ఇరవై మంది ఓ జట్టుగా చైనాలోని షాంఘై, బీజింగ్ నగరాలను చూడటానికి 2019 నవంబర్ నెల 15 నుండి 21 వ తేదీ వరకు పర్యటించాం. షాంఘై విమానయాన ప్రాంగణంలో మాకు గైడ్ గా వ్యవహరించే డింగ్ అనే చైనా యువకుడు కలిశాడు. చక్కని హావభావాలతో పాటు ఆంగ్ల భాషపై అతనికి పట్టు వుంది. ప్రాంగణం బయట వున్న మాగ్-లేవ్ రైల్వే స్టేషన్కు మమ్మల్ని తీసుకు వెళ్ళాడు. ఈ మాగ్-లేవ్ ట్రైన్ గంటకు 300 కిలో మీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. అందుకే 35 కిలోమీటర్ల దూరమున్న షాంఘై పట్టణానికి ఆ ట్రైన్లో పది నిమిషాల్లోపే చేరుకున్నాం. అక్కడినుంచి మాకోసమే ఏర్పాటు చేసిన బస్సులో బయలుదేరి ఓ భారతీయ రెస్టారెంట్లో భోజనం చేసి బసచేయాల్సిన హోటల్కు వెళ్ళిపోయాం. మర్నాడు పొద్దున అల్పాహారం చాలా బాగుంది. పగటిపూట వేడి ఇరవై డిగ్రీలు, రాత్రిపూట చల్లగా వున్నా హాయిగా అనిపించింది.
నవంబర్ 16న మా ప్రయాణం చైనాలోకెల్లా ఎత్తైన 118 అంతస్తుల కట్టడాన్ని చూడటంతో మొదలైంది. 2070 అడుగుల ఎత్తున్న ఆ కట్టడం పేరు షాంఘై టవర్. దానిపక్కనే వున్న జిన్-మావో టవరులో 88వ అంతస్తుకు అతివేగంగా వెళ్లే లిఫ్ట్ ద్వారా చేరి, నాలుగు వైపులా తిరుగుతూ ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నాం. అక్కడనుంచి సిల్క్ ఫ్యాక్టరీకి వెళ్లి పట్టుపురుగుల నుంచి పట్టు తీయడం, వస్త్రాలు నేయడం చూసాం. ధర ఎక్కువనిపించి ఏమీ కొనలేదు. తర్వాత చైనాలోనే ఎత్తైన పచ్చ రాయితో చెక్కిన బుద్ధుని విగ్రహాన్ని ఓ బౌద్ధాలయంలో సందర్శించాం. అత్యధిక చైనాప్రజలు బుద్ధుడిని పూజిస్తున్నారు. చైనాలో చెప్పులతో గుడికి వెళ్ళవచ్చు. అయితే అక్కడ చర్చీలు, మసీదులు దాదాపు కనిపించలేదు.
పాతతరం ఫ్రెంచ్ కాలనీ
భోజనం తర్వాత హువాంగ్-పు నదిలో గంటసేపు పడవ షికారు చేశాం. నదికి ఇరువైపులావున్న ఎత్తైన భవనాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో మెరుస్తూ కంటికింపుగా కనిపించాయి. అక్కడి నుంచి జింటియాండి అనే ఓ పాతతరం ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళాం. దాదాపు రెండు శతాబ్దాల కిందట ఫ్రెంచ్ వాళ్ళు చైనాను వదిలి వెళ్ళినప్పుడు ఎలా వుండేదో అలాగే వుంది. దానిని ఆధునీకరించినా పాతకాలపు రూపును మార్చలేదు. అక్కడి వాతావరణమంతా పాశ్చాత్య దేశాల్లో వున్నట్లు బార్లు, రెస్టారెంట్లు, కాఫీ షాపులు.. అది వేరే లోకం. ఇదంతా షాంఘై ప్రజలు రాత్రిని ఆనందంగా గడపడానికి వినియోగిస్తున్నారు. అలసిపోయిన మేము కూడా హోటలుకు తిరుగు ప్రయాణమయ్యాం.
షాంఘై మ్యూజియం
నవంబర్ 17 షాంఘైలోకెల్లా పురాతనమైన మార్కెట్ యూయువాన్తో మొదలు పెట్టాం. దీనిని 1850 లలో అప్పటి రాజుల కాలంలో కట్టడం జరిగింది. అక్కడ పురాతనమైన చైనా వాస్తుకళ శైలితో కట్టిన భవంతులు, వ్యాపార సముదాయాన్ని చూశాం. వంతెనలు, వాటికింద నీటిలో ఈదులాడే బంగారు రంగు చేపలు చివరికి డ్రెయినేజీ మూతలు కూడా కళాత్మకంగా వున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలను అక్కడ చూడవచ్చు. అయినా పరిశుభ్రంగా ఉంటుంది. ఎన్ని ఫొటోలు, సెల్ఫీలు తీసినా తనివి తీరదు. షాపింగ్ చేయడానికి అనువైన ప్రదేశం. అక్కడి నుంచి షాంఘై మ్యూజియం చేరుకున్నాం. అది మూడంతస్తుల భవనం. అందులో శతాబ్దాలుగా విలసిల్లుతున్న చైనీయుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు, జీవనశైలి ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు.
కళాకౌశల విన్యాసాలు
భోజనం తర్వాత (ఆసియా పసిఫిక్) ప్లాజా అనబడే వ్యాపార సముదాయానికి మా ప్రయాణం. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. కానీ బేరమాడటంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. షాంఘైలో మా చివరి అంకం.. చైనీయుల కళాకౌశల విన్యాసాల ప్రదర్శన చూడటం. అది సాయంత్రం ఏడున్నరకు మొదలై, తొమ్మిది గంటలకు ముగిసింది. ఇది నిజంగా చూడదగ్గ ప్రదర్శన. ఇక ఆతర్వాత నేరుగా హోటలుకు వెళ్లి నిద్రకుపక్రమించాం. పొద్దున్నే బుల్లెట్ ట్రైన్లో బీజింగ్ వెళ్ళడానికి బయల్దేరాం. షాంఘై నుంచి 1350 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీజింగ్ కేవలం నాలుగున్నర గంటల్లో చేరుకున్నాం.
ఒలింపిక్ స్టేడియం
బీజింగ్లో మా గైడ్ పేరు మిస్ అలిసన్. మూడు పదుల వయసున్న ఆవిడ చక్కటి నవ్వు ముఖంతో ఉత్సాహవంతంగా వుంది. మేం భోజనంచేసి ఒలింపిక్ స్టేడియం చూడటానికి బయలుదేరాం. స్టేడియాన్ని 'పిట్ట గూడు' ఆకారంలో కట్టడంవల్ల దానికి 'బర్డ్స్ నెస్ట్' అని పేరు పెట్టారు. అక్కడి వాతావరణం సున్నా డిగ్రీల కంటే తక్కువకు పడిపోవటంవల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం. అయినప్పటికీ ఆ కట్టడాన్ని చూడటం చాలా సంతోషాన్ని కలిగించింది. సెల్ఫీలు, ఫొటోలు దిగిన తర్వాత మేం బసచేసే హోటలుకు వెళ్ళాం. బీజింగ్ చుట్టుపక్కల వున్న ప్రజలను దూరప్రదేశాలకు తరలించి ఒలింపిక్ స్టేడియాన్ని, గ్రామాన్ని నిర్మించారు. రహదార్లు, వంతెనలు, వెడల్పైన రహదార్లు, ఎత్తైన వంతెనలు, ఆకాశ హర్మ్యాలు ఒక్కటేమిటి.. అన్నింటినీ అనుకున్న విధంగా నిర్మించి ఓ కొత్త చైనాను ఆవిష్కరించారు.
తియనాన్మెన్ స్క్వేర్
నవంబర్ 19న చైనాలో మా ఐదవ రోజు.. చింగ్ రాజవంశీయుల వేసవి విడిది చూడటానికి బయలుదేరాం. అక్కడి ఉద్యానవనాలు, మంచినీటి సరస్సు చూడటానికి చాలా చక్కగా, పరిశుభ్రంగా వున్నాయి. చెత్తా, చెదారం చూద్దామన్నా కంటికి కనపడలేదు. ఈ రోజు కాస్త తొందరగా భోజనం ముగించుకుని తియనాన్మెన్ స్క్వేర్ సందర్శనకు వెళ్ళాం. ఆ ప్రదేశం చూడటానికి చక్కగా, పరిశుభ్రంగా వుంది. అది పగలు, రాత్రి సైనికుల పహారాలో వుంటుంది. 1976లో మావో జెడాంగ్ మరణానంతరం అతని పార్థివ దేహాన్ని రసాయనాలతో శుభ్రపరచి తియనాన్మెన్ స్క్వేర్ మధ్యలో ఒక భవంతిలో భద్రపరచారు. ఈ స్క్వేర్లో ఒక పక్క చైనా పార్లమెంట్ మరో పక్క మింగ్, చింగ్ రాజవంశీయుల 'నిషిద్ధ నగరం' వున్నాయి.
నిషిద్ధ నగరం
ఈ 'నిషిద్ధ నగరం' చైనా చక్రవర్తులకు క్రీ.శ. 1420 నుంచి క్రీ.శ. 1912 వరకు, దాదాపు 500 సంవత్సరాలపాటు, రాజప్రాసాదంగా పనిచేసింది. ఈ రాజప్రాసాదం అనేక భవనాల సముదాయం. ఇందులో మొత్తం 9999 గదులు ఉన్నాయంటారు. దీని బయటి ప్రాకార గోడ ఎత్తు 25 అడుగులు, నేలమీద వెడల్పు 30 అడుగులు పైన 20 అడుగులు వుంటుంది. లోపలి నగరాన్ని నివాసానికి, అధికారిక కార్యక్రమాలకు వినియోగించేవారు. మొత్తం 'నిషిద్ధ నగరం' సందర్శనకు కొన్ని రోజులు పట్టవచ్చు.
చైనా వాల్
నవంబర్ 20 మా పర్యటనలో చివరి రోజు. 'చైనా గోడ' సందర్శనకు బయలుదేరాం. ఆ ప్రదేశాన్ని జుయాంగ్ పాస్ అంటారు. ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటి. భవిష్యత్ తరాల కోసం దీనిని భద్రంగా ఉంచుతున్నారు. మేమందరం ఆ ప్రఖ్యాత కట్టడాన్ని చూసి చాలా ఉప్పొంగిపోయాం. మాలో కొంతమంది ఉత్సాహవంతులు ఆ గోడపై 1800 మెట్లను ఎక్కి వచ్చారు. ఇది చాలా శారీరక శ్రమతో కూడుకున్నది. దీనిని చూడటం చైనా సందర్శనలో అత్యున్నతం అని చెప్పవచ్చు.
చైనా సంస్కృతికి ప్రతిబింబం
తర్వాత మళ్ళీ బీజింగ్ వచ్చి పచ్చ రాళ్ళ పరిశ్రమకు వెళ్ళాం. ఆ భవనంలో వివిధ రకాల పచ్చ రాళ్లతో చేసిన కళాకృతుల ప్రదర్శన పర్యాటకులను ఆకట్టుకునేలా వుంది. అవన్నీ చైనీయుల ఆలోచనా విధానాలను, కళానైపుణ్యాన్ని, సంస్కృతిని ప్రతిబింబించేలా వున్నాయి. అక్కడ కొన్ని వస్తువులను కొన్నాం. అందులోనే పై అంతస్తులో భోజనం ఏర్పాటు చేశారు. చైనీయుల వంటలను మొదటిసారి రుచి చూశాం. చక్కటి భోజనం చేశామన్న తృప్తి కలిగింది. చైనాలో మా చివరి ప్రయాణం ఓ వ్యాపార సముదాయానికి వెళ్ళడం. ఆ బహుళ అంతస్తుల భవనంలో కింది మూడు అంతస్తుల్లో వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఇక్కడ కూడా గట్టిగా బేరమాడాల్సిందే. ఇదే చివరి అవకాశం, కాబట్టి, అందరం ఏవో కొన్ని వస్తువులను కొన్నాం. సంతృప్తితో హోటల్ చేరుకున్నాం. ఇలా మా చైన్యా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నాం.
- అలుగుపల్లి అంజి రెడ్డి
9848722129
Authorization