వెదురును పచ్చ బంగారం అని కూడా అంటారు. ఇది బహువార్షికం. సన్నగా పొడవుగా ఎదుగుతుంది. భూమిలోని దుంప నుండి పెరుగుతుంది. అనుకూల పరిస్థితుల్లో చాలా త్వరగా పెరుగుతుంది.మన రాష్ట్రంలో ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో అధికంగా పెంచుతారు.
నేలలు: అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. గరప నేలలు అనుకూలమైనవి. చవుడు లేదా ఆమ్ల గుణాలు కలిగిన నేలలు పనికి రావు.
అనుకూలమైన సమయం: జూన్ నుంచి జూలై వరకు నాటుకోవాలి.
రకాలు
గట్టి వెదురు (డెండ్రోకాలదుస్ (స్టిక్టస్): ఈ వెదురు గుల్ల ఉండదు.
మామూలు వెదురు (బాంబుసా ఆరండునేసియ): ఈ వెదురులో గుల్ల ఉంటుంది. వంకర లేకుండా నిటారుగా ఉండి తేలికగా ఉంటుంది. గుల్లగా ఉండడం వల్ల సన్నగా చీల్చి వివిధ పనులకు వినియోగిస్తారు.
విత్తే దూరం
గట్ల చుట్టూ 4 మీ. దూరంలో తోటగా పెంచినప్పుడు 5ఇంటు5 మీ.
మొక్కల సాంద్రత (ఎకరానికి) : 200
విత్తు పద్దతి : వెదురు వేరు రైజోమ్స్ ద్వారా ప్రవర్థనం అవుతుంది. సుమారు ఒక సంవత్సరం పెంచిన రైజోమ్స్ని సుమారు 1 మీటరు వరకు కత్తిరించి వర్షాకాలంలో నాటాలి.
అంతర పంటలు: మొదటి మూడు సంవత్స రాల వరకు అల్లం, మిరప, పసుపు వంటి నీడను ఇచ్చే పంటలను అంతర పంటలుగా వేసుకోవాలి.
ఎరువుల యాజమాన్యం: నాటే సమయంలో ప్రతి గుంతలో 4 కిలోల పశువుల ఎరువు కలిపి నింపాలి. వెదురు పంటకు ఎక్కువ మోతాదులో ఎరువులు కావాలి. వెదురును కోసిన తర్వాత ఎరువులు వేసి నీరు పెట్టాలి. నత్రజని, పొటాష్ ఎరువును సంవత్సరంలో 3-4 సార్లు వేయాలి. అలాగే పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువు కర్ర బూడిదను వేయాలి.
కలుపు యాజమాన్యం
వెదురు పంటల వరుసల మధ్య ఒకటి రెండు సార్లు దుక్కి చేసి అంతర పంటలు వేయవచ్చు. భూమిలోని తేమ సద్వినియోగానికి భూమిపైన 20 సెం.మీ వరకు వరి గడ్డిని వరుసలలో కప్పాలి. దీని వలన కలుపు పెరుగుదల కూడా తగ్గుతుంది.
నీటి తడులు: పంట నాటే సమయంలో నీరు పెట్టాలి. వేసవి కాలంలో నెలకొకసారి తడి ఇచ్చినట్టయితే దిగుబడి పెరుగుతుంది. డ్రిప్ పద్ధతి ద్వారా కూడా నీరు పెట్టవచ్చు.
దిగుబడి
ఒక ఎకరంలో 150 కుదుళ్ల వరకుంటాయి. 7 నుంచి 8 సంవత్సరాల నుండి కుదురుకు సంవత్సరం విడిచి సంవత్సరం 10 గెడల చొప్పున 1500 గెడలు వస్తాయి. గెడకు రూ.10 చొప్పున ఎకరానికి రూ. 15వేల ఆదాయం వస్తుంది. ఈ విధంగా 20 నుంచి 25 ఏండ్ల వరకు అధికంగా దిగుబడినిస్తాయి.
Authorization