భారతదేశ శిల్పకళా వైభవానికి ఓ మచ్చు తునక ఎల్లోరా గుహలు. శతాబ్దాల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. కఠినమైన రాతిశిలల్లో దాగి ఉన్న అద్భుతమైన, అందమైన కళాకృతులనూ మనమూ ఓసారి చూసొద్దాం...
ఎల్లోరాలోని అత్యంత పురాతనమైన నిర్మాణం ఒకటో గుహ. ఇది ఎనిమిది గదుల విహారం. ఇందులో విశాలమైన ప్రాంగణం ఉంది. రెండో గుహ పెద్ద చైత్యమందిరం. ఇందులో సింహాసనంపై కూర్చొన్న అతి పెద్ద బుద్ధవిగ్రహం, పద్మాసనంలో ఉన్న బుద్ధుని విగ్రహాలు, అనేక మంది బోధిసత్వుల విగ్రహాలను ఆనాటి శిల్పులు రమణీయంగా మలిచారు. మూడో గుహ ప్రాంగణం చివరిలో ప్రార్ధనామందిరం ఉంది. ఇక్కడ పద్మాసనంలోని బుద్ధుని పక్కనే నాగశిల్పాల విగ్రహాలున్నాయి. ఐదోనెంబరు గుహ విహారం, ఇందులో రెండు వైపులా ప్రత్యేకంగా గూళ్లు ఉన్నాయి. ఆరో గుహ బౌద్ధ గుహ అయినప్పటికీ వీణాపాణి సరస్వతి విగ్రహంతో పాటు వివిధ బౌద్ధ జాతక కథల శిల్పాలున్నాయి. పదో గుహ బౌద్ధచైత్య మందిరం.
అతి పెద్ద విగ్రహం
పదకొండో గుహ మూడంతస్థుల్లో నిర్మించిన ఓ కట్టడంలా ఉంది. ప్రతి అంతస్థులోనూ వసారాలున్నాయి. పన్నెండో గుహ మరింత పెద్దది. ఇది కూడా మూడు అంతస్థుల్లో ఉంది. దీనిని ఇక్కడ 'తీన్థల్'గా పిలుస్తారు. ఆలయం లోపల అతి పెద్దదైన బుద్ధుని విగ్రహం ఉంది. ఇలాంటి విగ్రహం ఇంకెక్కడా మనకు కనిపించదు. దీన్ని క్రీ.శ 7-9 శతాబ్దాల మధ్య కాలంలో చెక్కారని అక్కడున్న సూచికలు తెలియజేస్తాయి.
30 లక్షల ఘనపుటడుగుల రాతిని చెక్కి...
ఎల్లోరా గుహాలయాల్లో అత్యంత అద్భుతమైనది పదహారో గుహ. ప్రపంచంలోనే అద్భుతమైన ఏకశిలా నిర్మాణంగా ఇది గుర్తింపు పొందింది. మానవ మహామేధస్సుకు, కళాసృజనకూ నిలువెత్తు నిదర్శనం ఇది. ఒక కొండలోని 30 లక్షల ఘనపుటడుగుల రాతిని చెక్కి 107 అడుగుల లోతు, 154 అడుగుల వెడల్పు, 276 అడుగుల వైశాల్యంతో ముందుగా తవ్వి, ఆ తర్వాత మధ్యలో మిగిలిన రాతిని దశాబ్దాలపాటు చెక్కి ఉంటారు. గోడలపైనా అపారమైన నగిషీలను చెక్కి, వాటికి అద్భుత నిర్మాణాన్ని జోడించారు. ఏనుగులే ఆలయభారాన్ని మోస్తున్నట్లుగా ఉన్న భంగిమలతో శిల్పులు చక్కగా తీర్చిదిద్దారు.
సూక్ష్మశైలిలో అద్భుత చిత్రాలు
ఇంకా పైకి వెళితే పన్నెండు ఫలకాలు గల గ్యాలరీ ఉంది. గోడకు దక్షిణంవైపునఉన్న గ్యాలరీ ఆనుకొని విష్ణువు విగ్రహాలు విభిన్న రూపాల్లో చెక్కారు. గుహకు అన్ని వైపులా రకర కాల శిల్పాలు భారతీయ శిల్పుల కళా ప్రతిభకు అద్దం పడుతున్నాయి. ఎదురుగా యాభై అడుగులు ఎత్తుకలిగి ముఖ్య కట్టడానికి సమాంతరంగా ఉన్న మందిరం ఒకటి ఉంటుంది. ఇరవై చదరపు అడుగుల వైశాల్యమున్న ఈ మందిరంలో నంది విగ్రహానికి ఇరువైపులా ఒక రాయి, స్తంభం ఉన్నాయి. ఈ ధ్వజస్తంభం సుమారు యాభై అడుగులకు పైగా పొడవుంటుంది. దీనిమీద సూక్ష్మశైలిలో ఎన్నో శిల్పాలను చెక్కి ఉన్నారు. 25వ గుహ అంతర్భాగంలో ఏడుగుర్రాల రథంపై నిలబడి ఉన్న పెద్ద సూర్యుని విగ్రహం ఉంది.
జైన తీర్థంకరుల విగ్రహాలు
జైన మతానికి సంబంధించిన 30 నుంచి 34వ నంబరు వరకు ఉన్న గుహల్లో ముఖ్యమైనవి 32, 34 గుహలే. 30వ గుహలోని స్తంభాలు, పైకప్పులనూ పద్మాకారపు నగిషీలతో చెక్కారు. వర్ధమాన మహావీరుని విగ్రహం, దాని చుట్టూ చాలా మంది జైన తీర్ధంకరుల విగ్రహాలున్నాయి. 31వ నెంబరు గుహలో కూడా మహావీరుని విగ్రహం, తీర్థంకరుల విగ్రహాలున్నాయి. 32వ గుహను 'ఇంద్రసభ' అంటారు. దీని ముఖద్వారం వద్ద సుమారు 30 అడుగుల ఎత్తైన ఏనుగు విగ్రహం ఉంది. చివరిదైన 34 వ గుహలో ఉన్న విగ్రహాలన్నీ సేవకబృందాలతో ఉన్న జైన తీర్ధంకరులవే. గోడల్లోనూ స్తంభాలపైనా జైన తీర్ధంకరుల విగ్రహాలు చెక్కి ఉంటాయి.
ఎలా వెళ్లాలి
హైదరాబాద్ నుంచి మన్మాడ్కు వెళ్లే రైలుమార్గంలోనే ఔరంగాబాద్ స్టేషన్ ఉంది. అక్కడి నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా గుహలున్నాయి. వీటిని చేరుకోవడానికి బస్సులు, ఇతర వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఔరంగాబాద్లో అందుబాటు ధరల్లోనే హోటళ్లు లభిస్తాయి.
Authorization