పశువులకు మేతగా ఉపయోగించే పంటలను పశుగ్రాసాలుగా పిలుస్తాం. వీటిని మనం పొలాల్లో సాగు చేయడమే కాకుండా అటవి జాతికి చెందిన మొక్కలను కూడా పశుగ్రాసాలుగా వాడుతూ ఉంటాం. పశువులకు మేతగా ఉపయోగించే పంటలలో ధాన్యపు జాతి, గడ్డిజాతి, పప్పు జాతి పంటలు ముఖ్యమైనవి. పంటకాలాన్ని బట్టి వీటిని ఏకవార్షికాలు, బహువార్షికాలుగా విభజించవచ్చు. మంచి పశుగ్రాసాలను అధిక ఉత్పత్తితో పండించాలంటే ముఖ్యమైన రకాలతో పాటుగా పండించే పరిస్థితులు యాజమాన్య పద్దతులు తెలుసుకోవాలి. నేలకు ఆయా వాతావరణ పరిస్థితులకు అనువైన పంటలను సాగు చేసుకోవాలి.
నీటి వసతి ఉంటే...
1. ధాన్యపు జాతి పంటలైన జొన్న, మొక్కజొన్న, సజ్జ టియోసెంట్ పంటలు వేసుకోవాలి.
2. గడ్డిజాతి పంటలైన నేపియర్, బాజ్రహైబ్రిడ్స్, గినీగడ్డి, పారాగడ్డి, దీనానాథ్ గడ్డి, సిగల్గడ్డి వేసుకోవాలి.
3.పప్పజాతి పంటలైన లూసర్న్, డెస్మాంధిస్, అలసందలు, బర్సీము, గోరుచిక్కుడు, సోయాచిక్కుడు వంటివి వేసుకోవాలి.
వర్షాధారంగా అయితే..
1. ధాన్యపు జాతి పంటలైన జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి, కొర్ర, అరికెలు మొదలుగునవి.
2. గడ్డిజాతి పంటలు. అంజన్గడ్డి, మార్వెల్గడ్డి, రోడ్స్గడ్డి, స్పియర్గడ్డి, సెటీరియాగడ్డి, బ్లూపానిక్గడ్డి, బ్రకారియాగడ్డి, జాన్సన్గడ్డి, సిగల్గడ్డి వంటివి.
3.పప్పజాతి పంటలైన డెస్మాంధిస్, స్టైల్ డెస్మొడియమ్, క్లిటోరియా, సెంట్రో, రైస్బీన్, మాత్బీన్, వెల్వెట్బీన్, స్వోర్డ్బీన్, కందులు, ఉలవలు, చిక్కుళ్లు, అలచందలు, గోరుచిక్కుళ్లు, సోయాచిక్కుళ్లు.
కొండిపాంతాలు, చలిప్రాంతాలైతే...
1. ధాన్యపు జాతి పంటలు: ఓట్స్,రై, బార్లీ, మొక్కజొన్న 2. గడ్డిజాతి పంటలు: కైక్యుగ్రాస్, ట్యూబర్గ్రాస్, రైగ్రాస్, డాక్టెలస్గ్రాస్, సెటేరియా గ్రాస్ 3. పప్పుజాతి పంటలు: బర్సీము, లూసర్స్, సెంజి, షప్తాల్, బీన్స్, క్లోవర్తో పాటు రకరకాల పరిస్థితులకు అనుగుణంగా సాగు చేసే పశుగ్రాసాలు. సంవత్సరం మొత్తం నీటి వసతి ఉంటే హైబ్రిడ్ నేపియర్, లూసర్స్, ఒకే సీజన్లో నీటి వసతి ఉన్నట్లయితే మొక్కజొన్న పంటలు వేసుకోవాలి.తక్కువ వర్షపాతం ఉన్నట్లయితే జొన్న, సజ్జ పంటలు, చవుడు భూములు అయితే రోడ్స్గడ్డి, మిశ్రమ పంటలుగా అలసంద వేసుకోవాలి. తోటలు చెట్లనీడలున్నట్లయితే గినీగడ్డి, స్టెలో, నీరు నిల్వఉండే ప్రాంతాల్లో పారాగడ్డి, బంజరు, పడావు భూముల్లో స్టెలోతోపాటు అంజన్గడ్డి వేసుకోవాలి. ఎండు మేతగా నిల్వ ఉండేవిధంగా అయితే వరిగడ్డి, జనుము, జొన్న, మొక్కజొన్న పంటలు వేసుకోవాలి.
పశుగ్రాసం నిల్వ చేయడం
అనువైన కాలంలో ఎక్కువగా లభించే పశుగ్రాసాన్ని వివిధ పద్ధతులతో నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా నిల్వ చేసిన గడ్డిని పశుగ్రాసం కొరత ఉన్నప్పుడు ఎండాకాలంలో ఏప్రిల్ నుంచి జూలై వరకు పశువులకు మేతగా వేసుకోవచ్చు.
1. 'హే' గా తయారు చేయడం: ధాన్యపుజాతి గడ్డిని గానీ, గడ్డి జాతి పంటలను గానీ లేదా పప్పజాతి పంటలన గానీ పూతదశకంటే ముందు దశలో కోసి వాటిని ఎండబెట్టి కొరత కాలంలో వాడ8ఉకోవడాన్ని హే గడ్డి అంటారు. ఇది లేత ఆకుప్చ రంగులో ఉన్న ఆకులు, కొమ్మలతో తడిలేకుండా ఉంటుంది. ఎక్కువగా ఉన్న పశుగ్రాసాన్ని నిల్వ చేసే పద్ధతుల్లో ఇది చాలా తేలికైనది. ఈ పద్దతితో కాండంలోని నీటి శాతం భాగా తగ్గేవరకు దానిని ఎండబెట్టాలి. పులియడం, బూజు పట్టకుండా తేమ శాతం తగ్గించేవిధంగా చూడాలి. పప్పుజాతి రకాలతో కలిపి లేదా కలపకుండా హేను తయారు చేసుకోవచ్చు. మరోపద్దతి ఏమిటంటే యాంత్రిక పద్ధతిలో ఇనుప కంపెచలను ఉపయోగించి తయారు చేసిన ప్రేములలో గడ్డిని ఎండబెడతారు. బర్సీము, లూసర్స్ గడ్డిని ఈ విధంగా ఎండబెట్టవచ్చు. ఆలస్యంగా కోతలు కోయడం వల్ల పోషకాలు తగ్గుతాయి. పప్పుజాతి మొక్కలలో కోత దశలో ఆకులు కాయలు ఎండి రాలిపోతాయి. వాడబెట్టడం వల్ల కెరొటిన్, క్లోరోఫిల్ పరిమాణం తగ్గిపోతుంది.
2. సైలేజీ తయారు చేయుట: పచ్చిగా ఉండే పశుగ్రాసాన్ని ముక్కలుగా కోసి గాలి లేకుండా పులియబెట్టి, నీరు కూడా లేకుండా ఉండే స్థితిలో నిల్వ చేయడాన్ని సైలేజీ అని అంటారు. ఆక్సిజన్ కూడా లేని పరిస్థితుల్లో నిల్వ చేయడం వల్ల పశుగ్రాసంలోని నీటిలో కరిగే పండిపదార్ధాలన్నీ ఆర్గానిక్ ఆమ్లాలుగా మారి గ్రాసంలోని ఆమ్లపరిమాణాన్ని పెంచుతాయి. ఈ పరిస్థితులలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పెరగవు. దీంతో పోషకాహార నష్టం జరగకుండా నాణ్యత పెరుగుతుంది. పశువులు దీన్ని బాగా తింటాయి, అరిగించుకుంటాయి కూడా. సైలేజీ యొక్క నాణ్యత గడ్డిలోని ఎండు పదార్థం, కరిగించబడే తీపి పదార్ధాలపై ఆధారపడి ఉంటుంది. అదే విధంగా ముడి మాంసకృత్తులకు తీపి పదార్ధాల నిష్పత్తి కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. పంటను 50శాతం పూతదశలో కోసినప్పుడు లేదా పాల దశలో కోసినప్పుడు తయారు చేసే సైలేజీ మంచి నాణ్యతను కలిగి ఉంటుంది.
Authorization