కంద (పుల్ల కంద) దుంప జాతికి చెందిన పంట. మన రాష్ట్రంలో దుంప పంటలలో కంద వాణిజ్య ప్రాముఖ్యం కలిగి ఉన్నది. కంద ఉత్పత్తికి తక్కువ ఖర్చుతో కూడుకొని ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుంది. మారుతున్న వాతావరణం, పెరుగుతున్న వేడి, నీటి ఎద్దడులలో దుంప పంట సాగు రైతుకు లాభదాయకంగా ఉంటుంది. కంద సాధారణంగా 25 నుంచి 35 (డిగ్రీ సెంటిగ్రేడ్) ఉష్ణోగ్రత మధ్య బాగాపెరిగి, మంచి దిగుబడి ఇస్తుంది. కానీ పెరుగుతున్న ఉపరిత ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితుల మధ్య ఇది గరిష్టంగా 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుని జీవించగల పంట. రానున్న రోజులలో దుంప పంటలు గ్లోబల్ వార్మింగ్ను తట్టుకొని తృణధాన్యాలకు, పప్పుదినుసు పంటలకు ప్రత్యామ్నాయాలుగా మారనున్నాయి.
పోషకాల పరంగా పరిశీలించినట్టయితే కంద చక్కని పోషకాల గని. దీనికి చక్కటి ఉదాహరణ టసెన్ బోల్ట్ ( జమైకా పరుగుల వీరుడు) తన రోజూవారి ఆహారంలో కందను తీసు కోవడం వల్లే తాను ఎక్కువ (ఎనర్జీ) శక్తిని పొందగలు గుతున్నారని ప్రపంచానికి చెప్పాడు. దీనికి కారణం కంద ప్రతి వంద గ్రాములు తీసుకుంటే అందులో లభించే శక్తి 330 కేజీ (కిలో జౌల్స్), కాల్షియం 50 -56 ఎమ్జి(మిల్లీ గ్రాములు), పీచు పదార్ధాలు (ఫైబర్) 0.8శాతం, ప్రోటీన్లు 1.7-5శాతం, కొద్ది మోతాదులో జింక్, కాపర్, సెలేనియం, విటమిన్ బి6 ఉంటాయి.
అంతే కాకుండా కంద ఔషద లక్షణాలు గల పంట. దీనిలోని పీచు పదార్ధాల వల్ల మల బద్దకం, పైల్స్ను కూడా నివారించ గలవు. ఒమోగా-3 కొవ్వు ఆమ్లాలు హృద్రోగాలను, క్యాన్సర్ని సైతం నివారించగలవు. కంద గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కనుక షుగర్ వ్యాధిగ్రస్తులకు చక్కని ఆహారం.
వాతావరణం: అనువైన ఉష్ణోగ్రతలు 25-35 (డిగ్రీ సెంటిగ్రేటెడ్) తేమతో కూడిన ఉష్ణ వాతావరణం మొక్క పెరుగుదలకు, పొడి వాతావరణం దుంప పెరుగుదలకు సరైనది.
నేలలు: దాదాపు అన్ని నేలల్లోనూ పండుతుంది. మురుగు నీటి సౌకర్యం కలిగిన ఒండ్రు నేలలు అనువైనవి. మధ్యరకం నేలల్లో దుంప పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఉదజని సూచిక 6.0-7.0 అనుకూలం.
అనువైన రకాలు: గజేంద్ర, శ్రీపద్మ, శ్రీలధిర, సాంత్రగచ్చి, బిదాన్కుసుమ్, గజేంద్ర రకం ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడి, ఎక్కువ దిగుబడి ఇచ్చే రకం.
గజేంద్ర: దుంపలు పెద్దవిగా గోళాకారంగా లేక గుండ్రంగా ఉండి, గోధుమ రంగు నుంచి నల్లని రంగు కలిగి ఉంటాయి. దుంప మధ్యలో ఉండే కండ పసుపు నుంచి నారింజ రంగు లో ఉంటుంది. దుంపలు తక్కువ పిల్ల దుంపలను కలిగి ఉంటాయి. దుంపలు తక్కువ లేక అతి తక్కువ దురదను కలిగి ఉంటాయి. వండిన తర్వాత ఎటువంటి దురదను కలుగ జేయవు. హెక్టారుకు 40 నుంచి 55 టన్నుల దిగుబడి ఇస్తుంది. గరిష్టంగా 80 టన్నుల వరకు వస్తుంది.
శ్రీపద్మ: దుంపలు ముదురు గోధుమ వర్ణంలో ఉండి, ఎక్కువగా పిల్ల దుంపలను కలిగి ఉంటాయి. దక్షిణ భారతదేశంలో గజేంద్ర తరువాతం ఎక్కువగా పండించే రకం. వండిన తర్వాత అతి తక్కువ దురద కలిగి ఉంటుంది. దిగుబడి హెక్టారుకు 40 టన్నుల నుండి 45 టన్నులు మధ్య వస్తుంది.
శ్రీ అధిర: దుంపలు ముదురు గోధుమ వర్ణం కలిగి ఎక్కువగా పిల్ల దుంపలను కలిగి ఉంటాయి. దుంప మధ్య భాగం లేత గోధుమ క్రీం కలర్ రంగు కలిగి ఉంటుంది. ఈ రకం హెక్టారుకు 40 నుంచి 45 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ రకం కాండము లేక మొదలు కుళ్లు తెగులును, మొసాయిక్ తెగులును తట్టుకోగలదు.
విత్తే సమయం: ఫిబ్రవరి నుంచి మార్చి నెలాఖరు వరకు నాటుకోవచ్చు.
నాటే విధానం, ఎరువుల యాజమాన్యం: ఈ పంటలో దుంపలను (ప్లాంటింగ్ మెటీరియల్) విత్తనంగా వాడుతారు. సాధారణంగా 500 నుంచి 750గ్రాముల దుంపలు నాటు కోవడానికి అనుకూలం.కిలో సైజు దుంపలను కూడా వినియోగించుకోవచ్చు. నేలను బాగా దుక్కి చేసి 90 సె.మీ ఇంటు90సె.మీ ఎడంగా గుంతలు తీసి నాటుకోవాలి.
ఆరోగ్యమైన విత్తన దుంపలను 60ఇంటు 60ఇంటు 45 సెం.మీ కలిగిన గుంతలలో నాటుకోవాలి. ప్రతి గుంతలో 1-1.5 కిలోల చివికిన పశువుల ఎరువును పై మట్టిలో కలిపి వేసుకోవాలి. లేదా హెక్టారుకు 10-15 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. హెక్టారుకు నతజ్రని, భాస్వరం, పొటాష్లను 100:50:100 కిలోల చొప్పున వేసుకోవాలి. అంటే 100 కిలోల నత్రజనిని 225 కిలోల యూరియా రూపంలో 50 కిలోల భాస్వరంను 300 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్(ఎస్ఎస్పి) రూపంలో 100 కిలోల పొటాష్ను 180 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేసుకోవాలి. పూర్తి భాస్వరం, పొటాష్లు మూడో వంతు నత్రజనిని చివరి దుక్కిలో వేసుకోవాలి. మిగిలిని నత్రజనిని మరొక రెండు సమ భాగాలుగా చేసి నెల రోజులకు, రెండు నెలల తర్వాత మొక్కలకు వేయాలి.
కలుపు నివారణ - అంతరకృషి
దుంపలు నాటిన నాటి నుండి పూర్తిగా మొలకెత్తడానికి 30-45 రోజుల సమయం పడుతుంది. కంద మొలకెత్తుటకు ఎక్కువ సమయం పట్టడం వల్ల, ఎక్కువ నీటి తడులు పెట్టడం వల్ల, బలమైన నేలల్లో వేయడం వల్ల కలుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మొదటి దఫా తడి ఇచ్చిన తరువాత తడిగా వున్న నేలపై గ్లైఫోసెట్ 2 కిలో గ్రాములు, లేక ఫ్లుకోరాలిన్ 2 లీ.లు లేక పెండిమిథాలిన్ బుటాక్లోర్ 3.0 లీ.ల మందును 500 లీ.ల నీటిలో కలిపి ఒక హెక్టారుకు నేల బాగా తడిచేలాగా పిచికారి చేయాలి.
ధాతు లోపాలు: నీటి తడులు సరిగ్గా లేనప్పుడు ఇనుప ధాతు లోపం సహజంగా కనిపిస్తుంది. ఆకులు హరితహారం కోల్పోయి తెల్లగా మారుతాయి.ఈ ధాతు లోపాన్ని సవరించ డానికి ఒక లీటరు నీటికి 5 గ్రా.అన్నబేధి, 1 గ్రా, నిమ్మఉప్పు, ఉండే మోతాదులో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. అవసరాన్ని బట్టి నీటితడులు పెంచుతూ నీటి ఎద్దడిని తగ్గించాలి.
సస్యరక్షణ: కందలో ఆకుమచ్చ, కాండం కుళ్లు, మొజాయిక్ తెగుళ్లు ప్రధానమైనవి.
ఆకుమచ్చ తెగులు: ఈ తెగులు వర్షాకాలంలో ప్రారంభమై క్రమేపి వృద్ధి చెందును. ఆకులపై పసుపు వర్ణం మచ్చలతో ప్రారంభమై ముదురు గోధుమ వర్ణముకు మారి ఆకులు ఎండి, పండిపోతాయి.
నివారణ: తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే లీటరు నీటికి 3గ్రా.కాపర్ ఆక్సీక్లోరైడ్ మందు పిచికారి చేయాలి. తెగులు ఎక్కువగా ఉంటే 2 గ్రా. మెటలాక్సిల్ ఎమ్జెడ్ ఒకసారి ఆకులు పూర్తిగా తడిచేలా పిచికారి చేయాలి.
కాండం లేక మొదలు కుళ్లుతెగులు:
కాండం మొదలు వద్ద కుళ్లు మొదలై క్రమేపి కాండం పూర్తిగా కుళ్లిపోయి మొక్క చనిపోతుంది.
నివారణ: తెగులు ఆశించిన మొక్క చుట్టూ ఉన్న మట్టిని 0.3, కాపర్ ఆక్సీక్లోరైడ్ లేక, 1 శాతం, బోర్డో మిశ్రమం ద్రావణంతో తడిపి తెగులును అరికట్టవచ్చు. మిగిలిన ఆరోగ్యవంతమైన మొక్కలకు కార్బండజిమ్ ఒక గ్రాము లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
కాండం కుళ్లు తెగులు సోకకుండా విత్తన దుంపలను ట్రైకోడెర్మా, సుడోమోనాస్ ఫ్లోరెసెన్స్ను (100గ్రాముల) బయో ఎరువును 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి చేసిన మిశ్రమంలో ముంచి నాటుకోవాలి.
మొజాయిక్ తెగులు
తెగులు ఆశించిన మొక్కల ఆకులు పత్రహారాన్ని కోల్పోయి తెలుపు, పసుపు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు చిన్నవిగాను, ముడుచుకుపోయినట్టు కనిపిస్తాయి. ఈ వైరస్ తెగులు విత్తన దుంపల ద్వారాను, పేనుబంక పురుగుల ద్వారాను వ్యాపిస్తుంది.
నివారణ: విత్తన దుంపలను తెగులు సోకని తోటల నుండి సేకరించాలి. పేనుబంక నివారణకై డైమిథోయేట్ లేదా డెమటాస్లను 2 మి.లీ ఒక టీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కోత, దిగుబడి:పూర్తిగా ఎదిగిన మొక్కలు నెమ్మదిగా పసుపు వర్ణంలోకి మారి ఎండిపోయిన తరువాత దుంపలను తవ్వి తీయాలి. మార్కెట్లో ధర సరిగా లేనట్టయితే పంటను 1-2 నెలల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూమిలోపలే ఉండనీయొచ్చు. మార్కెట్ ధర బాగా ఉన్నప్పుడే తవ్వి తరలిం చొచ్చు. హెక్టారుకు దిగుబడి రకాన్ని బట్టి 35 నుంచి 50 టన్నుల వరకు వస్తుంది. గజేంద్ర రకం అయితే గరిష్టంగా హెక్టారుకు 80 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
- జె. సురేష్కుమార్
శాస్త్రవేత్త
Authorization