చరిత్ర అంటే కాలంతోపాటు కాల గతిలో కలిసిపోయేది కాదు.. కరిగిపోయేది కాదు. కాలానికి ఎదురొడ్డి నిలిచి దాని విలువలను, ఆ వైభవాలను భవిష్యత్ తరాలకు నూతనంగా తెలియజేసేది. అలాంటి గొప్ప చరిత్రను నిక్షిప్తం చేసుకున్న వాటిలో కరీంనగర్ జిల్లాలోని 'నగునూరు కోట' కూడా అగ్ర భాగంలో నిలుస్తుంది. నగునూరు కోటలోని ప్రతి ప్రాకారంలోనూ ఆనాటి కాకతీయ రాజుల పాలనలోని మహా వైభవంతో పాటు వారి రాజసం, దర్పం ఆనాటి ప్రజల సంగతులు మనకు కళ్ళకు కట్టినట్టుగా నేటికీ కనిపిస్తాయి. శిథిలమైన ఇక్కడి కోట గోడలు, నాటి ప్రాభవానికి సాక్ష్యంగా నిలిచిన రాతి నిర్మాణాలు కాకతీయ రాజుల సామ్రాజ్య వైభవాన్ని, శక్తిని మనకు తెలియజేస్తాయి.
కరీంనగర్ జిల్లా కేంద్రానికి 8 కి.మీ. దూరంలో వున్న నగునూరు కోట ఎన్నో చారిత్రకమైన అంశాలకు, శిల్ప కళా సంపదకు నెలవు. క్రీ.శ. 946 నాటి నగనూరులో లభించిన శిలాశాసనం ప్రస్తుతం కరీంనగర్ మ్యూజియంలో భద్రపరిచారు. ఈ కోట అనేక శిల్పకళా నైపుణ్య విలువలతో కూడిన కోట. అయితే ప్రస్తుతం శిథిలావస్థలో గత కాలపు వైభవపు ఆనవాలుగా మాత్రమే మిగిలి వుంది. ఎటు చూసినా శిథిల శిల్పాలు, కూలిన గోడలు, బీటలు వారిన కోట గోడలు, దుండగుల చేతిలో ధ్వంసమైన అందమైన రాతి శిల్పాలు. వాటిని చూసినపుడు మనసు బాధతో మూలుగుతుంది. ఆ బాధ ఎలా వున్నా నాటి అసమాన శిల్పకళకు సంబంధించిన విజ్ఞానం ఇప్పటికీ కొంత మిగిలి ఉంది.
అద్భుతమైన నిర్మాణం
కోటలో అత్యంత ఆకర్షణీయంగా ఉండే రాతి మందిర నిర్మాణంతో పాటు శివాలయ నిర్మాణం అద్భుతం అని చెప్పవచ్చు. కాకతి రుద్రదేవుని మంత్రి నగునూరు పాలకుడు వెల్లకి గంగాధరుడు నగునూరులో త్రికూట దేవాలయాన్ని కట్టించినట్లు కరీంనగర్ కలెక్టర్ బంగ్లాలో ఉన్న శాసనాన్ని చూస్తే తెలుస్తోంది. శివాలయం చుట్టూ వుండే స్తంభాలు, ఆలయంపై చెక్కబడిన శిలా విగ్రహాల తీరు ఆనాటి శిల్పకళాకారుల అద్భుత నైపుణ్యాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపడమేగాక మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. శిలలను తొలిచి అందమైన రాతి శిల్పాలుగా మలచడానికి వారు పడిన కఠిన శ్రమ కనబడుతుంది.
ప్రస్తుతం శిథిలావస్థలో...
ఒకనాడు ఎంతో వైభవాన్ని చవి చూసిన కోట పూర్తిగా ధ్వంసమయింది. కోట చుట్టూ శతృదుర్భేద్యంగా నిర్మించిన రాతిగోడ, మట్టిగోడ, కందకం, బురుజులు, ఇతర కట్టడాలు నామరూపాలు లేకుండా పోయాయి. కోటకు సంబంధించిన గోడలలోని రాళ్ళను చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఇతర కట్టడాలకు వాడటానికి ఉపయోగించడం వల్ల రాళ్ళు సైతం మాయం అయ్యాయి. వీటన్నింటిలోకి రెడ్ స్టోన్తో చేయబడ్డ 'త్రీ స్రైన్ శివ టెంపుల్' ఒక గొప్ప కళాఖండం. వీటి నిర్మాణ తీరు తెన్నులే వీటి వయసును నిర్ధారిస్తాయి. అలాగే సాలేశ్వర, గణపతీశ్వర, సకలేశ్వర, రామనాథ, వైష్ణవ, రామలింగాది అనేక దేవాలయాలు ఇక్కడ నిర్మించబడ్డాయి. ఈ దేవాలయాల నిర్మాణాలన్నీ కూడా కోట ఆవరణలోనే వుంటాయి. అదే ఈ కోట ప్రత్యేకం.
Authorization