రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పత్తి ఏరడం పూర్తయింది. మొదటి రెండుసార్లు ఏరిన పత్తిలో గులాబీరంగు పురుగు నష్టం పెద్దగా లేనప్పటికీ, రైతులు చివరిసారి ఏరిన పత్తిలో అంటే డిసెంబరు నుంచి జనవరి నెలల తీసిన పత్తిలో చాలా చోట్ల గులాబీరంగు పురుగు నష్టం కలిగించింది. పురుగు సోకిన పత్తి రంగు నాణ్యతను కోల్పోవడమే కాకుండా, దూదిలోని గింజలను తినడం వల్ల పత్తి బరువు కూడా బాగా తగ్గిపోయింది. కనుక రైతులకు ఎక్కువ నష్టం వాటిల్లింది. ఈ గులాబీ రంగు పురుగు ఉదృతి లేదా నష్టం ప్రస్తుతం మిగిలి ఉన్న పంట అవశేషాలు (పంట మోళ్లు, జిన్నింగు మిల్లులో పత్తిని జిన్నింగ్ చేయగా వచ్చే పత్తి గింజలు, వ్యర్ధాలు మొదలుగునవి) నిల్వ చేసిన పత్తిద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందకుండా కొన్ని ముఖ్యమైన నివారణ చర్యలు ప్రస్తుత దశలో తప్పకుండా చేపట్టాలి. తద్వారా గులాబీ పురుగు ఉనికి బాగా తగ్గి వచ్చే పంట ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ప్రస్తుత పత్తి పంటలో ఈ కింది చర్యలు పత్తి సాగు చేసే అన్ని ప్రాంతాల్లో పత్తిని జిన్నింగు చేసే అన్ని మిల్లుల్లో తప్పకుండా చేపట్టాలి. పత్తి పంట కాలాన్ని ఎట్టి పరిస్థితులలో 200 రోజులకు మించి పొడిగించరాదు. నీటి వసతి ఉన్న చోట కూడా జనవరి మొదటి పక్షం కల్లా పత్తి తీత పూర్తి చేసి అనుకూలతను బట్టి స్వల్పకాలిక ఆరుతడి పంటలకు వెళ్లాలి. ముఖ్యంగా పెసర, బొబ్బెర, తెల్ల నువ్వులు అనుకూల పంటలు. పత్తి తీయడం పూర్తయిన వెంటనే పత్తి మోళ్లను పుశువులు, గొర్రెలతో మేపి మోళ్లు ఎండగానే త్వరగా ట్రాక్టర్ ష్రెడ్డర్ లేదా రోటవేటర్ సహాయంతో భూమిలో కలియ దున్నాలి. తద్వరా పత్తి మోళ్లలో మిగిలి ఉన్న పురుగు కోశస్థదశలు నిర్మూలించడమే కాకుండా పత్తి కట్టే భూమిలో మంచి సేందియ ఎరువుగా మారుతుంది. పత్తి మోళ్లను ఏరూపంలోనైనా ఎక్కువ నిల్వ ఉంచకుండా నిర్మూలించడం గులాబీ రంగు పురుగు నివారణకు చాలా ముఖ్యం. పురుగు సోకిన పత్తిని ఎక్కువ కాలం నిల్వ చేయకుండా త్వరగా అమ్మేయాలి. దీంతో నష్టం తగ్గుతుంది. పత్తి మోళ్లను భూమిలో కలియదున్నిన తర్వాత ఎండకాలంలో ఏప్రిల్, మే నెలలో లోతు దుక్కులు చేసినట్టయితే ఇంకా మిగిలిన పురుగు ఆవశేషాలు కూడా నశిస్తాయి.
నీటి వసతి ఉన్న చోట నీరు నిండుగా పెట్టి ఎకండా కాలం దుక్కులు చేసి నట్టయితే భూమిలోపల ఉన్న పురుగు కోశస్థ దశలు సమగ్రంగా నిర్మూలించబడతాయి. పత్తి పంటకు పంటకు మధ్య 4 నుంచి 6 నెలల వరకు భూమిపై ఏమాత్రం పత్తి పంట అవశేషాలు లేకుండా చేయాలి. తద్వారా గులాబీ పురుగు ఉధృతి వచ్చే పంటపై బాగా తగ్గుతుంది. మరీ ముఖ్యంగా జిన్నింగు మిల్లులో పురుగు ఆశించిన పత్తిని జిన్నింగు చేయగా వచ్చిన గింజలను ఇతర వ్యర్థాలను త్వరంగా తొలగించాలి. జిన్నింగు మిల్లుల లోపల, బయట చుట్టు పక్కల పత్తి గింజలను, ఇతర వ్యర్ధాలను కుప్పలుగా పోసి నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలి. పత్తి జిన్నింగ్ సమయంలో, జిన్నింగ్ తర్వాత దూది, గింజలు మిల్లులో ఉన్నంత కాలం గులాబీ రంగు పురుగు లింగాకర్షక బుట్టలను మిల్లులోపల, బయట ఎకరానికి 20 చొప్పున పెట్టి, బుట్టలో పడ్డ తల్లిపురుగులను ఎప్పటికప్ఫుడు వేరు చేసి ఒక గుంతలో వేసి కాల్చాలి. పంట పూర్తయిన వెంటనే పత్తి మోళ్లను భూమిలో కలియదున్నాలి. ఎండాకాలం లోతు దుక్కులు, పంటకు పంటకు మధ్య ఎడం ఎక్కువగా ఉండడం, శుభ్రమైన జిన్నింగు మిల్లు ప్రాంతాలు పత్తిలో గులాబీ పురుగు ఉదృతిని గణనీయంగా తగ్గించడానికి బాగా ఉపకరిస్తాయి.
డా. బి.రాంప్రసాద్, కీటక శాస్త్రవేత్త
ఎ. సుదర్శనం, పత్తి ప్రధాన శాస్త్రవేత్త
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వరంగల్
Authorization