సృజనాత్మకతే తన జీవితంగా మార్చుకున్న వ్యక్తి దృష్టికోణంలో పర్యాటక ప్రదేశాలు చూసినప్పుడు వాటి వైశాల్యం మరంత ఎక్కువగా కనబడుతుంది. మనుషుల్ని అర్థం చేసుకునే సహజ లక్షణం, సంయమనంతో లోకాన్ని పరికించే సహనం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. వీటితో పాటు సుదీర్ఘకాలపు సాహిత్య సృజన చేస్తున్న సృజనశీలి డా.కందేపి రాణీ ప్రసాద్. పిల్లల రచనా వ్యాసంగంలోకి వచ్చిన అమె బాలసాహితీవేత్తగా పేరు తెచ్చుకున్నారు.
ఎన్నో పుస్తకాలు రచించిన ఈమే ఇటివలే 'హౌస్ వైఫ్' కవితా సంకలనం ప్రచురించారు. దానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం కూడా అందుకున్నారు. ఆమెకు యాత్రలు చేయడమన్నా ఆ ప్రదేశాన్ని పదిమందికి పరిచయం చేయడమన్నా అమితమైన ఇష్టం. విహార యాత్రలకు సంబంధించి రాణీప్రసాద్ కలం నుంచి వెలుగు చూసిన రెండో పుస్తకమే ఈ 'కనుచూపుమేర...'
సరళంగా, సూటిగా, పదునుగా ఉంటుంది కందేపీ రాణీప్రసాద్ రచానా శైలీ. ఏ రచనని ఎక్కడ ఎలా మొదలు పెట్టాలో తెలిసిన ప్రతిభాశాలి ఆమె. ఆ సృజనాత్మక ప్రతిభను తారాస్థాయిలో అభివ్యక్తం చేసిన రచన ఈ యాత్రాకథనాలు. తొలి అధ్యాయాన్ని చదివితే ప్రకృతి ఒడిలో తెలియని పరవశానికి లోనైన అనుభూతి పాఠకులకు కల్గుతుంది. ఎందుకంటే అది ప్రకృతి అందాలకు పుట్టినిల్లైన కేరళ గురించి కావడం. ఆ తర్వాత ఒక్కక్కొటి చదువుతుంటే ఆ ప్రదేశాలను చూడాలనిపించే కుతూహలం కలగక మానదు. ఇరువై ఒక్క ప్రదేశాల గురించి ఇష్టంగా, ప్రేమగా, పిల్లలకు అర్థమయ్యే రీతిలో రాశారు. ఇరవై ఒక్క కథనాలల్లో ఒక అయిదు తప్ప మిగతావన్ని మన దేశంలోనివే కావడం వల్ల అనుకుంటా ఈ పుస్తకానికి 'కనుచూపుమేర...' అని పేరు పేట్టారు.
కేరళ అందాలను పెద్దలకు ఓ తీరుగా చెబితే పిల్లల కోసం 'ఎలిఫెంట్ కాంప్' పేరుతో మరో వ్యాసం రాశారు. దానిలో గురువాయూర్లో గల ఎలిఫెంట్ కాంప్ గురించి వివరించారు. 'నీలినీలా అలల ముంబయి' పేరుతో ముంబయి నగర అందాలను వివరించారు. 'రాజీవ్ సీలింక్ బ్రిడ్జి' ను చూపిస్తూ కలకత్తాలోని 'హౌరా బ్రిడ్జి' ని గుర్తు చేయడంతో పాఠకులకు రెండూ చూడాలనే ఆసక్తి కలుగుతుంది. అదేవిధంగా ముంబయిలో గల నెహ్రూ సైన్స్ సెంటర్, లైట్ అండ్ సైట్ ఎగ్జిబిషన్ అందాలు, ఆంధ్రమహాసభ విశేషాలు ఆసక్తి కరంగా వివరించారు.
చెన్నై పర్యాటన దాదాపు పెడికాన్ చుట్టూనే తిరిగినా పాఠకులకు ఓ డాక్టర్స్ వర్కషాప్ని పరిచయం చేసినట్టుంది. మాంఛెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియాగా, పంప్ సిటీగా పిలవబడే కోయంబత్తూరు విశేషాలను కండ్లకు కట్టినట్లు వర్ణించారు. కోయంబత్తూరులోని ఓ మెడికల్ కాలేజీ కోసం ప్రత్యేకం కట్టిన బ్రిడ్జి వివరాలు తెలియాలంటే అక్కడికి వెళ్లాసిందే అనే అనుభూతి మనకు కలగకమానదు.
సిటీ ఆఫ్ టెంపుల్స్గా పేరుగాంచిన ఉజ్జయిని గురించి ప్రతి చిన్న విషయాన్ని వదలకుండా తెలియజేశారు. అంతే కాకుండా కాళీదాసు గురించి చాలా విషయాలను ప్రస్థావించిన రాణీప్రసాద్ మహాకాలేశ్వర్ ఆలయం పక్కనే ఉన్న విక్రమార్కుడి సింహాసనం గురించి, సాలభంజికల కథలను గురించి రేఖా మాత్రంగానైనా ప్రస్థావించి ఉంటే ఇంకా సమగ్రంగా ఉండేది. ఆరెంజ్ సిటీగా పేరుగాంచిన నాగపూర్ విశేషాలు, ఇండోర్ అందాలను చూడవచ్చు. జగన్నాథ కేత్రంగా పేరుపొందిన భువనేశ్వర్ విశేషాలను తెలుసుకుంటే పింక్ సిటి అయిన జైపూర్ అందాలను ఆనందంగా మదిలో పదిలపర్చుకుంటారు. దేశంలోనే పేరుగాంచిన రాజాదినకర్ కేల్కర్ , ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ హిస్టరీ, మహాత్మ పూలే, బాబా సాహెబ్ అంబేద్కర్ మొదలైన మ్యూజియంల విశేషాలను తెలుసుకోవచ్చు.
చండీఘర్లోని రోజ్ గార్డెన్ విశేషాలను చదువుతుంటే ఆ గులాబీల అందాలను కండ్లారా చూడాలనే అనుభూతి కలుగుతుంది. సహజంగా వ్యర్థాలతో కళాకృతులు చేసే రాణీప్రసాద్కి రాక్ గార్డెన్లోని నేక్ చెంద్ సృష్టించిన కళాఖండాలు ఆమెకు సరికొత్త టాస్క్లను ఇచ్చే ఉంటాయి. ఇంకా ఈ సంపుటిలోని రంగన తిట్టు పక్షి వివరాలు, జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర్ దర్శనం, మంగుళూర్ సోయగాలు, అండమాన్ జైల్ విశేషాలు చదువుతుంటే భారతదేశాన్ని చుట్టివచ్చిన అనుభూతి కలుగుతుంది.
దేశ సరిహద్దులు దాటి దక్షిణాఫ్రికా ఆస్ట్రిచ్ అందాలు, ధారు లాండ్ విశేషాలు, స్విట్జర్లాండ్ సోయగాలు, ఈఫిల్ టవర్, చైనా మహాకుడ్యం అందాలను చుట్టి రావొచ్చు. అలాగే ఈ పుస్తకంలో సైన్స్, వైద్య పరమైన విశేషాలతో పాటు ఏఏ హాస్పిటల్స్ ఎక్కడేక్కడ అందుబాటులో ఉన్నాయి అనే వివరాలను తెలుసుకోవచు. ముఖ్యంగా పెడికాన్ సమావేశాల విశేషాలతో పాటు, దర్శినీయ ప్రదేశాల వివరాలను తెలుసుకుంటారు.
మొత్తానికి 'కనుచూసుమేర'తో కలిసి ప్రపంచాన్ని చుట్టి వచ్చిన పాఠకులకు ఇదో సైన్స్ యాత్రగా అనిపిస్తుంది.
- అనంతోజు మోహన్ కృష్ణ,
8897765417
Authorization