తెలంగాణలో నువ్వుల పంట సుమారు 60వేల ఎకరాల విస్తీర్ణంలో సాగువుతుంది. ఖరీఫ్లో వర్షాలు ఆలస్యంగా కురిసినప్పుడు, కేవలం ఒక పంట మాత్రమే సాగు చేసుకునే పరిస్థితులలో నువ్వులు ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయ పంటగా మంచి దిగుబడులు పొందవచ్చు. ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండించిన దానికంటే రబీ లేదా వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. తెలంగాణలో ఖరీఫ్ మొక్కజొన్న, పసుపు తర్వాత వరి మాగాణుల్లో నిల్వ ఉన్న తేమ కింద వేసవిలో నువ్వు ఒక లాభదాయక పంటగా సాగు చేసుకోవచ్చు.
నేలలు: మురుగు నీరు నిల్వని, తేమ నిలిచే తేలికైన నేలలు శ్రేష్టం. నీరు నిలిచే ఆమ్ల, క్షార గుణాలు గల నేలలు పనికిరావు.
నేల తయారీ: నేలను 2 నుంచి 4సార్లు మెత్తగా దున్ని రెండుసార్లు గుంటక తోలి చదును చేయాలి.
విత్తనం, విత్తే పద్ధతి: ఎకరానికి 2.5కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనానికి మూడింతల ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి.
విత్తనశుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం/ కాప్టాన్/ మాంకోజెట్తో విత్తనశుద్ధి చేయాలి.పంట తొలి దశలో రసంపీల్చే పురుగుల బారినుండి కాపాడడానికి ఇమిడాక్లోప్రిడ్2.0మి.లీ కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి.
విత్తే దూరం: వరుసల మధ్య 30 సెం.మీ(12 అంగుళాలు) మొక్కల మధ్య 15 సెం.మీ(6 అంగుళాలు)
ఎరువులు: ఖరీఫ్లో ఆఖరి దుక్కిలో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 8కిలోల పొటాష్ 8కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులు వేసుకోవాలి. అంటే ఎకరానికి 18కిలోల యూరియా, 50కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 15కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ విత్తేముందు వేసుకోవాలి. విత్తన 30 రోజుల తర్వాత మరో 18కిలోల యూరియా అందజేయాలి. రబీ లేదా వేసవిలో వీటితోపాటు 8కిలలో నత్రజనిని,15నుంచి18కిలలో యూరియా అదనంగా పైపాటుగా వేసుకోవాలి.
నీటి యాజమాన్యం (రబీ లేదా వేసవి): విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. పూత, కాయ అభివృద్ధి, గింజకట్టు దశల్లో తడులు ఇవ్వాలి. విత్తిన తర్వాత 35నుంచి 40 రోజుల నుండి 65నుంచి 70రోజుల వరకు నీటి ఎద్దడిలేకుండ ఆచూడాలి. నువ్వుసాగు చేసే నేలలో తేమ ఎక్కువ ఉన్న పరిస్థితులలో మొక్కల శాఖీయోత్పత్తి మాత్రమే జరిగి ఆకులు, కొమ్మలు ఎక్కువగా వచ్చి పూత, కాత రాకుండా నిలిచిపోవడం జరుగుతుంది. కనుక ఈ పంట సాగు చేసేటప్పుడు ఎక్కువ మోతాదులో నీరు అందజేయకూడదు.
కలుపు నివారణ అంతరకృషి: పెండిమిథాలిన్ 30శాతం లేదా అలాక్లోర్50 శాతం ఎకరాకు లీటరు చొప్పున ఏదైనా ఒక కలుపు మందును విత్తిన వెంటనే గానీ మరుసటి రోజుగానీ పిచికారి చేయాలి. మొక్కలు మొలచిన 15 రోజులకు అదనపు మొక్కలను తీసివేయాలి. విత్తిన 20నుంచి 25రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి.
ప్రధాన శాస్త్రవేత్త (నూనె గింజలు)
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం
మహబూబ్నగర్ జిల్లా
సెల్నెం: 8008404874
Authorization