యాపిల్ బేర్.. థారులాండ్లో పుట్టింది. అక్కడి నుంచి మహారాష్ట్రకు చేరుకుని మన రాష్ట్రంలో ప్రవేశించింది. తక్కువ నీటి వనరులతో ఎక్కువ దిగుబడినిచ్చే పంట ఇది. వర్షాభావ పరిస్థితులను తట్టుకుంటుంది. భూగర్భ జలాలు అడుగంటిపోయినా పంటకు ఢోకా ఉండదు. ఇందులో పోషకాలు పుష్కలం. యాపిల్ కన్నా ఎక్కువ. దీన్ని 'తెలంగాణ యాపిల్' అని కూడా అంటారు. దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మన రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అనువైన పంట ఇది. ఒక్కసారి పంట వేస్తే వందేండ్ల వరకు ఉంటుంది. కొమ్మలు కత్తిరించే కొద్దీ ఈ చెట్టు ఎదుగుతుంది.
యాపిల్ బేర్ పంటకు ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. స్వల్ప ఖర్చుతో అధిక దిగుబడినిచ్చే పంట ఇది. అంతే కాదు.. దీనికి ఎక్కువ శ్రమ కూడా అక్కర్లేదు. ఈ పంటకు రోగని రోధక శక్తి ఎక్కువ. పంట కాలం తక్కువే. అంటు నాటిన ఆరు నెలల్లో కాయ కోతకొస్తుంది. సంవత్సరంలో రెండుసార్లు కాస్తుంది. మొదటి సంవత్సరంలో ప్రతి చెట్టుకు 25 నుంచి 30 కిలోల దిగుబడి వస్తుంది. రెండో సంవత్సరం 40 నుండి 45 కిలోలు కాస్తుంది. రేగు చెట్టుకు న్నట్టు ముండ్లు కూడా ఉండవు. పంట యాజమాన్యం చాలా సుల భం. కాయల పరిమాణం పెద్దదిగా ఉంటుంది. ఈ పంటను మెట్ట ప్రాంతంలోనూ సాగు చేయొచ్చు. సహజంగానే పరాగ సంపర్కం చెందుతుంది. ప్రత్యేకంగా ఆడ మొక్కలు, మగ మొక్కలను తోటలో సాగు చేయాల్సిన పని లేదు. స్వతహాగానే రేగు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. చీడపీడల సమస్య ఉండదు. తోటలో తెంపిన కాయలను కూడా ఎక్కువ రోజులు నిల్వ చేయొచ్చు. ఎకరానికి 200 చెట్లు సాగు చేయొచ్చు. మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వందేండ్ల వరకు మంచి దిగుబడులు వస్తాయి. ఎరువులు, ఇతర సాగు విషయాలు రేగు తోటల మాదిరిగానే పాటించొచ్చు.
మొక్కల లభ్యత
ప్రస్తుతం యాపిల్బేర్ మొక్కలను ప్రైవేటు నర్సరీల నుంచే కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాల యాల నుంచి లభ్యత లేదు. రోగాలు లేని మంచి వృద్ది, పెరుగుదల ఉన్న మొక్కలను ఎంపిక చేసుకోవాలి. అంటు మొత్తం భూమిలో ఉండేలా నాటుకోవాలి.
సాగు ఖర్చులు : ఒక్క మొక్క ఖరీదు రూ. 60. ఎకరానికి 200 మొక్కలు అవసరం. మొత్తం రూ.12వేలు మొక్కలకు ఖర్చు అవుతాయి. ఎరువులు, కలుపు నివా రణ మందులు తదితర ఖర్చులకు సుమారు రూ.25వేలు అవుతాయి. ఎకరానికి నాలుగు టన్నుల దిగుబడి వస్తుంది. ప్రసుత్తం యాపిల్బేర్ మార్కెట్ ధర కిలో రూ.40. రాబడి రూ. లక్షా 60వేలు. పెట్టుబడి ఖర్చులు పోనూ ఎకరానికి రూ. లక్ష ఆదాయం వస్తుంది.
సాగు ఇలా...
మొక్కల మధ్య 15ఞ15 అడుగుల దూరం ఉండేట్టు నాటుకోవాలి. వేసవిలో గుంతలు తయారు చేసుకోవాలి. వీటి పరిమాణం 1ఞ1 అడుగులు ఉండేట్టు చూడాలి. రసాయన, సేంద్రియ ఎరువులతో ఈ మొక్కల గుంతలు నింపాలి. మొక్కలు నాటిన మొదటి మూడు నెలల తర్వాత 50గ్రాముల ఫాస్పేట్, 50 గ్రాముల పొటాష్, 150గ్రాముల నత్రజని అందించాలి. మూడు నెలల తర్వాత అదే మోతాదు ఎరువులో మరో దఫా అందించాలి. మరో మూడు నెలల తర్వాత ఎకరానికి రెండు కిలోల సూక్ష్మధాతు పోషకాలు, అందిస్తే కాయల రంగు, నాణ్యత మెరుగుపడుతుంది. డ్రిప్ సౌకర్యం కల్పిస్తే దిగుబడులు ఇంకా బాగా పెరుగుతాయి. 15 రోజులకోసారి కలుపు నివారణ చర్యలు చేపట్టాలి.
చీడపీడలు
ఈ పంటను ప్రధానంగా పండుఈగ, దాసరి పురుగులు ఆశిస్తాయి. వీటి నివారణకు ముందుగా తోటలను పరిశుభ్రంగా ఉంచాలి. ఈగ ఆశిస్తే లీటరు నీటికి ఒక మి.లీటరు మలాథియాన్ లేదా 3 గ్రాముల కార్బరిల్ లేదా 5 శాతం వేప గింజల కషాయాన్ని మొదటి దశగా పిచికారీ చేయాలి. గోలికాయ దశలో రెండో విడత 15 రోజుల తర్వాత కాయ పక్వానికి వచ్చాక మూడో దఫా పిచికారీ చేయాలి. గొంగళిపురుగులు పత్రహరితాన్ని గోకి తింటాయి. వీటి నివారణకు లీటరు నీటిలో 2 మి.లీటర్ల క్వినాల్ఫాస్ కలిపి పిచికారీ చేయాలి. సాగులో ప్రధానమైంది కొమ్మల కత్తిరింపు. వేరు మూలంపై వచ్చే బిగుళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. ఒక మీటరు పెరిగిన తర్వాత నాలుగైదు కొమ్మలు నాలుగు వైపులా పెరిగేటట్లు చూడాలి. మార్చి, ఏప్రిల్ నెలల్లో కత్తిరించాలి. దీనికి ముందు లీటరు నీటిలో 10గ్రాముల పొటాషియం నైట్రేట్ కలిపి పిచికారీ చేస్తే అంట్లు త్వరగా చిగురిస్తాయి. రెండో సంవత్సరం నుంచి రెట్టింపు ఎరువులు వాడాలి. దోర రంగులో ఉన్నప్పుడే కాయలు కోయాలి. 8 నుంచి 10 రోజుల్లో పూర్తిగా పండు రంగులో వస్తాయి. రవాణాకు అనుకూలంగా ఉంటాయి. పూత తర్వాత రెండు నెలల్లో మళ్లీ కాపుకొస్తుంది.
రాయితీ
యాపిల్బేర్ పంట సాగు చేసే రైతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్స హిస్తోంది. ప్రస్తుతం 50 ఎకరాల్లో ఉన్న ఈ సాగు విస్తీర్ణాన్ని వెయ్యి ఎకరాలకు పెంచాలని నిర్ణయించింది. కలత్తా నుంచి 3వేల యాపిల్ బేర్ అంట్లను ఉద్యాన శాఖ అధికారులు తెప్పిస్తున్నారు. ఎకరానికి రూ.20వేల పెట్టుబడి అవుతుందని అంచనా. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తొలుత 35శాతం (రూ.7వేలు) సబ్సిడీ ఇస్తుంది. రెండు, మూడో సంవత్సరం 20 శాతం సబ్సిడీ ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. మహబూబ్నగర్, నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో అపారంగా ఉన్న మెట్ట, వర్షాధార ప్రాంతాల్లో యాపిల్ బేర్ సాగు చేసుకోవచ్చు. బిందు, తుంపర సేద్య పద్ధతులు పాటిస్తే దిగుబడులు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
- ఎల్. వెంకట్రామ్రెడ్డి,
ఉద్యాన శాఖ కమిషనర్
Authorization