- వెలవెలబోతున్న చెరువులు..
- ఎత్తిపోతల పథకం కోసం ఎదురుచూపులు
- గోదావరి జలాలతో నింపాలని డిమాండ్
కథలాపూర్ మండలంలో మొత్తం 19 గ్రామలున్నాయి. తక్కళ్లపెల్లి, బొమ్మెన, దూలూర్, కథలాపూర్, పెగ్గర్ల, భూషన్రావుపేట, ఊట్పల్లి, గ్రామాల మీదుగా ఎస్సారెస్పీ వరద కాలువ ప్రవహిస్తోంది. ఎస్సారెస్పీ వరద కాలువ నిండితే ఆయా గ్రామాలకు సాగు నీరు అందుతుంది. ప్రస్తుతం వర్షాలు ఆశాజనకంగా కురవడంతో పాటు ఎస్సారెస్పీ నిండుతుండడంతో ఎలాగైనా సాగు నీరందించే అవకాశాలున్నాయి. ఎస్సారెస్పీ వరద కాలువ సైతం మండలంలోని పలు గ్రామాల నుంచి వెళ్తోంది. దీంతో కాలువ కింది గ్రామాల్లో నీరు పుష్కలంగా ఉంది. మండలంలోని దుంపేట గ్రామంలోని ఊర చెరువు, కుమ్మరికుంట, పిల్లివానికుంట, ఊట్పల్లి గ్రామంలోని పెద్ద చెరువు, దేవుని చెరువు, కుమ్మరికుంట, దూలూరు గ్రామంలోని నాగమల్లప్ప, కల్లిపెల్లి చెరువులను చింతకుంటలోని లక్కల చెరువు, బండ చెరువు, పోచమ్మకుంట చెరువు, వెంకటాద్రి, మోటుకుంట, చిన్న కుంట చెరువులను నింపాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని తక్కళ్లపెల్లి, పెగ్గర్ల, కథలాపూర్ గ్రామాల్లోని చెరువులను మోటార్ల ద్వారా, తూము ద్వారా వరద కాలువ నుంచి నింపుకుంటున్నారు.
ఎడారిలా చెరువులు
ఎస్సారెస్పీ వరద కాలువకు పై భాగంలో దుంపేట, బొమ్మెన, ఊట్పల్లి, చింతకుంట గ్రామాల్లోని చెరువులు ఎడారిలా తలపిస్తున్నాయి. ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా వచ్చే నీటిని లిఫ్టుల ద్వారా కాలువలకు పై ప్రాంతాల్లోని చెరువులను నింపుతామన్న ప్రభుత్వ ప్రకటన ఇంతవరకు అమలు కావడం లేదు. పక్క నుంచి గోదావరి జలాలు వెళ్తున్న గ్రామాలు మాత్రం నీరు లేక అల్లలాడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ గ్రామాలపై దృష్టి సారించి వరద కాలువకు మోటార్లు పెట్టి పైపుల ద్వారా చెరువులను నింపాలని కోరుతున్నారు.
ఎత్తిపోతల పథకం అమలయ్యేది ఎప్పుడో..?
ఎస్సారెస్పీ వరద కాలువ నుంచి పై గ్రామాల్లోని చెరువులను, కుంటలను ఎత్తిపోతల ద్వారా నింపేందుకు స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్బాబు ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కథలాపూర్, మేడిపెల్లి మండలాల్లో 20 గ్రామాల్లోని చెరువులు నింపుటకు 14 పంపులు అవసరమని నివేదిక తయారు చేశారు. ఆ ఫైల్ ఇప్పటి వరకు మోక్షం లభించడం లేదు.
వేసవి కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి
వరద కాలువ పైన ఉన్న గ్రామాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో చెరువులలో నీరు నింపనట్లయితే వేసవి కాలంలో తాగడానికి, సాగు నీరుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రభుత్వానికి ఎన్ని సార్లు నివేదికలు పంపించినా పట్టించుకోవడం లేదు. స్పందించనట్లయితే రానున్న కాలంలో ధర్నాలు, రాస్తారోకోలు తప్పవు.
-అల్లూరి దేవారెడ్డి, రైతు
చుక్క నీరు చేరడం లేదు
దుంపేట గ్రామానికి మూడు చెరువులుంటాయి. పక్కనే వరద కాలువ వెళ్తున్న మా గ్రామానికి చుక్క నీరు చేరడం లేదు. దీంతో రాబోయే వేసవిలో మళ్లీ నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. మా ఊరికి ముఖ్యమైన చెరువులను నింపి వరద కాలువ నుంచి లిఫ్టు ద్వారా నీటిని నింపితే కొంత వరకు కొరతను అధిగమించవచ్చు.
-ద్యావతి పురుషోత్తం, దుంపేట
20వేల ఎకరాల సాగు అందుతుంది
లిప్ట్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా వరద కాలువ పైన ఉన్న గ్రామాలకు నీరందించినట్లయితే 20వేల ఎకరాల వరకు సాగు జరుగుతుంది. తాగడానికి, సాగుకు ఇబ్బంది ఉండదు. వరద కాలువకు మోటార్లు పెట్టి పైపులైన్ ద్వారా నింపితే అన్ని గ్రామాలకు ఉపయోగంగా ఉంటుంది. మండలంలోని 6 గ్రామాల్లోని 25 చెరువులు నిండే అవకాశాలున్నాయి. అన్ని చెరువులు వరద కాలువ నుంచి 5కి.మీ. లోపే ఉంటాయి.
-కాయితి నాగరాజు, దుంపేట
Authorization