ఉదయం పదకొండు గంటల సమయం... అందరూ ఎవరి పనిలో వారు ఉన్నారు. కొంత మంది మహిళలు మాత్రం గొంపుగా నిలబడి ఏవో చర్చించుకుంటున్నారు. వారిలో ఇద్దరు, ముగ్గురు మగవారు కూడా ఉన్నారు. అటుగా వెళుతున్న ఓ యూనియన్ నాయకుడు ఆ మహిళా గుంపును గమనించాడు. వారేదో సమస్యతో బాధపడుతున్నాడని విషయం తెలుసుకోడానికి వెళ్ళాడు.. తమ కాంట్రాక్టర్ నుంచి 50 వేల వరకు పీఎఫ్ డబ్బు రావల్సి ఉంది. కాంట్రాక్ట్ గడువు ముగిసినా పైసలు ఇవ్వలేదు. విషయం తెలుసుకున్న ఆ యూనియన్ నాయకుడు వారికి అండగా నిలబడ్డాడు. ధైర్యం చెప్పాడు. వారితో యూనియన్ పెట్టించాడు. బుద్ద పూర్ణిమ ప్రాజెక్ట్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్(సీఐటీయూ)గా వారందరూ పోరాటం చేసి వారికి రావల్సిన పీఎఫ్ డబ్బును రప్పించుకున్నారు. ఇది 2013 నాటి మాట.
అప్పటి నుంచి వారికి ఎలాంటి సమస్య వచ్చినా యూనియన్ అండగా నిలబడుతోంది. ఆనాడు పీఎఫ్ కోసం చేసిన పోరాటంలో మహిళలు గట్టిగా నిలబడ్డారు. మహిళలు ఇలా ధైర్యంగా మాట్లాడడం, సమస్యపై పోరాడడం కాంట్రాక్టర్కు నచ్చలేదు. వీరి ఐక్యత ఇలాగే కొనసాగితే కష్టమనుకున్నాడు. వెన్నులో వణుకు పుట్టింది. దాంతో సమస్యలపై గట్టిగా మాట్లాడుతూ, చురుగ్గా పని చేస్తున్న మహిళలను ఉద్యోగం నుంచి తొలగించాడు. దాంతో మళ్ళీ యూనియన్ అండతో కాంట్రాక్టర్ను నిలదీశారు. తొలగించిన మహిళలను డ్యూటీలోకి తీసుకోక తప్పలేదు. కొన్ని రోజులు బాగానే గడిచింది. కానీ కాంట్రాక్టర్ భయం మాత్రం అలాగే ఉంది.అయితే గట్టిగా మాట్లాడంతో రవాణా సౌకర్యం లేని సంజీవయ్య పార్క్కు వారిని బదిలీ చేశాడు. ఆ పార్కులో ఉదయం ఆరు గంటలకు పని ప్రారంభమవుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఊరుకోరు. అక్కడకు వెళ్ళడానికి ట్రైన్, బస్సు సౌకర్యం ఉండదు. గంటకో ట్రైన్ ఉంటుంది. బస్సు ఎక్కాలంటే సుమారు మూడు కిలో మీటర్లు నడవాలి. రాత్రి సమయంలో 10 గంటలకు డ్యూటీ దిగితే ఇంటికి పోయే సరికి పన్నెండు అయ్యేది. మహిళలు రాత్రి సమయంలో ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంటే ఎన్నో సమస్యలు ఎదురయ్యేది. ఇన్ని సమస్యల మధ్య అలాగే కాలాన్ని నెట్టుకొచ్చారు. దాంతో మళ్ళీ సీఐటీయూ అండతో పోరాటం చేస్తే లుంబినీ, ఎన్టీఆర్ గార్డెన్కు మార్చారు.
కొంత కాలానికి బ్యాంకు అకౌంట్లో జీతాలు అన్నారు. కానీ ఎంత పడుతుందో తెలియదు. ఒక్కోసారి అందులో ఉన్న డబ్బు కార్మికులకు సంబంధం లేకుండానే మాయమైపోతుంది. ఓసారి ఇప్పటి కాంట్రాక్టర్ వీరితో ఖాళీ ఓచర్లపై సంతకాలు చేయించుకున్నాడు. ఎందుకని అడిగితే బెదిరించాడు. నెలలకు ఇద్దర్ని చొప్పున్న యూనియన్లో చురుగ్గా పనిచేస్తున్న శోభ, జ్యోతి, ఆరోగ్యమ్మ, శోభారాణితో పాటు మరికొందరిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఎక్కడ ఉద్యోగాలు పోతాయో అనే భయంతో కొందరు సంతకాలు చేశారు. కాంట్రాక్టర్ ఆ ఓచర్లను లెబర్ ఆఫీస్లో సబ్మీట్ చేసి పీఎఫ్ డబ్బులు కార్మికులు తీసుకున్నట్టు లెక్కలు చూపించాడు. తమకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న కార్మికులు దీని గురించి లేబర్ ఆఫీస్కు వెళితే 'ఏమిటో తెలుసుకోకుండా సంతకాలు ఎందుకు చేశారు' అని అక్కడి అధికారులు కార్మికులనే నిందిస్తున్నారు. వీరిని మోసం చేసి కాంట్రాక్టర్ను మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. దాంతో కేసు కోర్టు వరకు వెళ్ళింది. అప్పుడు దారికి వచ్చిన కాంట్రాక్టర్ 'నాతో ఒప్పందం చేసుకుని కార్మికులంతా లెటర్లు రాసుకుంటే మీ ఉద్యోగాలు మీకు ఇస్తారు. మీకు రావల్సిన పీఎఫ్ డబ్బులు కూడా ఇస్తాను' అని హామీ ఇచ్చాడు. దాంతో ఉద్యోగం పోయిన కార్మికులందరూ ఒప్పందం కుదిరినట్టు లెటర్లు కూడా రాయించుకున్నాడు. డ్యూటీలోకైతే తీసుకున్నాడు గానీ, ఇప్పటి వరకు పీఎఫ్ డబ్బులు మాత్రం ఇవ్వలేదు. దాని కోసమే ఇప్పుడు మళ్ళీ వారు పోరాటం మొదలుపెట్టారు.
మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు
2013లో సెక్యూరిటీ గార్డ్గా చేరాను. రేణుక శక్తి కాంట్రాక్టర్గా వచ్చిన దగ్గర నుంచి మాకు అన్నీ సమస్యలే. జీతం సమయానికి ఇవ్వరు. ఇంటి అద్దెలు కట్టడానికి అప్పులు చేయాల్సి వస్తుంది. నాకు ముగ్గురు పిల్లలు వారి చదువులు, ఆరోగ్యం ఎలా చూసుకోవాలి. ఇదేం అన్యాయం అంటే బెదిరిస్తారు. పిల్లల అవసరాలకు పనికి వస్తుందని నా అకౌంట్లో వెయ్యిరూపాయలు దాచుకుంటే మాయమయ్యాయి. ఇలా ఎందుకు జరిగిందని కాంట్రాక్టర్ను అడిగితే 'నాకు చెప్పి దాచుకున్నావా నాకు సంబంధం లేదు' అన్నాడు. నా ఏటీఎం పిన్ నెంబర్ ఎప్పుడైనా పని చేయకపోతే ఆయనకు ఫోన్ చేస్తే వెంటనే వేరే పిన్ నెంబర్ చెబుతాడు. నిజానికి పిన్ నెంబర్ ఇవ్వాల్సింది బ్యాంకు వాళ్ళు. ఈయన ఎలా ఇస్తున్నాడు. పైగా ఇప్పటి వరకు నాకు పదిహేను ఏటీఎం కార్డులు ఇచ్చాడు. ఇదంతా మాకు గందర గోళంగా ఉంది. మా అకౌంట్లు ఐసీఐసీఐ బ్యాంకులో ఉంటాయి. వారికీ ఈనకూ ఎలాంటి లావాదేవీలు ఉన్నాయో మాకు తెలియదు. ఆ వెయ్యి రూపాయల గురించి నేను గట్టిగా మాట్లాడినందుకు సంజీవయ్య పార్క్లో డ్యూటీ వేశారు. అక్కడకు బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడ్డాను. నేనే ఇంత ఇబ్బంది పడుతుంటే ఇక మహిళలు అక్కడ ఇంకెన్ని ఇబ్బందులు పడుతున్నారో మీరే అర్థం చేసుకోండి. మళ్ళీ అక్కడ నుంచి హైటెక్ సిటీకి మార్చాడు. ఇలా ప్రశ్నించిన వారిని టార్గెట్చేసి హింసిస్తున్నారు.
- కమలేశ్వర్, యూనియన్ ట్రెజరర్
ఎన్ని సార్లు బెదిరించినా...
2014 మే నుంచి సెక్యురిటీ గార్డ్గా పని చేస్తున్నాను. ఫిజికల్ చెకింగ్ చేయడం నా పని. శ్రీ రేణుక శక్తి సెక్యూరిటీ సర్వీస్ పరిధిలో లుంబినీ, సంజీవయ్య, ఎన్టీఆర్ గార్డెన్లో పని చేసే సెక్యూరిటీ గార్డ్స్ సుమారు వంద మంది వరకు ఉంటారు. మా అందరికీ జీతాలు సక్రమంగా రావు. 40,50 రోజులు దాటితేనేగానీ నెల జీతం ఇవ్వరు. ఈ కాంట్రాక్టర్ వచ్చిన దగ్గర నుంచి పీఎఫ్ డబ్బులు ఎంత జమౌతున్నాయో కూడా మాకు తెలియదు. అడిగితే ఉద్యోగంలో నుంచి తొలగిస్తారు.నేను జీతం, పీఎఫ్ డబ్బుల గురించి గట్టిగా మాట్లాడినందుకు ఉద్యోగం నుంచి తొలగించాడు. యూనియన్గా పోరాడితో తీసుకున్నారు. కానీ చేయని తప్పుకు పార్కులో నుంచి అపార్ట్మెంట్కు బదిలీ చేస్తామని చెప్పారు. నేను ఏ పొరపాటు చేయలేదు. మరి నేనెందుకు వెళ్ళాలి. అందుకే వెళ్లనన్నాను. అయితే నా భర్త కూడా ఇదే కాంట్రాక్టర్ దగ్గర సెక్యూరిటీగా పని చేస్తున్నాడు. నేను గట్టిగా మాట్లాడుతున్నానని ఆయన్ని బెదిరించారు. దాంతో ''మనకెందుకు ఈ గొడవలన్నీ, ఎక్కడ పెడితే అక్కడ చేయోచ్చు కదా, నీ వల్ల నా ఉద్యోగం కూడా పోయేట్టు ఉంది'' అంటూ ఆయన కాస్త బాధపడ్డాడు. కానీ నేను చేసిన మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. కాంట్రాక్టర్ మోసం చేస్తున్నాడు. అన్యాయం జరిగినప్పుడు మాట్లాడడం మా హక్కు అని గట్టిగా చెప్పాను. యూనియన్ నాకు అండగా ఉండడంతో నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు.
- ఎస్.శోభ, జాయింట్ సెక్రటరీ
బిల్స్ ఆపెయ్యాలి
నేను ఎర్రగడ్డ నుంచి వచ్చి ఎన్టీఆర్ గార్డెన్లో సెక్యురిటీగా పని చేస్తున్నాను. మాకు జీతాలు సరిగా ఇవ్వరు. ఇప్పటి వరకు మా పీఎఫ్ డబ్బుల ఊసే లేదు. ఇప్పటికే ఆయన కాంట్రాక్ట్ ముగిసింది. అతను వెళ్ళిపోతే మా పీఎఫ్ పైసలు పోయినట్టే. అందుకే మా డబ్బు ఇచ్చే వరకు అతనికి వచ్చే బిల్స్ మొత్తం ఆపేయమని అడుగుతున్నాం. కానీ అధికారులు బిల్స్ ఆపడం లేదు. వాళ్ళకూ వాళ్ళకూ మధ్య చాలా ఉన్నాయి. మాలాంటి కార్మికుల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. మాతో చాకిరి చేయించుకుంటున్నారు. శ్రమకు తగ్గ ఫలితం మాత్రం రావడం లేదు.
- జె.రమాదేవి
యూనియన్ అండతోనే
గతంలో ఒక్క సెలవు కూడా ఉండేది కాదు. పండగలు వచ్చినా ఇల్లూ, పిల్లల్ని వదిలి డ్యూటీలు చేయాల్సిందే. ఒక్క రోజు సెలవు పెడితే కాంట్రాక్టర్ రెండు రోజుల జీతం కట్ చేసేవాడు. అలాంటి పరిస్థితుల్లో యూనియన్గా పోరాడి మొదట ఒక రోజు, తర్వాత రెండు రోజులు, ప్రస్తుతం నెలకు నాలుగు రోజుల సెలవులను సాధించకున్నారు. జీతం కూడా 6,500 రూపాయల నుంచి 8,500 రూపాయలకు పెంచుకున్నాం. యూనియన్ మాకు అండగా లేకపోతే మా బతుకులు రోడ్డున పడేవి.ఇప్పుడు మా పీఎఫ్ డబ్బు వచ్చే వరకు పోరాటం ఆపేదేలేదు.
- సీహెచ్. ఆరోగ్యమ్మ, యూనియన్ జనరల్ సెక్రటరీ
Authorization