ప్రకృతి మనకెన్నో జీవరాసులను ప్రసాదించింది. వీటిలో పంటలకు మేలుచేసే వాటిని మిత్రకీటకాలంటారు. వీటి వల్ల పంటలో సహజ వాతావరణం ఏర్పడి మొక్కలు ఆరోగ్యంగా ఉండి దిగుబడులు పెరుగుతాయి. ఇలాంటి సుక్ష్మాతిసూక్ష్మజీవులు స్వతంత్రంగా లేదా మొక్కలతో కలిసి జీవిస్తాయి. వాతావరణం, నేల నుంచి మొక్కలకు కావలసిన పోషకాలను అందుబాటులోకి తెచ్చే స్థితిని కల్పిస్తాయి. తద్వారా రసాయనిక ఎరువుల వాడకం ద్వారా ఏర్పడే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తూ భూమిలో పోషకాల సమతుల్యతను కాపాడి తక్కువ ఖర్చుతో సుస్థిర, అధిక దిగుబడులు సాధించేలా రైతులకు సాయపడతాయి. ముఖ్యంగా కూరగాయల పంటల్లో సమగ్ర ఎరువుల యాజమాన్యంలో జీవన ఎరువుల వాడకం ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.
కూరగాయల సాగులో జీవన ఎరువులు వాడడం వల్ల 20 నుంచి 25 శాతం వరకు రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది. నేల, వాతావరణం నుంచి నత్రజని, భాస్వరాన్ని గ్రహించి మొక్కలకు అందుబాటులోకి వస్తాయి. పంటపై సస్యరక్షణ ఖర్చులు తగ్గించవచ్చు. పంట నాణ్యత, దిగుబడులు 10 నుంచి 20 శాతం పెరుగుతాయి. జీవన ఎరువుల వాడకం వల్ల వేర్లు సమృద్ధిగా పెరిగి తద్వారా మొక్కలకు నీరు పీల్చుకునే సమర్ధ్యం పెరగడంతో, మొక్కలకు నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి పెరుగుతుంది. భూమిలోని వ్యాధికారక సూక్ష్మజీవులను నశింప చేసి మొక్కలకు రక్షణ కల్పిస్తాయి. మొక్కలలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మొక్కలకు పోషకాలను విరివిగా అందించేటట్టు చేయడమే కాక నేలలో పోషక పదార్ధాలను స్థిరీకరించి భూసారాన్ని పెంచుతాయి. పంటలకు వాడే పద్ధతి సులభంగా ఉంటుంది. వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. జీవన ఎరువులు మోతాదుకు మించి వాడినా, పంటకుగానీ, నేలకు గానీ, వాతావరణానికా గానీ ఎలాంటి నష్టం ఉండదు.
జీవన ఎరువుల రకాలు
వాతావరణంలో సుమారు 78శాతం నత్రజని ఆవరించి ఉంది. ఈ నత్రజనిని పంటలకు ఉపయోగపడే విధంగా మార్పు చేయడమే జీవన ఎరువుల వినియోగంలో పరమార్థం. ప్రస్తుతం మనకు రెండు రకాల జీవన ఎరువులు వాడకంలో ఉన్నాయి.
1. మొక్కలకు నత్రజని అందించే సూక్ష్మజీవులైన నైట్రో బ్యాక్టీరియా 2. భాస్వరాన్ని అందించే జీవరాసులు.
రైజోబియం: ఈ బ్యాక్టీరియాను ముఖ్యంగా బఠాణి, చిక్కుడు, ఫ్రెంచి చిక్కుడు వంటి కూరగాయలకు వాడతారు. కానీ కూరగాయల వేర్లలో బుడిపెలుగా ఏర్పడి వాటిలో సహజీవనం చేస్తూ, గాలిలోని నత్రజనిని మొక్కకు అందుబాటులో ఉండేలా చేస్తాయి. దీనితో పాటు 16 నుంచి 32 కిలోల నత్రజనిని భూమిలో నిల్వచేసి ఆ తరువాత మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
వాడే విధానం: ఒక లీటరు నీటిలో 50గ్రా. బెల్లం లేదా చక్కెరను కరిగించి15 నిమిషాలపాటు వేడిచేసి చల్లార్చాలి. ఆ ద్రావణానికి 20 గ్రా. 'రైజోబియం కల్చర్' కలిపి విత్తనానికి పట్టించి ఆరబెట్టి విత్తాలి.
అజటోబాక్టర్: ఇవి స్వతంత్రంగా జీవించే సూక్ష్మజీవులు. ఇవి మొక్కలపై ఆధారపడకుండా స్వతంత్రంగా నేలలో నివసిస్తూ గాలి నుండి నత్రజనని స్వీకరించి మొక్కలకు అందజేస్తాయి. కూరగాయల పంటలలో పెరుగుదలకు కావాల్సిన హార్మోన్లు, విటమిన్లు ఉత్పత్తి చేస్తుంది. పంటలకు అజటోబాక్టర్ వాడడం వల్ల అధిక దిగుబడులు ఉదాహరణకు బెండ 83 శాతం, వంగ 89 శాతం, కాలిప్లవర్ 103 శాతం సాధించవచ్చని పరిశోధనా ఫలితాలు తెలుపుతున్నాయి.
వాడే విధానం
నారు ద్వారా అయితే ఒక కిలో జీవన ఎరువును 10 లీటర్ల నీటిలో కలిపి ద్రావణం తయారు చేయాలి. ఒక ఎకరానికి సరిపడే నారును చిన్న చిన్న కట్టలుగా కట్టి ఈ మిశ్రమంలో 15 నుంచి 20 నిమిషాలుంచి, ఆ తరువాత మొక్కలు నాటాలి. నేల ద్వారా అయితే 2 నుంచి 3 కిలోల అజటోబాక్టర్ను 40 నుంచి 60 కిలోల మట్టితో గానీ లేక సేంద్రియ ఎరువులోగానీ కలిపి పంట విత్తే ముందు నేలలో తేమ ఉండే విధంగా చూసుకొని చల్లాలి. ఈ జీవన ఎరువు భూమిలో సేంద్రియ పదార్ధం ఎక్కువగా ఉన్నప్పడు మాత్రమే సమర్ధవంతంగా ఉపయోగపడుతుంది.
అజోస్పైరిల్లం
వీటిని సహవాసి సూక్ష్మజీవులు అని అంటారు. ఇవి వివిధ పంటల వేర్ల మీద లేదా వేర్ల దగ్గర జీవిస్తాయి. ఇవి గాలిలో నత్రజని తీసుకొని వేర్ల మీద స్థిరీకరించుకోగలవు. వేర్ల దగ్గర అవసరమైన హార్మోన్లను విసర్జించడం వల్ల మొక్క చురుకుగా పెరుగుతుంది. ఇవి ఎకరానికి 8 నుంచి 16 కిలోల నత్రజనిని స్థిరీకరించగలవు. వీటిలో అజోస్పైరిల్లం, లిఫోఫెరమ్ రకాలు అనువైనవి. ఈ రెండు రకాలను టమాట, వంగ, బెండతోపాటు ఇతర కూరగాయల పంటలకు వాడవచ్చు. ఈ జీవన ఎరువును వాడి ఎకరానికి 25 నుంచి 30 శాతం వరకు మనం వేసే నజ్రనిని ఆదా చేసుకోవచ్చు. ఈ కల్చర్ను కూడా అజటోబాక్టర్ వాడే పద్ధతిలోనే అదే మోతాదులో ఉపయోగించి, మంచి దిగుబడులు పొందవచ్చు. అజటోబాక్టర్ కన్నా ఎక్కువ నత్రజనని స్వీకరించి తక్కువ సేంద్రియ పదార్ధంగల నేలల్లో కూడా బాగా వృద్ధి చెందుతుంది.
ఫాఫ్ఫోబ్యాక్టీరియా
వీటిని ఫాస్ఫరస్ సాల్యబులైజింగ్ మైక్రోఆర్గానిజమ్స్ అంటారు. వీటిలో బాసిల్లస్, సూడోమోనాస్ సూక్ష్మజీవులు, ఆస్పర్జిల్లస్, పెన్సిలియం శిలీంద్రాలు ముఖ్యమైనవి. ఇవి వేసవిలో స్వతంత్రంగా జీవిస్తాయి. వీటి నుండి తయారయ్యే సేంద్రియ అమ్లాల వల్ల భూమిలో బిగుసుకుపోయి లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరాన్ని ట్రైకాల్షియం ఫాస్ఫేట్ రూపంలో మొక్కలకు లభ్యమయ్యే రీతిలో మారుస్తాయి. మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తాయి. మొక్క వేర్ల దగ్గర వీటి చర్య చురుకుగా ఉండి జీవ క్రియకు తోడ్పడతాయి. వీటి వాడకం వల్ల సిఫార్సు చేసిన మోతాదు నుంచి ఎకరానికి 10 నుంచి 12 కిలోల భాస్వర పోషకం తగ్గించవచ్చు. ఈ ఫాస్ఫోబ్యాక్టీరియాను అన్ని కూరగాయ పంటల్లో వాడుకోవచ్చు.
వాడే విధానం
200 నుంచి 400 గ్రా ఫాస్ఫోబ్యాక్టీరియా ఎరువును ఎకరానికి సరిపడే విత్తనానికి పట్టించవచ్చు. 1 నుంచి 2 కిలోల కల్చర్ను సుమారు 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేల దుక్కిలో వేసుకోవచ్చు.
వెసిక్యూలర్అర్బస్కులర్ మైరోరైజా (వి.ఎ.ఎం.)
ఈ శిలీంధ్రాన్ని మైరోరైజా అనే పేరుతో పిలుస్తారు. వీటిలో గోబస్ జిగాస్పోరా శిలీంధ్ర రకాలు ముఖ్యమైనవి. ఇవి వేరు మండలం మీద మొక్కలతో కలిసి జీవిస్తాయి. మైరోరైజా శిలీంద్రపు మూలాలు (పైఫేలు) వేర్లలో వాటిపై పొరలలోకి, లోపలి పొరలలోనికి కూడా చొచ్చుకొనిపోగలవు. ఇవి ఆహారానికి మొక్కలపై ఆధారపడతాయి. దీనికి బదులుగా ఇవి నేల నుండి భాస్వరాన్ని మొక్కలకు అందిస్తాయి. ఈ ప్రక్రియలో శిలీంద్రం కన్నా మొక్క అధిక లాభాన్ని పొందుతుంది. ఈ శిలీంద్రం భాస్వరాన్ని గ్రహించి, నిల్వ ఉంచి అవసరమైనప్పుడు మొక్కకు అందిస్తుంది. వేరు వ్యవస్థ చుట్టూ ఈ శిలీంద్రం ఒక రక్షణ కవచం వలే ఏర్పడి రోగకారకాలైన సూక్ష్మజీవుల ప్రవేశాన్ని నిరోధిస్తుంది. నీటి ఎద్దడిని తట్టుకోవడానికి కూడా తోడ్పడుతుంది. ఈ కల్చరును కూడా ఫాస్ఫోబ్యాక్టీరియా వాడే పద్ధతిలోనే అదే మోతాదులో అన్ని కూరగాయల పంటల్లో వాడవచ్చు.
వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- జీవన ఎరువు ప్యాకెట్లను ఎండ, వేడి తగలని చల్లని నీడ ప్రదేశంలో నిల్వ ఉంచాలి.
- రసాయన ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులతో కలిపి వాడకూడదు.
- నిర్ధేశించి కాలపరిమితిలోపు మాత్రమే వాడాలి.
- జీవన ఎరువులు వేసిన వెంటనే పంటక నీరు పెట్టాలి.
- ఇతర రసాయన ఎరువులకు దూరంగా ఉంచాలి.
- జీవన ఎరువులను దిబ్బ ఎరువుతోగానీ, కంపోస్టు ఎరువుతోగానీ కలిపి వాడితే మంచి దిగుబడులు వస్తాయి.
- కె. భవ్యశ్రీ
అసిస్టెంట్ ప్రొఫెసర్ అగ్రికల్చర్ కాలేజీ, సిరిసిల్ల
Authorization