గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 20నుంచి 27 డిగ్రీల సెల్సీయస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 30నుంచి 34 డిగ్రీల సెల్సీయస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 21నుంచి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
వరి:దోమపోటు ఉధృతి తగ్గించుటకు ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ కాలిబాటను వదులుకొని తూర్పు, పడమర దిశలలో వరుసలు ఉండే విధంగా వరినాట్లు వేసుకోవాలి. వర్షాలు అధికంగా కురిసిన ప్రాంతాల్లో బ్యాక్టీరియా ఆకు, ఎండు తెగులు ఆశించకుండా, తెగులు వ్యాప్తి చెందకుండా నివారించేందుకు నత్రజని ఎరువులను తాత్కాలికంగా 5నుంచి 7 రోజులు వాయిదా వేసుకోవాలి. నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో లద్దెపురుగు ఆశించడమైంది. నివారణకు 0.3 మి.లీ క్లోరాంట్రనిలిప్రోల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో తాటాకు తెగులు, కాండం తొలుచు, ఆకు ముడత పురుగు ఆశించుటకు అనుకూలం. పురుగు, తెగులు గమనించినట్టయితే నివారణకు
తాటాకు తెగులు: 2 మి.లీ క్వినాల్ఫాస్ లేదా ప్రోఫినోఫాస్ లేదా 2.5 మి.లీ క్లోరిఫైరిఫాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
కాండంతొలుచు పురుగు: ఎకరం పొలానికి 8కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు వేసుకోవాలి.
ఆకు ముడత: 0.3 మి.లీ క్లోరాంట్రనిలిప్రోల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
మొక్కజొన్న: 25నుంచి 30 రోజుల మొక్కజొన్న పైరుకు పైపాటుగా ఎకరానికి 30నుంచి35 కి. యూరియా, 10కి, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవచ్చు. మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించినట్టయితే నివారణకు విషపు ఎర తయారు చేసుకోవడానికి గాను 10కిలోల వరి తవుడులో 2కిలోల బెల్లంను కలిపి 2-3 లీ. నీటిని చేర్చి సుమారు 12 గంటల పాటు పులియనిచ్చి మరుసటి రోజు 100గ్రా. థైడికార్బ్ను కలుపుకొని ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి మొక్క సుడులలో వేసుకోవాలి. ఎమమేక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా థైమేమిథాక్సామ్9.5శాతం, లాను సైహలోత్రిన్ 12.6శాతం 0.5 మి.లీ లేదా క్లోరాన్ట్రినిలిప్రోల్ 0.3 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. నేలలో ఎక్కువ మోతాదులో తేము ఉన్నట్టయితే మొక్కజొన్నలో ఎండు తెగులు సోకుటకు అనుకూలం. తెగులు వ్యాపిస్తే నివారణకు పొలంలోని ముదురు నీటిని తీసేయాలి.
పత్తి: 35 నుంచి 40 రోజుల పత్తి పైరుకు పైపాటుగా ఎకరానికి 25కి. యూరియా, 50 కి., 10కి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను, ప్రస్తుత వాతారణ పరిస్థితులు పత్తిలో రసం పీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు మొనోక్రోటోఫాస్ మందును, నీటిని 1:4 నిష్పత్తిలో కలిపి లేత కాండంపై మెత్తిని బ్రష్తో విత్తిన 30, 45 రోజుల పైరుకు పూయాలి. నేలలో ఎక్కువ మోతాదులో తేమ ఉన్నట్టయితే పత్తిలో ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు వ్యాప్తి నివారణకు 3గ్రా. కాపర్ఆక్సిక్లోరైడ్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.
సోయాచిక్కుడు: సోయాచిక్కుడులో కాండం తొలిచే ఈగ, పెంకు పురుగు గమనించడమైంది. నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా 2 మి.లీ క్వినాల్ఫాస్, 5 మి.లీ వేప గింజల కషాయం (ఎన్ఎస్కెఇ) లేదా 0.3 మి.లీ క్లోరాంట్రనిలిప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. సోయాచిక్కుడులో పొగాకు లద్దె పురుగు గమనించడమైంది. నివారణకు 2.5 మి.లీ క్లోర్పైరిఫాస్ లేదా 1 మి.లీ నోవల్యూరాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఆముదం: జోగులాంబ, గద్వాల్, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలో జూన్ రెండో పక్షంలో విత్తిన ఆముదం పంటపై దాసరి పురుగు ఆశించడం గమనించడమైంది. పురుగు ఉదృతిని గమనిస్తూ సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలి.ఎకరం పొలంలో 8నుంచి 10 పక్షిస్థావరాలను అమర్చాతి. దాసరి పురుగు మొదటి దశలో పరాన్న జీవులకు హాని చేయని వేపనూనె 5 మి.లీ లీటరు నీటిలో కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిసేలా పిచికారి చేయాలి. పొలంలో దాసరి పురుగును ఆశించే మైక్రోప్లైటిస్ పరాన్న జీవి ఉనికిని గమనించాలి. పరాన్నజీవి ఆశించినట్టయితే ఏ విధమైన పురుగు మందులు పిచికారి చేయకూడదు. పురుగు ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు 1.5 గ్రా. ఎసిఫేట్ లేదా 1.5 గ్రా. థయోడికార్బ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కూరగాయలు: ప్రస్తుత పొడి వాతావరణ పరస్థితులలో రసం పీల్చే పురుగుల ఉదృతి పెరిగే సూచనలున్నాయి. నివారణకు ఫిప్రోనిల్ 2మి.లీ లేదా థయోమిథాక్సిమ్ 0.3 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.రాష్ట్రంలో వర్షపాత సూచనలు ఉన్నందున మిరప నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి.
సేకరణ : మోత్కూరి యాదయ్య
8332995392
Authorization