- శాంతియుతంగా నిర్వహించుకోవాలి
- కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్
నవతెలంగాణ, మంకమ్మతోట : సెప్టెంబర ్3న నిర్వహించే గణేష్ విగ్రహ నిజమజ్జన వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ సర్దార్ రవీందర్సింగ్, పోలీసు కమిషనర్, ఇతర అధికారులతో కలిసి వినాయక నిమజ్జన వేడుకలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లా కేంద్ర శివారులోని నాలుగు నిమజ్జన స్థలాలను గుర్తించామని చెప్పారు. అందులో మానకొండూర్, కొత్తపల్లి చెరువులు, చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్, ఈనాడు ఆఫీసు వద్దగల ఎస్సారెస్సీ కెనాల్ ప్రాం తాలు ఉన్నాయని అన్నారు. వేడుకలు శాంతి యుతంగా నిర్వహించేందుకు ప్రతి నిమజ్జన స్థలంలో ఒక జిల్లా స్థాయి వారిని నోడల్ అధికారిగా నియమిస్తున్నట్టు తెలిపారు. మానకొండూర్ చెరువు వద్ద డిఆర్డిఓ వెంకటేశ్వర్రావును, కొత్తపెల్లి చెరువు వద్ద వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు జయశంకర్, చింతకుంట ఎస్సారెస్పీ వద్ద జిల్లా పంచాయతీ అధికారి బి.నారాయణ, ఈనాడు ఆఫీసు వద్ద ఎస్సారెస్పీ కెనాల్ వద్ద జిల్లా వ్యవసాయాధికారి వి.శ్రీధర్ను నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. వీరు వినాయక నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తారని చెప్పారు. మానకొండూర్ చెరువును నీటితో నింపుటకు మంగళవారం సాయంత్రం నుండి ఎల్యండి నుండి నీటిని విడుదల చేయవల్సిందిగా ఎస్సారెస్పీ ఎస్ఈని కలెక్టర్ ఆదేశించారు. కొత్తపెల్లి చెరువు నింపేందుకు, చింతకుంట వద్ద నీరు ఉండేందుకు వీలుగా ఎస్సారెస్పీ నుండి నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రితో సంప్రదిస్తామన్నారు. బుధవారం నుండి నీటి విడుదల అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిమజ్జన స్థలాల్లో ఒక్కొక్క చోట నాలుగు భారీ క్రేన్లను, మొత్తం 16 కేన్లను ఏర్పాటు చేయాలని ఏడి మైన్స్ను ఆదేశించారు. వినాయకులను నిమజ్జనం చేయుటకు వీలుగా క్రేన్లను అనుకూలంగా సిద్ధం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్కు సూచించారు. అలాగే నిమజ్జన స్థలాల్లో ఊరేగింపురోడ్ల వెంబడి తాగునీటి వసతి సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. నగరం నుండి నిమజ్జన స్థలాల వరకు రోడ్ల వెంబడి లైటింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిమజ్జన స్థలాల్లో జనరేటర్లను ఏర్పాటు చేసి లైటింగ్ అమర్చాలని అన్నారు. నిమజ్జన పాయింట్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయూలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఎస్ఈ ట్రాన్స్కోకు సూచించారు. నిమజ్జన స్థలాల్లో భారీకేడ్లు ఏర్పాటు చేయాలని రోడ్లు, భవనాల శాఖ ఈఈని ఆదేశించారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి రెండు రోజుల ముందు నుండి మద్యందుకాణాలు మూసివేయాలని, నగరంలో మద్యం ఒకేసారి బల్క్ అమ్మకాలు జరపకుండా చూడాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ను ఆదేశించారు. గతేడాది ఈ వారంలో ఎంత అమ్మకాలు జరిగాయో ఈ వారంలోనూ అంతే అమ్మకాలు కావాలని సూచించారు. నిమజ్జనం రోజు మానకొండూర్ చెరువు వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో నిమజ్జనాన్ని విజయవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా ఏవైనా ప్రజలకు ఇబ్బందులు కలిగితే కలెక్టరేటులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు ఫొన్ చేసి తెలుపాలని చెప్పారు. నిమజ్జనం రోజు నాలుగు, ఐదు అంబులెన్స్లను సిద్ధంగా ఉంచాలని డిఎంఅండ్హెచ్ఓను ఆదేశించారు.
కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండా, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అందరి సహకారంతో గణేష్ నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు. గతంలో కన్న ఈ ఏడాది ఎక్కువ వినాయకులను ప్రతిష్టించారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. మత సామరస్యాలకు కరీంనగర్ పెట్టింది పేరని, ఎలాంటి ఘటనలూ చోటుచేసుకోకుండా స్నేహపూర్వకంగా రెండు పండగలను నిర్వహించుకోవాలని అన్నారు.
నగర మేయర్ సర్ధార్ రవిందర్ సింగ్ మాట్లాడుతూ అన్ని పండుగలూ సమూనమేనని అన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా నగరంలోని ప్రతి గల్లీలో రోడ్డు ప్యాచ్వర్క్ లు చేస్తున్నామని, అవి మంగళవారం వరకు పూర్తవుతాయని అన్నారు. వినాయక చవితి, బక్రీదు రెండూ ఒకేసారి వస్తున్నందున ప్రజలు శాంతియుతంగా సమన్వయం పాటించాలని కోరారు.
పోలీస్ కమిషనర్ కమలాసన్రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం గణేష్ నిమజ్జనం, బక్రీదు పండుగ ఒకేసారి వస్తున్నందున పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు పండుగలను శాంతియుతంగా, సంతోషంగా జరుపుకోవాలని కోరారు. మొత్తం కరీంనగర్లో ఈ ఏడాది 450 గణేష్ విగ్రాహాలను ఏర్పాటు చేశారని, అన్ని విగ్రహాలను జియో ట్యాగింగ్ చేశామని సీపీ తెలిపారు. అన్ని వినాయక మండపాలనూ ప్రతి గంటకోమారు పోలీసులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. గణేష్ నిమజ్జనాన్ని పర్యవేక్షించేందుకు 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎలాంటి ఘటనలూ చోటుచేసుకోకుండా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఊరేగింపులో డిజే సౌండ్లను నిషేధించామని చెప్పారు. ఊరేగింపు మార్గంలో డస్ట్బిన్లు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను ప్రజలు నమ్మకూడాదని, వాటిని ఇతరులకు పంపకూడదని అన్నారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ శశాంక్, డిప్యూటీ మేయర్ గుగ్గళ్ల రమేష్, ఆర్డీఓలు రాజగౌడ్, చెన్నయ్య, డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ రాజేశం, విశ్వ హిందు పరిషత్ నవనీత రావు, రాజేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్, డిఆర్డిఓ వెంకటేశ్వర్ రావు పాల్గొన్నారు.
Authorization