పత్తి పంట ప్రస్తుతం మంచి పూత, కాత దశలో ఉంది. ఈ సమయంలో పంటకు ప్రధానంగా పోషకాల ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. భూమిలో పంటకు వేసే ఎరువులతోపాటు పైపాటుగా పైరు ఎదుగుదలను అనుసరించి అవసరాన్నిబట్టి 10 నుంచి 15 రోజులకోసారి పోషకాలు అందించాలి.
- లీటరు నీటికి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ (మల్టీ-కే) లేదా 10 గ్రాముల 19:19:19 (పాలీఫీడ్) లేదా 20 గ్రాముల యూరియాను కలిపి వాడొచ్చు. లేదా పిచికారీ చేయొచ్చు. పోషకాలను మారుస్తూ అవసరాన్నిబట్టి పిచికారీ చేయాలి. వీటిని పురుగు మందులతో కలిపి కూడా పిచికారీ చేయొచ్చు. దీంతో పైరు ఎదుగుదల, కాపు బాగుంటుంది.
- పైరు 100 రోజుల వరకు ఎకరానికి యూరియా 25 కిలోలు, పొటాష్ ఎరువు 10 కిలోల చొప్పున 20 రోజుల వ్యవధిలో నాలుగైదు సార్లు భూమిలో మొక్కలకు దగ్గరగా వేయాలి.
- ఈ దశలో పైరులో పూత, పిందె రాలడం, ఆకులు ఎరుపు, పండాకుగా మారడం లాంటివి సంభవిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్న పంటకు లీటరు నీటికి బోరాన్, బోరాక్స్లను కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున యూరియాను కలిపి పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది.
- పూత, పిందె మరీ ఎక్కువగా రాలుతున్నట్టయితే (ఎన్ఏఏ 10 పీపీిఎం) ప్లానోఫిక్ మందును 5 లీటర్ల నీటికి ఒక1 మి.లీటర్ల చొప్పున కలిపి ఆ ద్రావణానికి లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున యూరియా, డీఏపీ లేదా 10 గ్రాముల మల్టీకేను కలిపి 10 రోజుల వ్యవధిలో ఒకట్రెండుసార్లు పిచికారీ చేయాలి.
- ఆగస్టులో మొదటి 10నుంచి 15రోజుల బెట్ట వాతావరణం తర్వాత చివరి 10నుంచి 12 రోజుల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అధిక వర్షాలకు పత్తి చేన్లలో చాలా చోట్ల మొక్కలు తెప్పలు తెప్పలుగా ఎండిపోయాయి. ఇది బీటి పత్తిలో అకస్మాత్తుగా వాతావరణ పరిస్థితులు మారినప్పుడు వచ్చే 'ప్యారావిల్ట్ '. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్, 0.1 గ్రా.(స్టెప్టోపైక్లిన్) మందును కలిపి మొక్కల చుట్టూ భూమిని తడపాలి. వారం రోజుల తర్వాత కార్బండజిమ్ మందును లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కలిపి మళ్లీ మొక్కల చుట్టూ భూమిని తడపాలి. మొక్కలు నెమ్మదిగా కొంత వరకు తిరిగి కోలుకుంటాయి.
- అధిక వర్షపాతం ఉన్నప్పుడు చేనులో ఎక్కువ నీరు నిల్లకుండా కాల్వల ద్వారా బయటికిపోయే విధంగా చూసుకోవాలి. పైరుపై లీటరు నీటికి 2.5గ్రాముల సాఫ్, కంపానియన్ (కార్బండజిమ్, మ్యాంకోజెబ్ కలిపిన మందు) కలిపి ఒకేసారి పిచికారీ చేయాలి. వారం పది రోజుల తర్వాత లీటరు నీటిలో ఒక గ్రాము కార్బండజిమ్ కలిపి పిచికారీ చేయాలి. ఆకులపై వచ్చే మచ్చ, కాయకుళ్లకుండా, నల్లబడకుండా ఉంటాయి.
- ప్రస్తుతం పత్తి పంటలో తామరపురుగు, పేనుబంక, పచ్చదోమ వంటివి ఆశిస్తున్నాయి. వీటి నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల ఫిప్రోనిల్, 0.2 గ్రాము థయామిథాక్సామ్, 0.3 గ్రాము ప్లోనికామిడ్, 2 మి.లీటర్ల మోనోక్రోటోఫాస్, 1.25గ్రాముల డైఫెన్త్యురాన్ లాంటి మందులను పిచికారీ చేయాలి. ఒకేసారి 2 లేదా 3 మందులు కలిపి పిచికారీ చేయొద్దు. అంతేకాకుండా మందులు మారుస్తూ పిచికారీ చేయాలి.
- రసం పీల్చే పురుగులే కాకుండా, గులాబీ రంగు కాయతొలిచే పురుగు, పొగాకు లద్దె పురుగు ఆశించకుండా గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా గులాబీ రంగు పురుగు నివారణకు చేనులో వాటి లింగాకర్షక బుట్టలను ఎకరానికి 4 లేదా 8 చొప్పున అమర్చి, పురుగు ఉధృతిని గమనిస్తూ నివారణ చర్యలు చేపట్టాలి. లీటరు నీటిలో 1.5 గ్రాముల థయోడికార్బ్ లేదా 2 మి.లీటర్ల ప్రొఫోనోఫాస్ లేదా 2.5 మి.లీటర్ల క్లోరిపైరిఫాస్ కలిపి అవసరాన్నిబట్టి పిచికారీ చేయాలి. దీంతో మొదటి దశలో ఉన్న పురుగులను నిర్మూ లించొచ్చు.
- ఎ. సుదర్శనం,
పత్తి ప్రధాన శాస్త్రవేత్త,
ప్రాంతీయ వ్యవసాయ
పరిశోధనా స్థానం-వరంగల్
Authorization