తీగజాతి కూరగాయల పంటలు రైతన్నలకు దన్నుగా నిలుస్తాయి. వీటిని శాశ్వత పందిర్లపై పండించి అధిక లాభాలు గడించొచ్చు. ఇందుకు ఉద్యాన శాఖ రాయితీలు కూడా ఇస్తోంది. శాశ్వత పందిరిపై బీర ఏడాదికి మూడుసార్లు, కాకర సొర రెండుసార్లు, బోడ కాకర ఒక సారి సాగు చేయొచ్చు. ఈ పంటలకు వేడి వాతావరణం అనుకూలం. నీటిని నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు అనుకూలం.
రకాలు: యూఎస్-6214, యూఎస్-33మహికోగ్రీన్, వినరు, ఉజాల, పీహెచ్బీ, పునమ్,
సొర: మహికో వరద్, రవీనా, యూఎస్-161, శ్రామిక్, కావేరి
బీర: సురేఖ, నిశాంత్, సానియా-4, యూఎస్- 134, సరిత, పొట్ల, దొండ, బోడ కాకరకాయి లోకల్ రకాలు
విత్తే విధానం: భూమి మీద పాకించే పాదులు, వర్షాకాలంలో నీటి కాల్వలకు తోడుగా మురుగు నీరు పోవడానికి రెండు మీటర్ల దూరంలో కాల్వలు చేయాలి. వేసవిలో పాదులకు పొలం అంతట నీటి పారుదల కోసం బోదెలు చేయాలి. అన్ని రకాల పాదులకు మూడు విత్తనాలను 1-2 సెం.మీ లోతు విత్తుకోవాలి. దొండకు చూపుడు వేలు లావున్న కొమ్మలు నాలుగు కణుపులున్నవి రెండ చొప్పున నాటుకోవాలి. వర్షాధారంతో కూడిన అన్ని తీగజాతి కూర పంటలను 15ఇంటు10 సెం.మీ పాలిథిన్ సంచుల్లో విత్తుకుని 15-20 రోజులు పెరిగిన తర్వాత అదను చూసి నాటుకోవాలి.
విత్తనశుద్ధి: కిలో విత్తనానికి మూడు గ్రాముల థైరమ్, ఐదు గ్రాముల ఇమడాక్లోఫ్రిడ్తో ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.
ఎరువులు: విత్తే ముందు ఎకరానికి 6-8 టన్నుల పశువుల ఎరువు, 32 నుంచి 40 కిలోల భాస్వరం,16నుంచి 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను గుంతల్లో వేయాలి. 32-40 నత్రజనినిచ్చే ఎరువును రెండు సమభాగాలుగా చేసి విత్తిన 25నుంచి 30 రోజులు అంటే పూత, పిందె దశలో వేయాలి.
కలుపు నివారణ: కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసేయాలి. రెండు, మూడు తడుల తర్వాత మట్టిని గుల్ల చేయాలి. 200 లీటర్ల నీటిలో 1.2 లీటర్ల పిండి మిథాలిన్ (ఎకరాకు) కలిపి విత్తిన రెండు రోజుల్లోపు పిచికారి చేయాలి.
ఆడపువ్వుల నిష్పత్తి పెంచడం: మొక్కలు రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి మూడు గ్రాముల బొరాక్స్ కలిపి పిచికారి చేస్తే ఆడపువ్వుల నిష్పత్తి పెరుగుతుంది.
నీటి యాజమాన్యం: బిందు సేద్యం ద్వారా నీరు పారించడం మంచిది.
సస్యరక్షణ: పెంకు పురుగులు: పిల్ల పురుగులు పెరుగుదల దశలో ఉన్న ఆకుల, పూలను కొరికి తింటాయి. నివారణకు లీటరు నీటిలో మూడు గ్రాముల కార్బొరిల్ లేదా రెండు మి. లీటర్ల మలాథీన్ కలిపి పిచికారి చేయాలి.
పొట్ల ఆకు పురుగు: గొంగళి పురుగులు,ఆకులు, పూలు తింటాయి. నివారణకు లీటరు నీటిలో 2.5 మి. లీటర్ల క్లోరిఫైరీఫాస్ లేదా క్వినాల్ఫాస్ కలపి పిచికారి చేయాలి.
పండు ఈగ: పూత దశలో తల్లి ఈగలు పూలపై గుడ్లు పెడతాయి. వీటినుంచి వచ్చిన పురుగులు పిందెలో చేరి తీవ్రంగా నష్టపరుస్తాయి. దీని నివారణకు లీటరు నీటిలో రెండు మి.లీటర్ల మలాథీన్ను పూత దశలో పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
తెగుళ్లు
ఆకుమచ్చ: ఆకులపై ఆకుపచ్చ, ముదురాకుపచ్చ కలిపి మొజాయిక్ రూపంలో కనిపిస్తాయి. ఆకుపై భాగంలో పసుపు రంగు, కింద ఉదా రంగు మచ్చలు ఏర్పడి పండుబారి ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటిలో 2 గ్రాముల సాఫ్ లేదా 2 గ్రాముల మెటాక్సిల్ ఎంజెడ్ కలిపి పిచికారి చేయాలి.
వేరుకుళ్లు: దీన్నే ఎండు తెగులు అంటారు. ఇవి సోకితే తీగలు వడలి ఎండిపోతాయి. ఈ శిలీంధ్రం భూమి ద్వారా వ్యాపిస్తుంది. నివారణక లీటరు నీటిలో 3 గ్రాముల బ్లైటాక్స్కలిపి పిచికారి చేయాలి. ఆఖరి దుక్కిలో 250 కిలోల వేప పిండి వేయాలి. ట్రైకోడెర్మా విరడీ కల్చర్ని భూమిలో వేయాలి.
బూడిద తెగులు: ఆకులపై బూడిదలాంటి పిడి కప్పి ఉంటుంది. పొడి వాతావరణంలో ఈ తెగులు తీవ్రత ఎక్కువ. నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల గంధకం పొడి, లేదా ఒక మి.లీ డైనోకాప్ లేదా 2 మి.లీ హెక్సాకొనోజోల్ కలిపి పిచికారి చేయాలి.
పల్లాకు తెగులు: ఈనెలు పసుపు రంగుకు మారి, కాయలు గిడసబారుతాయి. ఈ తెగులును గురించి వెంటనే కాల్చివేయాలి. నివారణకు లీటరు నీటిలో 2 మి.లీ డైమిథోయేట్ లేదా మిథైల్డెమటాన్ కలిపి పిచికారి చేయాలి.
Authorization