పూలల్లో మల్లెకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని ఇష్టపడి మహిళలు ఉండరు. అందుకే దీనికి మార్కెట్ మంచి డిమాండ్ ఉంది. ఈ పూలను అలంకరణకే కాకుండా సుగంధ ద్రవ్యాల ఉత్పత్తికి వాడతారు. సాధారణంగా మల్లె మొక్కలు నాటిన ఆరు నెలల తర్వాత పూత ప్రారంభమవుతుంది. మొక్క పెరిగే కొద్దీ పూత కూడా దిగుబడులు కూడా పెరుగుతాయి.
మల్లెపూలల్లో ప్రధాన రకాలు మూడు. బొడ్డు మల్లె, దొంతర మల్లె, విడ మల్లె. ఇది బహువార్షిక పంట. తేలికపాటి నేలలు, మరుగు నీరు ఇంకే స్వాభావం ఉన్న నేలలు, ఎర్ర గరప నేలలు అనుకూలం. నల్ల బంక నేలల్లో శాఖీయ పెరుగుదల బాగానే ఉంటుంది. కానీ పూల దిగుబడి అంతగా రాదు. చౌడు నేలలు, నీరు ఎక్కువగా నిల్వ ఉండే నేలలు పనికి రావు. మల్లె సాగును జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎప్పుడైనా చేపట్టొచ్చు. నాటేటప్పుడు చల్లని వాతావరణం ఉండేలా చూసుకోవాలి. సాయంత్రం పూట నాటడం వల్ల మొక్కలు బాగా అతుక్కుని నిలదొక్కుకుంటాయి. నాటేటప్పుడు వరుసల మధ్య, మొక్కల మధ్య 1.25-2.00 మీటర్ల దూరం ఉండాలి. ా అంటు మొక్కలను నాటుకుంటే అధిక దిగుబడులు పొందొచ్చు.
ఎరువుల యాజమాన్యం
ప్రతి మొక్కకీ 10 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, 70-120 గ్రాముల నత్రజని, 100-120 గ్రాముల భాస్వరం నిచ్చే ఎరువులను మొదటి దఫాగా కొమ్మ కత్తిరింపులు చేపట్టిన వెంటనే వేయాలి.
నీటి యాజమాన్యం
నేల స్వభావం, అక్కడి వాతావరణ పరిస్థితులనుబట్టి 7-10 రోజులకు ఒక తడిని ఇచ్చినట్లయితే సకాలంలో మళ్లీ అవసరమైతే ఇంకొక తడినివ్వాలి.
సస్యరక్షణ
మొగ్గ తొలిచే పురుగు : ఈ పురుగు మల్లెకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. మొగ్గలోకి రంధ్రం చేసి పూభా గాలను పూర్తిగా తినేస్తుంది. ఈ పురుగు లార్వా పువ్వు మొగ్గలోకి చొచ్చుకునిపోయి, పూలు, ఆకులను గూడుగా కట్టి తినేస్తాయి. అంతేకాక కొమ్మలను కూడా గూడుగా చేసి హాని కలిగిస్తాయి. నష్టం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు మొగ్గలన్నిం టినీ ఒక దగ్గరికి చేర్చి ముడుచుకు పోయేట్టు చేస్తుంది. మొగ్గలపై రంధ్రాలు కన్పిస్తాయి. ఆశించిన పూ మొగ్గలు రాలిపోతాయి. దీని నివారణకు లీటరు నీటిలో 1.5 మి. లీటర్ల మలాథియాన్ లేదా 2 మి.లీటర్ల డైమిధోయేట్ కలిపి మొక్క బాగా తడిచేలా పిచికారీ చేయాలి.
నల్లి : ఈ పురుగు పొడి వాతావరణంలో ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చి ఆకులను పసుపు రంగులోకి మారుస్తుంది. దీని నివారణకు గంధకపు పొడిని ఎకరాకు 8-10 కిలోల చొప్పున చల్లాలి.
ఆకుమచ్చ తెగులు : ఈ వ్యాధి సోకిన మొక్కలపై గోధుమ ఎరుపు రంగులో గుండ్రని మచ్చలు ఏర్పడుతాయి. అంతేకాకుండా ఆకులు చివరి భాగం పైకి ముడుచుకుని గిడసబారుతాయి. ఆకులతో పాటు కొమ్మలపై కూడా ఈ వ్యాధి సోకుతుంది. ఈ తెగులు నివారణకు లీటరు నీటిలో 2 గ్రాముల బెన్లెట్ లేదా ఒక గ్రాము దైథేన్ ఎం-45 లేదా ఒక గ్రాము బావిస్టిన్ కలిపి పిచికారీ చేయాలి.
ఆకు ఎండు తెగులు: ఈ తెగులు వల్ల మొదట ఆకులు పసుపు రంగుకు మారి, కొమ్మలు ఎండి చనిపోతాయి. మొక్క పీకి చూస్తే వేర్లు నలుపు రంగుకు మారిపోతాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా ఒక గ్రాము బావిస్టిన్ కలిపి మొక్క మొదట్లో పోయాలి. మొక్క మొదలులో వేరు పూర్తిగా తడిచేలా మందు ద్రావణం పోయాలి.
ఫిల్లోడి : ఈ తెగులు సోకితే తెలుపు పూలకు బదులు ఆకుపచ్చ రంగులో పూలు వస్తాయి. దీని వల్ల పూల దిగుబడి, నాణ్యత పూర్తిగా తగ్గిపోతుంది. దీని నివారణకు నాలుగు లీటర్ల నీటిలో ఒక గ్రాము టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలి.
దిగుబడి
మొక్కలు నాటిన ఆరు నెలల తర్వాత పూత ప్రారంభమయ్యే మొక్క పెరిగే కొద్దీ దిగుబడి అధికమవుతుంది. ఎకరానికి సుమారు 3-4 టన్నుల దిగుబడి వస్తుంది. పూల దిగుబడిని పెంచేందుకు లీటరు నీటికి 2.5 గ్రాముల జింక్ సల్ఫేట్, 5 గ్రాముల మెగ్నిషియం సల్ఫేట్ లాంటి సూక్ష్మధాతువులను కలిపి రెండు లేదా మూడు దఫాలుగా పిచికారీ చేస్తే అధిక దిగుబడులు పొందొచ్చు.
Authorization