నవతెలంగాణ-ఇల్లంతకుంట రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనసాగుతున్న సమగ్రసర్వే ఇల్లంతకుంట మండలంలోని గ్రామాల్లో త్వరలోనే పూర్తిచేస్తామని ఇల్లంతకుంట తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. నవతెలంగాణతో ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 21రెవెన్యూ గ్రామాలుండగా మొదటి విడత 5గ్రామాల్లో సమగ్రసర్వే పూర్తయ్యిందని ఆయన పేర్కొన్నారు. అవి జవారీపేట, దాచారం, సిరికొండ, రామోజీపేట, ఒబులాపూర్ గ్రామాల్లో సమగ్రసర్వే పూర్తయ్యిందన్నారు. కాగా రెండవ దఫాగా రేపాక, ముస్కానిపేట, వంతడుపుల గాలిపెల్లి, తిప్పాపూర్ గ్రామాల్లో సమగ్రసర్వే కొనసాగనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమగ్రసర్వే కోసం మండలంలో మొత్తం ఆరుగురు వీఆర్వోలు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. కాగా వీఆర్వో సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల సమగ్రసర్వేకు ఇబ్బందిగా ఉందని, అయినప్పటికీ సమస్యను అధిగమించి త్వరలోనే పూర్తిచేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఈ సమగ్రసర్వేకు మూడునెలల సమయాన్ని కేటాయించిందని ఆ లోపే ఈ సర్వేను పూర్తిచేస్తామన్నారు.