పాలీహౌసుల్లో సాగు చేస్తున్న పంటలను వేసవి వాతావరణ పరిస్థితుల నుంచి సంరక్షించేందుకు వీలుగా పలు మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం మొదలు కాగానే మెత్తటి సున్నాన్ని పల్చటి నీటిలో కలిపి పాలీహౌస్ పైభాగం మొత్తం తడిసేలా మధ్యాహ్నాం పిచికారి చేయాలి. దీని వల్ల వెలుతురు ఎక్కువగా పరావర్తం చెండడం వల్ల పాలీహౌజ్ లోపల వేడిని తగ్గించవచ్చు. తొలకరిలో కురిసే వర్షాలకు సున్నం కరిగిపోతుంది. అంతేకాకుండా తేమ అధికంగా ఉండే ప్రాంతాల్లో పాలీహౌజ్ పై భాగంలో పచ్చటి నాచు పెరగడం, సంవత్సరంలో 2-3సార్లు వర్షాలు ఆగిన వెంటనే సున్నం పిచికారి చేసి పై భాగంలో పెరిగే నాచును పూర్తిగా నివారించవచ్చు. దీనివల్ల ఇతర కాలాల్లో సూర్యరశ్మి లోపలికి బాగా ప్రవేశిస్తుంది.
ఉష్ణోగ్రతల పెరుగుదలను అసుసరించి పాలీహౌజ్ పై భాగంలో ఏర్పర్చుకున్న షేడ్నెట్ను ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు పూర్తిగా మూసివేయాలి. దీనివల్ల లోపలకు వెలుతురు ప్రసరణ 50శాతం వరకు తగ్గుతుంది. గత సంవత్సరం తెలుపు కాకుండా నలుపు రంగు షేడ్నెట్ ఉపయోగించిన పాలీహౌజ్ల్లో 2నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత, తెలుపు షేడ్నెట్ కన్నా తక్కువగా ఉంది. పాలీహౌజ్ పైభాగంలో ఏర్పర్చిన షేడ్నెట్లను రాత్రిపూట పూర్తిగా తెరిచి ఉంచాలి. దీని వల్ల రాత్రి వీచే చల్లటి గాలితో పాలీహౌజ్ లోపల వాతావరణం చల్లని గాలితో చల్లబడుతుంది.ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట పాలీహౌజ్లను మూసివేయరాదు. పాలీహౌజ్ల్లో నాలుగు వైపుల 35శాతం షేడ్నెట్ ఏర్పర్చి ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగినపుడు దక్షిణ పడమరలో ఉన్న షేడ్నెట్ను పూర్తిగా పగలు, రాత్రి మూసి ఉంచాలి. దీనివల్ల మధ్యాహ్నా తర్వాత ఉండే ఎండ తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చు. కాలిబాటలో లావు ఇసుకను నాలుగు అంగుళాల మందంలో పోసుకుని, ఇసుకను ఎప్పుడూ తడిగా ఉండడం ద్వారా రెండు డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. వేసవి ఆరంభం నుంచి జర్బరా, కార్నేషన్ సాగు లాభసాటిగా ఉంటుంది. కానీ వాటి పూల కాడలను బాగా ఎత్తుగా పెరగడం లేక పొట్టిగా ఉండడం గమనించాలి. మొక్కల వేరు వ్యవస్థ ఉన్న మట్టి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా తక్కువగా ఉండాలి. అందువల్ల కాలువలో ఉన్న ఇసుకను తడిపేటప్పుడు బెడ్ సైడులు కూడా తడిపి వేరు వ్యవస్థను చల్లబడేలా చూడాలి. ఫలితంగా ఇచ్చిన పోషకాలను సంగ్రహించుట వల్ల నాణ్యమైన పూలకాడలను పొందవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోను నీటితో తడపకూడదు.
వేసవిలో నీటి లవణాలు అధికమవడం వల్ల ఆకులు, పూలు మాడిపోయే అవకాశాలు ఎక్కువ. వేసవిలో పాలీహౌజ్లలో నీటి వినియోగం అధికంగా ఉంటుంది. అందువల్ల రోజు ఇచ్చే నీటిని రెండు దఫాలుగా ఉదయం, సాయంత్రం ఇవ్వాలి. ఒకేసారి ఇస్తే నీరు బెడ్స్ నుంచి కాలవలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో నీటి టిడిఎస్ విద్యుత్ ఛాలకత పీహెచ్/ఎస్ఏఆర్ వారానికి ఒకసారి పరీక్షించాలి. లేని పక్షంలో సూక్ష్మపోషకాల లోపం ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత నియంత్రణ కూడా కష్టమవుతుంది.
వేసవిలో బెడ్స్లోపల తడి ఎక్కువగా ఉన్నా, బెడ్పైభాగం వేడి గాలుల వల్ల ఎండిపోతాయి. మొక్కల వేర్లు బెడ్ పై భాగంలో ఉండడం వల్ల ఇవి నీటిని సంగ్రహించే శక్తిని కోల్పోయి మొక్కలు ఎక్కువగా చనిపోతాయి. వేసవి ఆరంభంలో బెడ్పైన ముందుగా ఒక ఎకరానికి 6 టన్నుల వానపాముల ఎరువు, దానిపై కోకోపేట్ పర్చుకున్నా మంచి ఫలితం ఉంటుంది. బెడ్పై భాగం తేమను గ్రహించి వేర్లు, నీటిని ఎరువులను బాగా సంగ్రహించడం వల్ల మంచి పెరుగుదల ఉంటుంది. వేసవిలోకానీ ఇతర కాలాల్లోగానీ ఎరువులు ఇచ్చేటప్పుడు బెడ్లో నీటి విద్యుత్ చాలకత 3.0 ఉండేటట్టు చూడాలి. దానికనుగుణంగా ఎరువులు ఇచ్చిన తర్వాత ఎక్కువ నీరు ఇవ్వకూడదు. ఎక్కువగా ఇస్తే విద్యుత్ చాలకత తగ్గి ఎరువుల వినియోగం ఉండదు. పాలీహాజ్లో పెంచే ఏ రకం పూల మొక్క నుంచి అయినా ఎండిపోయిన ఆకులు తప్ప మంచి ఆకులు ఏరివేయకూడదు. వేసవిలో కొత్త ఆకులు రావడం బాగా తక్కువ. జర్బరాలో ఎండిన ఆకులను మొక్క మొదలు నుంచి పూర్తిగా తీయాలి తప్ప ఆకు పైభాగం తీయకూడదు.
కార్నేషన్ మొక్కలలో ప్యుజేరియం అనే శిలీంద్రం వల్ల మొక్క మొదలు ఆకులు ఎండిపోయి కుళ్లిపోతుంది. ఈ తెగులు సాగు నీరు ఒక పద్ధతిగా లేనప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది. దీని నివారణకు బెనోమిల్ 2.0 గ్రా. లేక అలైట్ 1.0గ్రా. లీటరు నీటిలో కలిపి మొక్క మొదలుకు పిచికారి చేసి నివారించుకోవచ్చు. కార్నేషన్ పూల సాగులో ఏ సమయంలోనైనా మొక్కకు ఒక కొమ్మ లేక రెండు చిగుర్లు వచ్చి ఉండాలి. చిగుర్లు లేకుండా ప్రతి కొమ్మను కత్తిరించేటప్పుడు 100 శాతం మొక్కలు చనిపోతాయి. అందువల పూల కోతలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
వేసవిలో ఎర్రనల్లి తామర పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత పరిస్థితులలో రసం పీల్చు పురుగుల జీవిత చక్రం కాలం బాగా తగ్గడం వల్ల తల్లి పురుగులు మందుల వల్ల నశించినా పిల్ల పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అదువల్ల ఈ పురుగుల నివారణకు ఉదయం షాంపూ నీటితో మొక్కలపై పిచికారి చేసి, సాయంత్రం వాతావరణం చల్లబడినప్పుడు పురుగు మందులతోపాటు లీటరుకు 1 గ్రా పంచదారను కలిపి పిచికారి చేసినట్టయితే తీపిదనానికి పురుగులు ఆకర్షించబడి ఎక్కువ మొత్తంలో నివారణ సాధ్యమవుతుంది. పూలు కూరగాయలను పండించే పాలీహౌజ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెడ్స్పై మట్టిని కదిలించవచ్చు. వేర్లు కదిలితే మొక్కల పెరుగుదల కనిపించదు.
వేసవిలో సుడిగాలులు అకస్మాత్తుగా వచ్చే అవకాశాలుంటాయి. అందువల్ల పాలీహాజ్ రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సుడిగాలులు వచ్చే సూచనలున్నప్పుడు ప్లాస్టిక్ రోలర్ ఫిల్మ్ నలువైపులా అడుగు ఎత్తు తెరచి ఉంచడం ద్వారా గాలి సులభంగా లోపలి నుంచి బయటకు వెళ్లే ందుకు వీలుంటుంది. వేసవిలో కొత్త మొక్కలు నాటుకోవద్దు. నాటినా అధిక ఉష్ణోగ్రత వల్ల ఏపుగా పెరగవు. అంతేకాకుండా నాణ్యమైన పూల దిగుబడి రాదు. రైతులు పై విషయాలపై దృష్టిసారించి సమయానుకూలంగానూ వాతావరణ పరిస్థితులను బేరీజు వేసుకుని తగు విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాలీహౌజ్లలో సాగు చేసే పంటనుండి నాణ్యమైన దిగుబడి పొందవచ్చు.
- కె. భవ్యశ్రీ
అసిస్టెంట్ ప్రొఫెసర్ అగ్రికల్చర్ కాలేజీ, సిరిసిల్ల
Authorization