వాహనాల రణగొణ ధ్వను లుండవు.. ఇరుగు పొరుగు నివాసుల మాటలు వినిపించవు.. కనీసం కనిపించరు కూడా! అక్కడక్కడ భయంకరమైన నిశ్శబ్ద రాజ్యం. అప్పుడప్పుడూ వర్షపు హోరు.. సాధారణ జీవితానికి దూరంగా ఇలాంటి వాతావరణంలో కొద్ది రోజులైనా విహరించాలని తపించనివారు అరుదు. అందుకే వర్షాకాలం ఆరంభం కావడంతోనే దక్షిణాది చిరపుంజిగా పేరుపొందిన ఆగుంబెను అత్యధికులు సందర్శిస్తుంటారు.
కర్నాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకాలోని ఈ కుగ్రామం వర్షాకాలం వస్తేచాలు సందడిగా మారుతుంది. ఇక్కడికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. సాధారణ బస లభిస్తున్నా సందర్శకులకు కొదవ ఉండదు. మొన్నటి వరకు ఒకే పూటకూళ్ల ఇల్లు మాత్రమే ఉండేది. ఇటీవలి కాలంలో అనేక సంస్థలు హోటళ్లను నిర్వహిస్తున్నాయి.
వృక్ష సంపదపై అధ్యయనం
కొండల్ని తాకుతూ వెళ్లే మేఘాలు, అప్పుడప్పుడూ ఏకధాటి వర్షం కురిసే సందర్భాలు.. పచ్చదనంతో సింగారించుకుని కనిపించే పరిసరాలు ఆగుంబె ప్రాంతాన్ని మైమరిపిస్తాయి. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలనుకుంటారు. సూర్యాస్తమయాన్ని చూడడం ఇక్కడి ప్రత్యేకత. నల్లతాచులు ఇక్కడ తరచూ కనిపిస్తుంటాయి. వీటిపై పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు కనిపిస్తారు. పడమటి కనుమల్లో వర్షాలపై కూడా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇక్కడి అడవుల్లో కనిపించే అపురూపమైన వృక్ష సంపదపై కూడా అధ్యయనాలు కోకొల్లలు.
వర్షంలో తడుస్తూ...
శివమొగ్గ, ఉడుపి, మంగళూరు నుంచి బస్సు సదుపాయం ఉంది. రైల్లో ఉడుపి వరకు వచ్చి అక్కడి నుంచి బస్సుల్లో కూడా చేరుకుంటారు. వర్షంలో తడుస్తూ సాహస యాత్ర చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఇందుకోసమే జూన్ మొదటి వారం నుంచి సందడి కనిపిస్తుంది. సాధారణంగా వర్షాలు వద్దనుకునేవారు నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు మక్కువ చూపుతుంటారు.
Authorization