- 20న పండుగ వాతావరణంలో పింఛన్ల రెట్టింపు కార్యక్రమాన్ని నిర్వహించాలి
- రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్
నవతెలంగాణ-సిరిసిల్ల
జలశక్తి అభియాన్ కింద జలసంరక్షణ కార్యక్రమాలను ఉద్యమ స్ఫూర్తితో చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మీటింగ్ హాల్ గ్రామీణ అభివృద్ధి అధికారులు, ఎంపీడీవోలతో జలశక్తి అభియాన్, పెన్షన్ పెంపు, మరుగు దొడ్ల నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కోనరావుపేట, ముస్తాబాద్, తంగళ్ళపల్లి మండలాల్లో జలసంరక్షణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామాల్లో కేంద్ర బృందం ఈ నెల 24 నుంచి 27 వరకు పర్యటించి క్షేత్రస్థాయిలో జల సంరక్షణకు చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించనున్నట్టు కలెక్టర్ అధికారులకు తెలిపారు. జలసంరక్షణ కార్యక్రమాలను సవివరంగా అధికారులకు వివరించేలా సన్నద్ధం కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ల రెట్టింపు జూన్ నెల నుంచి అమలు చేస్తున్నందున జిల్లాలో ఈ పెంపు ద్వారా 1,14,785 మందికి ఆర్థిక ప్రయోజనం కలుగనుందన్నారు. పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ఈ నెల 20న పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు.
ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ వారి చేతుల మీదుగా లబ్దిదారులకు పెన్షన్ పెంపుతో కూడిన ఉత్తర్వు కాపీలను అందించాలన్నారు. ఆ మరుసటి రోజు డీబీటీ విధానంలో నేరుగా ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాలకు జమ చేస్తుందన్నారు. ఆ విషయాన్ని లబ్దిదారులకు తెలుపాలన్నారు. అనంతరం జిల్లాలో మిగిలిపోయిన మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పకడ్బందీ కార్యాచరణతో పచ్చదనం పెంపునకు కృషి చేయాలన్నారు. ఐఈసీ, కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లాను ముందజలో నిలపాలన్నారు. ప్రతి మండలానికో కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీవో బి.రవీందర్, డీపీవో రవీందర్, ఎఫ్ఆర్వో వేణుగోపాల్, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.
Authorization