట్లు, రహస్య ద్వారాలు, ప్రధాన ద్వారాల మధ్య రెండు అంతస్థులలో కట్టిన సైనిక స్థావరాలు, ఆయుధగారాలు, నాటి శత్రు దుర్బేధ్యమైన నిర్మాణాలకు చిహ్నాలుగా ఉన్నాయి.
శిథిలావస్థకు చేరుకున్నాయి
నాటి కాలంలో మొఘలులతో జరిగిన యుద్దాలకు నిదర్శనంగా ఫిరంగులు కనపడతాయి. రాజ దర్బార్ ఉన్న కోట ద్వారాలకు రెండు వైపులా పూర్ణ కుంభాలు, సింహాలు, తాబేళ్లు, చేపలు గుర్రాలు చెక్కి ఉన్నాయి. కోట సమీపంలో ఉన్న నరసింహ ఆలయం , ఓంకారేశ్వర ఆలయం, రామాలయం లాంటి దేవాలయాలు, శిధిల విగ్రహాలు కాకతీయుల శిల్ప వైభవాన్ని చాటుతాయి. బలానికి ప్రతీకగా సింహ రూపాలను, ధర్మ రక్షణకు ప్రతీకగా ధర్మచక్రాన్ని దుర్గం ద్వారాలపై చెక్కారు. అయితే ఈ కోట సింహద్వారంపై చెక్కించబడిన పూర్ణ కలశం చిహ్నాన్ని రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నంగా తీసుకున్నారు.
ప్రస్తుతం అవి చాలా వరకు శిథిలం అయ్యాయి. జల సమృద్ధి గల కోటలో సుమారు 100 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. కోటలో ఉన్న ఎల్లమ్మ, కోట మైసమ్మ దేవతలకు ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి, మహా శివరాత్రి నాడు ఉత్సవాలు జరుగుతాయి. పాలమూరుకు చెందిన ముకురాల రామారెడ్డి అనే కవి '' దేవరకొండ దుర్గం'' అనే పేరుతో ఖండ కావ్యం రచించారు.
Authorization