మన రాష్ట్రంలో చెరకు పంటను సుమారు 50వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. 37లక్షల టన్నుల చెరకు ఉత్పత్తి అవుతున్నది. చెరకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, బగాస్సే, మొలాసిస్, ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతున్నాయి. అధిక చెరకు దిగుబడితోపాటు ఎక్కువ పంచదార పొందడానికి అనువైన శీతోష్ణస్థితులు, రకములు, సాగు భూమి, సాగు పద్ధతులు, సస్యరక్షణ చర్యలు, సాగునీటి నాణ్యత అనే ఆరు అంశాలు ప్రభావితం చేస్తాయి.
వాతావరణం: ఎక్కువ సూర్యరశ్మి, వర్షపాతం, గాలిలో తేమ హెచ్చుగా ఉన్నప్పుడు చెరకు ఏపుగా పెరుగుతుంది. రాత్రి కన్నా పగటి వేళలు అధికంగా ఉంటే అనుకూలం.
నేలలు: నీటి సదుపాయం ఉన్న మెరక భూములు(తోట భూములు) అనువైనవి. తేమను పోషకాలను ఎక్కువ గా నిలుపుకోలేని తేలిక నేలలను (ఇసుక నేలలు) సేంద్రియ పదార్ధాలు(ఎకరానికి 5టన్నుల పశువుల ఎరువు లేక4టన్నుల ఫిల్టర్ మడ్డి) వేసి అభివృద్ధిపర్చి చెరకు నాటుకోవాలి.సారహీనమైన, లోతు తక్కువ కలిగి నేల పైపొర గట్టిపడే భూములను లోతైన దుక్కిచేసి ఎకరానికి 1టన్ను పొడిగా చేసిన వేరుశనగ తొక్కలను లేక వరి ఊకవేసి అభివృద్ధి చేసుకోవాలి. చౌడు భూముల్లో చెరకు నాటేటప్పుడు ముందుగా లవణాలను మురుగునీటి కాల్వల ద్వారా తీసివేయాలి. లవణ పరిమితి నేలలో సెంటీ మీటరుకు 2 మిల్లీ మోస్లకన్నా ఎక్కువ ఉండకూడదు.క్షార భూములకు జిప్సం వేసి నాటుకోవాలి.
విత్తనం ఎంపిక: పూత పూయని చెరకుల చిగురు భాగంగాని 7నుంచి 8 నెలల వయసు ఉన్న లేవడి తోటల చెరకుగానీ మూడు కండ్ల ముచ్చెలుగా కొట్టి విత్తనంగా వాడాలి. 90సెం.మీల ఎడంతో ఉంటే చాళ్లలో విత్తుటకు ఎకరానికి 16వేల మూడు కండ్ల ముచ్చెలను నాటాలి. 200 లీటర్ల నీటికి 125గ్రా. కార్బెండిజమ్ లేదా 600మి.లీ మలాథియాన్ కలిపిన ద్రావణంలో 15 నిమిషాలు ఉంచి నాటినట్టయితే పొలుసుపురుగు, అనాసకుళ్లు తెగులును అరిక్టవచ్చు.
ప్రత్యేక విత్తనపు తోటల పెంపకం: ముదురు చెరకుల మధ్య భాగం నుండి మూడు కండ్ల ముచ్చెలను తీసుకోవాలి. వీటిని వేడి నీటిలో 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 30 నిమిషాలు లేదా తేమతో మిళితమైన వేడి గాలిలో 54డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద రెండున్నర గంటలు ఉంచి శుద్ధి చేయాలి. శుద్ధి చేయడం ద్వారా కాటుక, ఆకుమాడు, గడ్డి దుబ్బు తెగుళ్లను నివారించవచ్చు. శుద్ధి చేయబడిన విత్తనాన్ని మాత్రమే లేవడి తోటల పెంపకానికి వాడుకోవాలి. సిఫార్సు చేసిన నత్రజనిని నాటిన 30వరోజు, 60వ రోజు రెండు సమపాళ్లలో వేయాలి. ఎకరానికి 20కిలోల భాస్వరం, 20కిలోల పొటాష్ను నాటే సమయంలో వేసుకోవాలి.ఈ విత్తనానికి వేడినీటి శుధ్ది అవసరం లేదు.
నాటే సమయం: తెలంగాణలో చెరకు పంటను ఆగస్టు నుండి సెప్టెంబరు నెల వరకు నాటుకోవచ్చు.
నాటే విధానం: బోదెలలో నీరు పెట్టి ఇంకిన తర్వాత వెనుకకు నడుచుకుంటూ, అన్ని కళ్లూ పక్కకు ఉండేటట్టు 2 సె.మీ లోతు మించకుండా నాటాలి.
బోదెలు, కాల్వ పద్దతి: బోదెలు కాల్వల పద్దతిలో నేలను మెత్తటి దుక్కి చేసి ఎత్తు పల్లాలు లేకుండా చదును చేసిన తర్వాత కర్ర నాగలితో గానీ రెక్క నాగలితోగానీ ట్రాక్టర్తో నడిచే రిడ్జ్ నాగలితోగానీ 90 సె.మీ వెడల్పు, 20 సె.మీ లోతుగల కాలువలను వేసుకోవాలి.
దూరపు చాళ్ల పద్దతి: బిందు సేద్య పద్దతిలో యాంత్రీకరణను అవలంబిస్తూ చెఱకును సాగు చేసేందుకు దూరపు చాళ్ల పద్దతి అనువైనది. ఈ పద్దతిలో చాళ్లను 4 లేదా 5 అడుగుల దూరంలో వేసి సిఫారసు మేరకు ఎకరానికి 20 వేలు రెండు కళ్ల ముచ్చెలను నాటి సాగు చేసుకోవచ్చు. దీని వల్ల విత్తనం ఆదా అయి అంతర పంటల సాగుకు కూడా అనువుగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో డ్రిప్ పద్దతి ద్వారా నీటిని సమర్ధవంతంగా పొదుపుగా ఉపయోగించుకోవచ్చు.
అంతర పంట సాగు: చెఱకును దూరపు చాళ్లలో సాగు చేసే సందర్భంలో అంతర పంటలుగా పప్పుధాన్యాపు పంటలు, కూరగాయలు, టమాట, ఉల్లి, ఆలుగడ్డ, తీగజాతి కూరగాయలు పుచ్చ, చిక్కుడు, తీగ కూరగాయలు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. చెఱకు నాటిన రోజునే బోదెలను చదును చేసి అంతర పంటలను బోదెల మీద వరుసల్లో నాటుకోవాలి. పుచ్చ, తీగజాతి కూరగాయలను ఒక వరుసలో నాటుకోవాలి. జంట చాళ్ల పద్దతిలో చెఱకును నాటినప్పుడు అంతర పంటల సాగు మరింత అనుకూలంగా ఉంటుంది.
నీటి యాజమాన్యం: చెఱకు పంటకు సుమారు 1900 నుంచి 2700 మి.మీ నీరు అవసరం అవుతుంది. పంట మొదటి నాలుగు నెలలను బాల్యదశ లేక పిలకలు పెట్టే దశ అంటారు. పిలకలు పెట్టే దశ అత్యంత కీలకమైన తేమ సున్నిత దశ. ఈ దశలో నీటి ఎద్దడి వల్ల పిలకల సంఖ్య తగ్గి గడ బరువు, దిగుబడి తగ్గుతుంది. కనుక ఈ దశలో పంటకు ఆరు రోజులకొకసారి నీరు పెట్టాలి.సాంప్రదాయ పద్దతిలో బోదెలు, కాల్వల పద్దతిలో నీరు పెట్టుకోవచ్చు. బిందు సేద్య పద్దతి అవలంబించడం ద్వారా పరిమిత నీటి వనరులను పొదుపుగా వాడుకోవచ్చు.
కలుపు నివారణ అంతర కృషి: ముచ్చెలు నాటిన వెంటనే మూడో రోజున అట్రజిన్ 50 శాతం పొడి మందును ఎకరానికి రెండు కిలోలు లేదా 70 శాతం డబ్ల్యు పి గల మెట్రిబుజిన్ 600 గ్రా. మందును లేదా 23.5శాతం ఇసి గల ఆక్సీఫ్లోరోఫిన్ 400 మి.లీ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారి చేసి కలుపును నివారించుకోవచ్చు. తోట నాటిన 30 నుంచి 50 రోజుల వ్యవధిలో అవసరాన్నిబట్టి 2 నుంచి 3 సార్లు గొర్రుతో లేదా దంతెతో అంతర కృషి చేయాలి. లేదా కూలీలతో కలుపు తీయించాలి. ఎకరానికి 500 గ్రా. 2,4డి సోడియం సాల్ట్ 80 శాతం పొడిమందు ఒక లీటరు గ్రామోక్సోన్ 24 శాతం మందును 450 లీటర్ల నీటిలో కలిపి చెఱకు ఆకులపై పడకుండా వరుసల మధ్య మాత్రమే నాటిన 40 నుంచి 60 రోజులకు పిచికారి చేయాలి. తుంగ జాతి కలుపు అధికంగా ఉన్న సందర్భంలో ఎకరానికి 36 గ్రా. హేలోసల్ఫ్యురాన్ మిథైల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
Authorization