కూర మిరప కారం తక్కువగా ఉండి గంట ఆకారంలో లావుగా ఉంటుంది. అందువల్లే దీన్ని 'బెల్పెప్పర్' అంటారు. వీటిని పచ్చి కూరగాయలుగా ఉపయోగిస్తారు. దీన్ని చల్లని ప్రదేశాల్లో పండిస్తారు. కనుక 'సిమ్లా మిర్చి' అని కూడా అంటారు. వీటిలో 'ఎ', 'సి' విటమిన్లు అధికంగా ఉంటాయి.
వాతావరణం: శీతాకాలం రాత్రి వేళల్లో అత్యల్ప ఉష్ణోగ్రత 10-17 డిగ్రీల సెల్సియస్ మధ్య 30 నుంచి 40 రోజుల పాటు ఉంటే ఈ పంటకు అనుకూలం. రాత్రి ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ పూత రాలడం ఎక్కవ అవుతుంది. కాయ నాణ్యత తగ్గుతుంది.
నేలలు: నీరు బాగా ఇంకే బరువైన, సారవంత మైన నేలలు అనుకూలం. మురుగు నీటి పారుదల సౌకర్యం ఉండాలి. చవుడు నేలలు పనికిరావు. ఉదజని సూచిక 6.0-6.5 అనుకూలం.
విత్తన మోతాదు, నారుమడి: సుమారు 600 గ్రా. విత్తనాలను 40 చ.మీ నారుమడిలో పల్చగా చలు ్లకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రా. చొప్పున థైరమ్ లేదా మాంకోజెబ్తో విత్తశుద్ధి చేయాలి. నారుమడిలో ప్యురడాన్ గుళికలు (100గ్రా.) వేసుకోవాలి. విత్తిన 12, 19వ రోజున కాపర్ సంబంధిత శిలీంధ్ర నాశనులతో నేల తడిచేటట్టు పిచికారి చేసి నారుకుళ్లు తెగులును నివారించుకోవాలి.
రకాలు
కాలిఫోర్నియా వండర్: కాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పంట కాలం 140-150 రోజులు. దిగుబడి ఎకరానికి 6 నుంచి 7 టన్నులు.
అర్కబసంత్: కాయలు లేత పసుపు రంగులో ఉంటాయి. పంటకాలం 125 -140 రోజులు. ఎకరానికి 6నుంచి 8 టన్నుల దిగుబడి వస్తుంది.
అర్కగౌరవ్: లేత కాయలు ముదురాకుపచ్చగా ఉండి, పూర్తిగా పెరిగిన దశలో నారింజ రంగుకు మారుతాయి. పంట కాలం 125 నుంచి 150 రోజులు, దిగుబడి ఎకరానికి 6 నుంచి 8 టన్నులు.
అర్కమోహిని: కాయలు ముదురాకు పచ్చ రంగులో ఉంటాయి. కాయలు పండినప్పడు ఎర్ర రంగుకు మారుతాయి. పంట కాయలు చాలా పెద్దగా ఉంటాయి. కాయ బరువు 180- 200 గ్రాములుంటుంది. పంట కాలం 120 రోజులు, దిగుబడి 6- 8 టన్నులు, పై మూడు అర్క రకాలు ఖరీఫ్, రబీకి అనుకూలమైనవి.
భారత్ (హైబ్రిడ్): కాయలు ముదురాకు పచ్చగా ఉంటాయి. పంట దిగుబడి ఎకరానికి 14నుంచి 16 టన్నులు. వివిధ కంపెనీలకు చెందిన హీరా, లారియో, ఇంద్ర హైబ్రిడ్స్ మార్కెట్ లో లభ్యమవుతున్నాయి. ప్రాంతాన్నిఅనుసరించి రకాన్ని ఎన్నుకోవాలి.
నాటే సమయం: సెప్టెంబరు నుంచి అక్టోబరకు నారును పెంచుకోవచ్చు.
నాటడం: 35 నుంచి 40 రోజుల వయస్సు గల నారు నాటాలి. 60×45 సెం.మీ దూరంలో కుదురుకు రెండు మొక్కల చొప్పున నాటుకోవాలి. నాటుకోవడానికి ముందు 10 లీటర్ల నీటికి 2 కిలోల అజోస్పెరిల్లమ్ కలిపిన ద్రావణంలో మొక్కలను అరగంట ముంచాలి. ఈ మొక్కలు పొలంలో బాగా కుదురుకుంటాయి.
ఎరువులు: ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు వేయాలి. గొర్రెల పెంటతో పాటు వేపపిండి(2 క్వి. ఎకరానికి) వేస్తే మంచిది. నాటడానికి ముందు ఎకరానికి 24 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ వేసుకోవాలి. నాటిన 45 రోజుల తర్వాత16 కిలోల నత్రజని, 7 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను మూడు దఫాలుగా 15 రోజుల వ్యవధిలో వేసి నీరు పెట్టాలి. 1 శాతం యూరియా (లీటరు నీటికి 10 గ్రా)ను కీటకనాశనులతో కలిపి పిచికారి చేయాలి. జింకు లోప నివారణకు ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ వేయాలి. లేదా 2 గ్రా. జింకు సల్ఫేట్ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కలుపు నివారణ- అంతరకృషి: కలుపు నివారణకు పెండి మిథాలిన్ మందును ఎకరానికి 1.2 లీ. చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 48 గంటల్లోపు పిచికారి చేయాలి. పూత నిలవడానికి, దిగుబడి పెరగడానికి నాప్తలిన్ అసిటిక్ ఆమ్లం 2.5 మి.లీ 10 లీటర్ల నీటికి లేదా ట్రైకాంటనల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పూత ప్రారంభదశలో 10 రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారి చేయాలి.
నీటి యాజమాన్యం: నారు నాటిన వెంటనే నీరు కట్టాలి. అవసరాన్నిబట్టి నీరు పెట్టాలి. సాధారణంగా నేల స్వభావాన్ని బట్టి ప్రతి 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీటిని ఇవ్వాలి.
సస్యరక్షణ: మిరప పంటలో మాదిరిగానే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
పంట కోత: 135 నుంచి 150 రోజుల్లో, ఎకరానికి 6నుంచి 8 టన్నుల కాయల దిగుబడి వస్తుంది.
మిరప, బెంగుళూరు మిరపలో సమగ్ర సస్యరక్షణ:
పొలంలో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచాలి. అంతర పంటలుగా బంతి, ఉల్లి, వెల్లుల్లిలను వేయాలి. ఎతైన నారుమళ్లు వేయాలి. రసం పీల్చే పురుగుల ఉనికిని గమనించేందుకు ఎకరానికి 4 చొప్పున పసుపు రంగు పూసిన రేకులను ఆముదం, గ్రీసు పూసి పెట్టాలి. రసం పీల్చు పురుగుల నివారణకు అంతర్వాహిక కీటక నాశిసునులను పిచికారి చేయాలి. పై ముడత ఆశించినప్పుడు ఫాసలోన్ 2.0 మి.లీ లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ లేదా స్పైనోసాడ్ 0.25 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. కింది ముడత ఆశించినప్పుడు నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా డైకోఫాల్ 5 మి.లీ లేదా డైఫెన్థయురాన్ 0.5గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ట్రైకోగ్రామా ఎకరానికి 20,000 చొప్పున విడుదల చేయాలి. అల్లిరెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున విడుదల చేయాలి. కిలో విత్తనానికి ట్రైకోడెర్మావిరిడి 8గ్రా. చొప్పున కలిపి విత్తనశుద్ది చేయాలి. ఎకరానికి 100 కిలోల వేపపిండిలో ఒక కిలో ట్రైకోడెర్మా కల్చర్ కలిపి వేయాలి. ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు మాంజోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. బ్యాక్టీరియ ఎండుతెగులు ఉన్న చోట ఎకరానికి 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పొడిని వేయాలి. కానోఫోరా ఎండుతెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి 3 గ్రా. కలిపి పిచికారి చేయాలి. కొమ్మ ఎండుతెగులు నివారణకు కాప్టాన్ 2 గ్రా. మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఎల్. వెంకట్రామ్రెడ్డి
ఉద్యాన శాఖ కమిషనర్
Authorization