మల్లెలో మొగ్గ తొలిచే పురుగు నివారణ ఎలా?
- ప్రసాదరావు, మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా)
పురుగు లార్వా పువ్వు మొగ్గ లోపలికి చొచ్చుకొని పోతుంది. పూల భాగాలను తినేస్తూ తీవ్ర దశలో మొగ్గలన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి ముడుచుకు పోయేటట్టు చేస్తుంది. దీని నివారణకు లీటరు నీటిలో 2 మి.లీటర్ల మలాథియాన్ లేక క్వినాల్ఫాన్ కలిపి చెట్లపై పిచికారీ చేయాలి.
చినీ నిమ్మలో శంఖుతెగులును ఎలా నివారించాలి?
- శ్రీనివాస్, తిప్పర్తి (నల్లగొండ జిల్లా)
ఈ తెగులు కారణంగా ఆకులు పసుపు రంగుకు మారి వాటిపైన చిన్న ఆకుపచ్చని గుండ్రటి మచ్చలు ఏర్పడతాయి. దీన్ని నివారించాలంటే శంఖు తెగులు సోకిన చెట్టు కొమ్మలను అంటు కట్టొద్దు. లీటరు నీటిలో 1.6 మి.లీటర్ల మోనోక్రోటోఫాస్ మందును కలిపి పిచికారీ చేసి తెగులు వ్యాప్తి చేసే సిల్లిడ్స్ అనే పురుగులను నివారించాలి.
వేరుశనగలో విత్తనశుద్ధి ఎలా?
- శంకర్, చిగురుమామిడి (కరీంనగర్ జిల్లా)
కిలో విత్తనానికి ఒక గ్రాము టెబుకొనజోల్ లేదా మ్యాంకోజెబ్ పొడి, 2 మి.లీటర్ల ఇమిడాక్లోప్రిడ్, 200 గ్రాముల రైజోబియం పట్టించాలి.
బత్తాయిలో కాయలపై తెల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి. ఏం చేయాలి?
- రాజు, దేవరకొండ (నల్లగొండ జిల్లా)
ఆకుమచ్చ నల్లి ఆకులు, కాయల రసాన్ని పీల్చడం వల్ల చిన్నచిన్న తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా 2.7 మి.లీటర్ల డైకోఫాల్ లేదా ఒక మి.లీటరు ఒమైట్ కలిపి పిచికారీ చేయాలి.
Authorization