నవతెలంగాణ-కరీంనగర్ ప్రతినిధి/కరీంనగర్ టౌన్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ కరీంనగర్ డివిజన్ కార్యాలయంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) కరీరనగర్ డివిజన్ 24వ మహాసభ డివిజన్ యూనియన్ అధ్యక్షుడు వి.రాజేందర్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ మహాసభకు నవతెలంగాణ ఎడిటర్ ఎస్. వీరయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కోల్ఇండియాలో ప్రయివేట్ పెట్టుబడులు ఆహ్వానించాల్సిన అవసరమేంటని అన్నారు. కోల్ ఇండియా ప్రపంచంలోనే పది స్థానాల్లో ఒకటిగా ఉందని తెలిపారు. అలాంటి సంస్థను విదేశీ పెట్టుబడి దారులకు కట్టబెట్టాల్సిన అవసరమేమిటో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో పెట్టుబడుల కోసం ప్రధాన మోదీ ఎన్ని దేశాలు తిరిగినా ఫలితాలు మాత్రం రావడం లేదని అన్నారు. కేవలం దేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా మాత్రమే మాంద్యాన్ని అధిగమించవచ్చని సూచించారు. తమకు ఓట్లు వేసిన ప్రజల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోకుండా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడాన్ని విమర్శించారు. ఈ క్రమంలో వారు దేశభక్తులా..? లేక విదేశీ భక్తులా..? చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగాలు ఇవ్వకుండా వేతనాలు పెంచకుండా మాంద్యం నుంచి గట్టెక్కడం సాధ్యం కాదని తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో జీడీపీ రేట్ 8 నుంచి 5 శాతానికి పడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. మరింత పడిపోయే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించిందని అన్నారు. దేశంలో నెలకొన్న మాంద్యాన్ని ప్రజలు ప్రశ్నించే లోపే వారి ఆలోచనలు 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్ వైపు తిప్పారని తెలిపారు. 35ఏ రద్దుతో ఇక్కడి ప్రజలు అక్కడికి వెళ్లి స్థలాలు కొనుగోలు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా కేంద్రం లాభపడే నిర్ణయాలను తీసుకుంటుందని అన్నారు. ఇందులో భాగంగానే ఒకే భాష, ఒకే దేశం, ఒకే సంస్కృతి నినాదాన్ని తీసుకొచ్చారని, అదే రీతిలో ఒకే పార్టీ అంటూ వచ్చే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. అనంతరం ఎస్సీజెడ్ఐఈఎఫ్ అధ్యక్షుడు వేణుగోపాల రావు మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభంగా నిలవడంతోపాటుగా కోట్లాది ప్రజల సంక్షేమంలో కీలక భూమిక పోషిస్తున్న ఎల్ఐసీలో పనిచేస్తున్నందుకు ఉద్యోగులం గర్వించాలని అన్నారు. ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా పేరొంది దేశ ఆర్థికాభివద్ధికి దోహదం చేస్తున్న ఎల్ఐసీని కార్పొరేట్ చేసే కుట్రలకు మోడీ ప్రభుత్వం పాల్పడుతుందని అన్నారు. హిందుత్వం, దేశభక్తి ముసుగులో యావత్ దేశాన్ని విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేందుకు చర్యలు చేపడుతున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం గత ఆరేండ్ల నుంచి అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశంలో ఆర్థిక అసమానతలు తలెత్తాయని అన్నారు. ఈ సభలో ఎస్సీజెడ్ఐఈఎఫ్ ప్రధాన కార్యదర్శి క్లెమెంట్దాస్, ఉపాధ్యక్షుడు మెహబూబ్, యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ మాట్లాడారు. ఎల్ఐసీ సీనియర్ డివిజన్ మేనేజర్ రామశాస్త్రి, ఎల్ఐసీ పీఅండ్ఐఆర్ మేనేజర్ చంద్రశేఖర్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు జి. సత్తయ్య, రంగారావు, స్వామి, ఎన్.లక్ష్మీకాంతం, ఎఐఐఇఎ నాయకులు వి. రమణ, వామన్ రావు, రవీంద్రనాథ్, మల్లేశం, శ్రీనివాస్ గౌడ్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎల్ఐసీ బ్రాంచి యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు
Authorization