గత 60 ఏండ్లలో వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పంటల ఉత్పత్తులు పెరిగాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాల రూపకల్పన, రసాయనిక ఎరువులు, సస్యరక్షణ మందుల వినియోగం, సాగునీటి వినియోగం, యంత్రీకరణ, ఏక పంటల విధానం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, విధి విధానాలు ఇందుకు తోడ్పడ్డాయి.ఉత్పత్తులు పెరిగినప్పటికీ తదనుగుణంగా ఇతర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సారవంతమైన నేలకోత, భూగర్బజలాలు కలుషితమవడం, అడుగంటడం, వ్యవసాయ కూలీలు వలస పోవడం, పెరుగుతున్నటువంటి ఉత్పత్తి ఖర్చులు మొదలైనవి గ్రామీణ ప్రాంతాల ఆర్థిక సామాజిక పరిస్థితులను గందరగోళపరుస్తున్నాయి. అంతే కాకుండా గత కొద్ది సంవత్సరాలుగా పంటల దిగుబడిలో స్తబ్దత కనిపిస్తున్నది.
రాబోయే తరాల అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడమే సుస్థిరత సిద్ధాంతం. సహజ వనరులను, మానవ వనరులను కాపాడుకోవడం చాలా అవసరం. గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులను, వారి ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడం ప్రధానం. అదే విధంగా భూమి, సహజ వనరులను కాపాడుకోవడం, వాటి ఉత్పాదకతను పదికాలాల పాటు నిలుపుకోవడం ముఖ్యమైనది. పర్యావరణ పరిరక్షణ, సామాజిక భద్రతతోపాటు ఉత్పత్తిదారులకు, కూలీలకు, వినియోగదారులకు, సిద్ధాంత రూపకర్తలకు అందరికీ ఆర్థికంగా నిలదొక్కుకునే వినూత్న అవకాశాలను కల్పించడమే సుస్థిర వ్యవసాయం ముఖ్య ఉద్దేశం.
సహజ వనరులను కాపాడుకోవడమే
సుస్థిర వ్యవసాయం వల్ల సాధించాల్సినవి పర్యావరణ సమతుల్యం, ఆర్థిక ప్రగతి, సామాజిక, ఆర్థిక అసమానత. ఇది అందరి సహకారంతోనే సాధ్యమవుతుంది. ఇందులో వ్యవసాయ అధికారులతోపాటు కూలీలు, పరిశోధకులు, ప్రణాళికలు రచించేవారు, వినియోగదారులు, వ్యాపారస్తులందరూ పాలుపంచుకోవాలి. సుస్థిర వ్యవసాయంలో ముఖ్యమైనది సహజవనరుల ఉత్పాదకతను కాపాడుకోవడం. నీరు, నేల, గాలి, ఇంధనం, వన్యప్రాణులు, సహజవనరులలో భాగం.
భూగర్భజలాలు తగ్గకుండా
కాల్వల కింద వ్యవసాయంలో నీరు పూర్తిగా సద్వినియోగం కావడంలేదు. కాల్వ మొదట్లో రైతులు కావాల్సినదానికన్నా ఎక్కువ నీటిని వాడుతున్నారు. కాల్వ చివరి రైతులకు నీరు అందడం లేదు. ఎక్కువ నీటిని వాడడం వల్ల చౌడుబారుతుంది. మిగతా ప్రాంతాల్లో బావులు, బోర్ల ద్వారా నీటి వాడకం పెరిగి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీని వల్ల భూమిలోని నీటి పొరలు దెబ్బతినడం, ఉప్పునీరు బావుల్లోకి చేరుతుంది. భూగర్భజలాలు తగ్గకుండా నీటిని పొదుపుగా వాడాలి. అదే విధంగా వర్షపు నీరు వృదా కాకుండా సముద్రం పాలుకాకుండా నిల్వచేసుకోవాలి. నీటి వాడకంలో సమస్యలు తగ్గించుకోవాలి.
కాల్వల కింద ఒక పంటకాలంలో వరికి బదులుగా ఆరుతడి పంటలు పండించే విధానం రావాలి. భూగర్భ జలాలను వాడుతున్నప్పుడు సూక్ష్మసేద్య పద్ధతులను పాటించాలి. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలి. ఎక్కడైతే మురుగునీటి సమస్య తీవ్రంగా ఉందో అక్కడ దొరువు విధానం పాటించి మురుగు నీటి వ్యవస్థను మెరుగుపర్చుకోవాలి.మురుగు నీటిలో లవణలు అధికంగా ఉంటాయి. కనుక ఆ తీసేసిన మురుగునీరంతా ఏదో కొంత విస్తీర్ణంలో చేరేలా చేసుకోవాలి. ఆ ప్రాంతాన్ని మామూలు పంటల సాగుకు కాకుండా పశుగ్రాసాలు, అటవీ వ్యవసాయం, వన్యప్రాణుల నివాసంగా అభివృద్ధి పర్చుకోవాలి.
సస్యరక్షణ పద్ధతులు పాటించాలి
పంటలసాగులో నత్రజని ఎరువులను ఎక్కువగా ఉపయోగించినట్లయితే నీటిలో నైట్రేడ్ శాతం పెరుగుతుంది. అదేవిధంగా భాస్వరం కూడా నీళ్లలోకి చేరుతుంది. సస్యరక్షణ రసాయనాలు కూడా నీటిలోకి చేరుతాయి. బావులు, కుంటలు, చెరువులోని నీరు కలుషితమై సమస్యాత్మకంగా మారుతుంది. కనుక వాటి వినియోగంలో మెళకువలు పాటించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించి ఈ సమస్యను తగ్గించుకోవాలి.
అడవులను కాపాడుకోవాలి
అడవులను విచక్షణా రహితంగా నరికి, పంటల సాగు చేస్తున్నారు. దీన వల్ల వణ్యప్రాణుల స్థావరాలు తగ్గిపోయి వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అంతే కాకుండా దీని వల్ల నేల కోత కూడా పెరిగి భూసారం తగ్గుతుంది. ఆ మట్టి వర్షపు నీటితోపాటు కొట్టుకుపోయి ఒండ్రుగా మారడం వల్ల ప్రాజెక్టుల సామర్ధ్యం తగ్గిపోతుంది. నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ఇందుకు ఉదాహరణ. కనుక వన్యప్రాణుల సంరక్షణ జీవవైవిద్యం కాపాడుకోవాలంటే అడవులను కాపాడుకోవాలి.
దుక్కి చేయడాన్ని తగ్గించాలి
గతంలో చాలా వరకు పశువుల సహాయంతోనే చేసేవారు. ఇప్పుడు వ్యవసాయంలో పెట్రోలియం ఉత్పత్తులను ఇంధనంగా ఉపయోగిస్తున్నాం. ఒకేసారి పెట్రోల్ వినియోగం తగ్గించడం సాధ్యం కాదు కనుక ఇతర ఇంధనాలు బయోడీజిల్ వంటివి వృద్ధి చేసుకొని క్రమంగా తగ్గించుకోవాలి. పశుసంపద పెంచుకొని వ్యవసాయానికి ఉపయోగించుకోవాలి. నేలను అధికంగా దున్నడం వల్ల దుమ్ము రూపంలో గాలిలో కలుస్తుంది. ఏదైనా కాల్చివేసినప్పుడు పొగ రూపంలో గాలిలో చేరుతుంది. పురుగు మందుల పిచికారి సమయంలోనూ రసాయనిక ఎరువులు వేస్తున్నప్పుడు కొన్ని చర్యల ద్వారా అవి కూడా గాలిలో కలుస్తాయి. ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం పంటల అవశేషాలను భూమిలోకి చేర్చడం, అధికంగా భూమిని దున్నకుండా ఉండడం, చెట్లను పెంచడం, నేలను కప్పి ఉంచేలా పంటలు లేదా పంటల అవశేషాలను పర్చడం, రసాయనాల వాడకంలో మెళుకువలు పాటించడం, ఎడారి ప్రాంతాల్లో జొన్న, సజ్జ లాంటి పంటలను పెంచి వాటి కంకులను మాత్రమే కోసి చొప్పను అలాగే వదిలేడయం ద్వారా సమస్యలను తగ్గించవచ్చు. వరి తర్వాత దుక్కిచేయకుండానే మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలను లాభసాటిగా సాగుచేయడం జరుగుతుంది. ఈ రకంగా దుక్కి చేయడాన్ని తగ్గించే అవకాశాలను ఇంకా అన్వేషించి ఆచరించాలి.
పర్యావరణానికి హాని జరగకుండా
పంటల సాగు విషయంలో పంటల ఎంపిక, రకాల ఎంపిక ముఖ్యమైనవి. అందుబాటులోని వనరులను సక్రమంగా వినియోగించుకొని సహజ వనరుల మీద అధిక భారం పడకుండా చేతికందే పంటలనే సాగు చేయాలి. చీడపీడలను, నీటి ఎద్దడిని తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోవాలి. పర్యావరణానికి హాని జరగనంత వరకు జన్యుమార్పిడి రకాలను సాగుచేయడంలో తప్పులేదు. కానీ పంటల వైవిద్యాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడూ ఒకే పంటను కాకుండా పంట మార్పిడి పాటించాలి. అనువైన చోట అంతర పంటల విధానాన్ని అనుసరించాలి. దీంతో రైతుల అవసరాలు తీరడంతోపాటు సహజవనరుల మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది. అంతేకాకుండా కలుపు నివారణ, చీడపీడ నివారణ సులభమవుతుంది. భూమిలో తేమ, పోషకాలను కాపాడుకోవచ్చు. రసాయనాల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. పంటలతోపాటు పశువుల పెంపకాన్ని కూడా చేపట్టాలి.
పశుపోషణలో మార్పులు
ప్రస్తుతం పశువుల పెంపకంలో చాలా మార్పులు వచ్చాయి. గతంలో మాదిరిగా పశువులను బయట మేపడం తగ్గిపోతుంది. పాడి పశువులను ఒకే చోట కట్టేసి, వాటి అవసరాలు తీరుస్తూ మన అవసరాలు తీర్చుకుంటున్నాం. ఈ విధానంలో ముఖ్యంగా కొన్ని పశువులను మాత్రమే పెంచుతున్నాం. దీని వల్ల దేశవాళీ జాతులు నశించి పోతున్నాయి. పశువుల ఎంపిక, వాటి పోషణ, పునరుత్పత్తి, ఆరోగ్యం విషయంలో కూడా వస్తున్న మార్పులను గమనించాలి.
కొత్త విధానాలను ఎన్నుకోవాలి
సుస్థిర ఆహార విధానాన్ని రూపొందించాలి. అందుకోసం ప్రణాళికలు కావాలి. ప్రభుత్వాలు కూడా కొత్త విధానాలను ఎన్నుకోవాలి. రైతులకు గిట్టుబాటు ధరలను అందించాలి. రైతులకు సంపూర్ణ లాభం చేకూరేలా చర్యలు చేపట్టాలి. ట్యాక్సులు, వ్యవసాయ రుణాలు, వ్యవసాయ పరపతి విధానాలు, చిన్న, సన్నకారు రైతులకు సహాయంగా నిలబడాలి. కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించకూడదు. మార్కెట్ వ్యవస్థను మెరుగుపర్చాలి. వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు వినియోగించకుండా చూడాలి. వ్యవసాయ కూలీల వలసలు అరికట్టాలి. వీరికి సంవత్సరం పొడుగునా పని కల్పించాలి. సహజ వనరుల సంరక్షణతో పాటు మానవ వనరుల సంరక్షణ కూడా సుస్థిర వ్యవసాయంలో భాగమే.
Authorization