తెలంగాణ రాష్ట్రంలో రసాయన ఎరువుల వినియోగం అధికం. నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల వినియోగ నిష్పత్తి14:3:1. ఇది సిఫారసు చేసిన నిష్పత్తి(4:2:1) కన్నా చాలా అధికం. ఈ అసాధారణ నిష్పత్తి అనేది ఆక్షేపనీయమైనదే గాక దీర్ఘకాలంలో నేల సారాన్ని దెబ్బతీస్తుంది. విచ్చలవిడి రసాయన ఎరువుల వినియోగం వల్ల నేల భౌతిక లక్షణాలైన నీరు ఇంకే గుణం, నీటిని నిల్వ ఉంచుకునే శక్తి, వాయు ప్రసరణ పోషకాలను పట్టి ఉంచే స్వభావాల విధ్వంసం జరుగుతుంది. నేలలు చౌడు, క్షారత్వాన్ని సంతరించుకుంటున్నాయి.
తెలంగాణలో సుమారుగా 1.19లక్షల హెక్టార్ల వరకు చౌడు భూములున్నాయి. వీటిలో అత్యధిక భాగం మహబూబ్నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో ఉంది. పంట పండించే రైతులకు నేల స్వభావం తెలిసి ఉండాలి. ఏ నేలలో ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందో ఒక అంచనా ఉండాలి. ఆయా భూముల్లో చౌడు తీవ్రతను బట్టి మొత్తమే పండక పోవడం, లేకుంటే తక్కువ దిగుబడులు వస్తుంటాయి. ఉదజని సూచన ఏడు కంటే ఎక్కువగా ఉంటే చౌడు నేలలు, చౌడు భూములుగా పిలుస్తారు. చౌడు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు గింజ కూడా మొలకెత్తదు. ఒక వేళ మొలకెత్తినా పంట ఆరోగ్యకరంగా ఉండదు. పంట పండని భూములను సహజంగా మూడు రకాలుగా చూడొచ్చు.
1.పాల చౌడు-తెల్ల చౌడునేలలు,
2. కారు చౌడు-నల్ల చౌడు నేలలు,
3. ఉప్పు చౌడు నేలలు.
పాలచౌడు నేలలు:
ఈ నేలలో ఉదజని సూచిక 7.0 కంటే ఎక్కువ, 8.0 కంటే తక్కువగా ఉండి, లవణ శాతం 4 కంటే ఎక్కువ, సోడియం శాతం 15 కంటే తక్కువగా ఉంటుంది. సోడియం, కాల్షియం, మెగ్నీషియంతో కూడిన లవణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో నేల పైభాగంలో ఎండా కాలంలో తెల్లని ఉప్పు పొంగి ఉంటుంది. అధిక లవణ పరిమాణం కలిగిన నీటిని పైరు సాగుకు వినియోగించినట్టయితే ఈ నేలలు ఏర్పడతాయి. కాలువేసినప్పుడు నేల కుంగడం గమనించవచ్చు. మొక్కలు సరిగ్గా పెరగవు. ఆకులు ముడుకుని ఉంటాయి. చివర్లు ఎండిపోతాయి. ఉప్పాకు మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి.
యాజమాన్యం
నేలపై పేరుకుపోయిన ఉప్పు లేదా తెల్ల చౌడును పారతోచెక్కి తీసేయాలి. నేలను చదును చేసి 20 నుంచి 25 సెంట్లు మడులుగా విభజించి గట్టుగా చేసుకోవాలి. లేదా చిన్నచిన్న మడులుగా చేసి మంచినీటితో తగినంత నీరుబాగా దమ్ముచేస్తే నేలలోని లవణాలు బాగా కరిగిపోతాయి. మిగిలిన నీటిని మురుగు కాల్వల ద్వారా బయటకు తీసేయాలి. సాగునీటికి, మురుగు నీటికి వేర్వేరు కాల్వలు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. లవణస్థాయి పెరగకుండా మంచి యాజమాన్య పద్దతుల ద్వారా ఈ స్థితిని నిలబెట్టుకోవాలి. వీటిలో పచ్చిరొట్ట ఎరువులను పెంచి కలియదున్నాలి. ఎరువులను 25శాతం అధికంగా వేయాలి. ఎకరానికి 40 కిలోల జింకు సల్ఫేటు చివరి దుక్కిలో నాటడానికి ముందుగా వేయాలి. ఈ నేలలో క్లోరైడ్ కలిగిన అమ్మోనియం క్లోరైడ్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను వాడకూడదు. అమ్మోనియం సల్ఫేట్, యూరియా, సూపర్ ఫాస్ఫేట్, డీఏపీతోపాటు ఇతర ఎన్పీకే కాంప్లెక్స్లను వాడుకోవచ్చు.
నల్ల చౌడు నేలలు
ఎక్కువ లవణ శాతం 4 కంటే తక్కువ, మార్పిడి చెందే సోడియం మాత్రం 15 కంటే ఎక్కువగా ఉంటుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే నేలలు, మురికి నీరు పారుదల సరిగ్గా ఉండని నేలలు, ఎక్కువ కాలం తేమ ఉండడం వల్ల మట్టి మృత్తిగా రంధ్రాలు పూడిపోతాయి. ఇవి ఈ నేలలు ఏర్పడడానికి అనువైన పరిస్థితులు.
యాజమాన్యం
నేల ఉదజని సూచిక ఆధారంగా జిప్సంను నేలలో కలిసేలా దున్నాలి. లోపం ఎక్కువగా ఉన్నట్టయితే వరి నాటడానికి 10 నుంచి 15 రోజుల ముందు ఎకరానికి 1.0 నుంచి 1.5 టన్నుల జిప్సం వేసి నీటిని వారం రోజుల పాటు నిల్వ ఉంచి తర్వాత మురుగు కాల్వల ద్వారా నీటిని తీసేయాలి. ఈ పంటకు మామూలుగా వేసే దానికన్నా 25 శాతం అధికంగా ఎరువు వేయాలి. ఎరువులతో పాటు ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. వరి తర్వాత కూడా రెండు మూడు పంటల వరకు క్షారాన్ని తట్టుకునే చెరకు,రాగి, పత్తి వంటి పంటలు వేయాలి. ఈ నేలలు పప్పు జాతి పంటలు, మొక్కజొన్న, నిమ్మ జాతులు వంటివి సాగు చేయడానికి అనుకూలం కావు
ఉప్పుచౌడు నేలలు
ఈ నేలలో ఉదజని సూచిక 7 కంటే ఎక్కువ 8.5 కంటే తక్కువగా ఉంటుంది. లవణం శాతం 4 కంటే ఎక్కువ, మార్పిడి చెందే సోడియం శాతం 15 కంటే ఎక్కువగా ఉంటాయి. సరైన మురుగు నీటి వసతిలేకపోవడం, ఎక్కువ లవణ శాతం ఉన్న నీటితో పంట పండించడం, సరైన నీటి యాజమాన్య పద్దతులు పాటించకపోవడం వల్ల ఈ నేలలు ఏర్పడడానికి అనువైన పరిస్థితులు
యాజమాన్యం
నేలలో చూడడానికి పాలచౌడు కనిపించినప్పటికీ ఇందులో పాలచౌడు, నల్లచౌడు లక్షణాలు రెండూ ఉంటాయి. చౌడు తక్కువగా ఉన్న నేలల్లో జీలుగను పంచి తర్వాత భూమిలో కలియదున్నాలి. బోదె విడిచి బోదెలో సాగు నీరుపెట్టాలి. ఎక్కువ చౌడు ఉన్నట్టయితే జిప్సంను నేలలో పూర్తిగా కలిసేలా వేయాలి. మూడు లేదా నాలుగు సార్లు నీరుపెట్టి నేలలో ఇంకేలా చేయాలి. ఆఖరి దుక్కిలో నీరు అధికంగా పెట్టి దమ్ముచేసి మురుగు నీరు తీసేయాలి. ఏ పంట నుంచి అయినా అధిక దిగుబడి సాధించాలంటే అది నేల సామర్థ్యంపైన ఆధారపడి ఉంటుంది. నేలలు తేమలోని పోషకాలను పంటలకు అందించి మనం చేసే యాజమాన్యానికి అనుగుణంగా దిగుబడులను అందిస్తాయి. కనుక తక్కువ నీటి ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలంటే మనకున్న వనరులైన అంటే నేలలపైన అవగాహన తప్పనిసరి. భూమిలోని సమస్యలపై, సారంపై అవగాహన ఉంటే ఎరువులపై వృధా ఖర్చు తగ్గించుకుంటూ సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ అధిక లాభాలను సాధించవచ్చు. ఈ దిశలో భూసార పరీక్షలు సరైన మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయి.
మన రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో వ్యవసాయ శాఖ, మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో భూసార పరీక్ష కేంద్రాలున్నాయి. కొన్ని జిల్లాల్లో మండల స్థాయిలో కూడా మినీ సాయిల్ టెస్టింగ్ లాబ్స్లు అందుబాటులో ఉన్నాయి. ఈ భూసార పరీక్ష ఫలితాలను రైతులు నేరుగా తమ వ్యవసాయ అధికారి ద్వారాగానీ, ఇంటర్నెట్ ద్వారాగానీ ఫలితాలను పొందాలనుకున్న రైతులు నమూనాలకు సంబంధించిన యూనిక్ ఐడీ నెంబరు జాగ్రత్తపర్చుకోవాలి. ఈ యూనిక్ ఐడి 15 అంకెలు. దీనిలో మొదటి నాలుగు అంకెలు నమూనా తీసిన సంవత్సరాన్ని సూచిస్తాయి. తర్వాత మూడు అక్షరాలు జిల్లాలను సూచిస్తాయి. తర్వాత రెండు అంకెలు మండలాన్ని, ఆ తర్వాత నాలుగు అంకెల నమూనా సంఖ్యను సూచిస్తాయి. ఈ యూనిక్ ఐడి ద్వారా రైతు ఎక్కడి నుండైనా తన భూమికి సంబంధించిన భూసార ఫలితాలను సాయిల్ హెల్త్ కార్డు రూపంలో పొందవచ్చు.
- కె. పావని
ఎమ్మెస్సీ అగ్రికల్చర్
Authorization