నవతెలంగాణ-వీణవంక వర్షాలు సమృద్ధిగా కురవాలని మండలంలోని హిమత్నగర్లో గ్రామస్తులు, యువత గురువారం కప్పతల్లి ఆట ఆడారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా నిత్యం అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న క్రమం లో వర్షాలు పడాలని కోరుతూ.. గ్రామంలోని పురవీధుల గుండా కర్రకు కప్పను కట్టి ఇంటింటా తిరుగుతూ నీళ్లు పోస్తూ డప్పు చెప్పుల మధ్య ఉరేగింపు చేశారు. అనంతరం స్థానిక హనుమాన్ ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహానికి జలాభిషేకం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు పడినట్లయితే చెరువులు, కుంటలు నిండి బావులలో నీరు చేరుతుందన్నారు. పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు. వరుణుడు కరుణించి సకాలంలో వర్షాలు కురుపించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అంగడి రాదమ్మ, ఉపసర్పంచ్ గిల్లు రమేష్, ఎంపీటీసీ నల్ల మమత, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నల్ల రవీందర్రెడ్డి, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.