కేరళాలోని కోచీకి చెందిన విజయన్, మోహన అనే దంపతులు తమ 45 ఏండ్ల వైవాహిక జీవితంలో 23 దేశాలను చుట్టివచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అందులో చిత్రం ఏముందీ? వారికి బాగా డబ్బుందేమో అనుకుంటే పొరపాటే.. కేవలం టీ అమ్మితే వచ్చిన డబ్బులతోనే ఆ జంట విదేశాల్లో పర్యటిస్తున్నారు.
టూర్ ప్లాన్: విజయన్, మోహనాలు కోచీలో 'శ్రీబాలాజీ కాఫీ హౌస్' అనే టీ, కాఫీ షాపు నడుపుతున్నారు. వారికి ప్రపంచ పర్యటన చేయాలని కోరిక. ఇందుకు చాలా డబ్బు అవసరమని వారికి తెలుసు. టీ అమ్మితే వచ్చే రాబడి అందుకు సరిపోదు. దీంతో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ.. మిగతా సొమ్మును బ్యాంక్ నుంచి రుణంగా తీసుకునేవారు. ఆ డబ్బుతో విదేశాలు తిరిగి వచ్చేవారు. పర్యటన ముగించిన వచ్చిన తర్వాత తీసుకున్న రుణాన్ని తీర్చేసి మరో ట్రిప్కు ప్లాన్ చేసేవారు.
ఎర్నాకులం కూడా దాటలేదు
''జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. ప్రపంచం మొత్తం చుట్టిరావాలనేది నా చిననాటి కోరిక. పెండ్లికి ముందు నా భార్య ఎర్నాకులం దాటి ఎక్కడికి వెళ్లేది కాదు. పెండ్లయిన తర్వాత నాతో కలిసి దేశం మొత్తం తిరిగేసింది. ఇప్పుడు విదేశాల్లో సైతం పర్యటిస్తూ ఎంతో సంతోషంగా ఉంది'' అంటున్నారు విజయన్.
ఇప్పటికి 23 దేశాలు
1963 నుంచి విజయన్ టీ అమ్ముతూ కుటుంబాన్ని నడుపుతున్నారు. ఆయన షాపులోని గోడలపై వారి విదేశీ పర్యటనలకు సంబంధించిన ఫొటోలు, వాటి బిల్లులు, వివిధ దేశాల కరెన్సీ నోట్లను చూడొచ్చు. ఈ షాపులో పనివాళ్లు ఎవరూ ఉండరు. దాంతో ఆ ఖర్చులు కూడా మిగులుతున్నాయి. ఇప్పటి వరకు తిరిగిన 23 దేశాల్లో విజయన్కు సింగపూర్, స్విట్జర్లాండ్, న్యూయార్క్ దేశాలు బాగా నచ్చాయట. ఇంకా స్వీడన్, డెన్మార్క్, నెదర్లాండ్, గ్రీన్ ల్యాండ్, నార్వేలు చుట్టి రానున్నట్లు తెలిపారు.
వీరిపై డాక్యుమెంటరీ...
ఈ జంటపై హరిమోహన్ అనే డైరెక్టర్ 'ఇన్విజిబుల్ వింగ్స్' అనే డాక్యుమెంటరీ రూపొందించారు. ఈ చిత్రానికి 2018 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కార్యక్రమంలో నాన్ ఫిక్షన్ విభాగంలో అవార్డు దక్కింది. ఇందులో విజయన్ తన లైఫ్ 'జర్నీ' గురించి ఎంతో స్పష్టంగా అందంగా వివరించాడు.
Authorization