- వృత్తి అంటే బతుకు తెరువు
- వృత్తి అంటే కుటుంబ గడువు
- వృత్తి అంటే ఒకరికొకరు అరువు
- వృత్తి అంటే అవసరాల చెరువు
- వృత్తి అంటే సామాజిక సంబంధాల నెలవు
ఇవన్నీ పాలక వర్గాలకు బరువు...
తెలంగాణ వచ్చింది. మన కష్టాలు తీరినట్టే. ఊరూరా, ఇంటింట పండుగ జేసుకోండ్రి అని ఢంకా మోగించిన తెలంగాణ సర్కార్ వాళ్ళ ఇండ్లలో, వాళ్ళ చుట్టాల, బంధువుల ఇండ్లలో పండుగ తప్ప ప్రజలకు మాత్రం తమ ఇండ్లల్లో పండుగ చేసుకునే పరిస్థితి లేదు. రాష్ట్రంలో 90 శాతం జనాలు తమ తమ చేతి వృత్తుల మీద ఆధారపడి బతికే వారే. కాని తమ కష్టాల గురించి, కన్నీటి గాథల గురించి తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదని గ్రామీణ ప్రజలు లబోదిబో అంటున్నారు. బీసీలు, ఎస్.సిలు, గిరిజనులు, మైనారిటీలు అందరూ వృత్తి మీద ఆధారపడి బతుకులీడుస్తున్నవాళ్ళే. ఒక్క బీసీలే మొత్తం జనాభాలో 52 శాతం ఉంటారు. వారిలో అత్యధిక మంది ఒకరిపై ఒకరు ఆధారపడి బతకాల్సిన పరిస్థితి ఉంటుంది.
నివాసం అంటూ లేదు
నేటికి సంచార కులాలు ఒక ఊరు అంటూ కనీస చిరునామా లేకుండా ఉన్నారంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు వీరికి ఒక స్థావరం ఉండదు. ఉదాహారణకు కోతులు, గంగిరెద్దులోళ్లు, పాములోళ్లు, బాలసంతాల్లు, పెద్దమ్మవాండ్లు, బుడుబుక్కల, చిలక జోష్యం, మొండి బందోల్లు, సాదన సూరులు... ఇలాంటి 36 తెగల ప్రజలు నిత్యం సంచరిస్తూ, అడక్కుతింటూ తమ జీవనాన్ని గడుపుతున్నారు. వీరిని ప్రభుత్వం ఒక్క ఓట్ల కోసం తప్ప మరే విషయంలోనూ గుర్తించడం లేదు. నివాస ధృవీకరణ ఉండదు కనుక కుల ధృవీకరణ, రేషన్కార్డు, పించన్లు, రిజర్వేషన్లు, విద్యా,ఉద్యోగాలు... ఏమీ ఉండవు.
ఉద్యోగ అవకాశాలు తక్కువ
అన్నీ కులాలు కలిపి విద్యా, ఉద్యోగాల్లో 6 నుంచి 7 శాతం మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్స్, ఫీజ్ రీ-ఎంబర్మెంట్స్ వంటివి అందడం లేదు. 7వ తరగతిలోనే ఎక్కువ మంది డ్రాప్అవుట్ అవుతున్నారు. ఇక దళిత, గిరిజనులు వ్యవసాయ వృత్తులపై, పశుపాలనపై ఆధారపడి గడపాలి.
వృతులు అంతరించిన వేళ...
ప్లాస్టిక్ వస్తువులు రావడంతో కుటీర పరిశ్రములు, గ్రామీణ వృత్తులు, పశుపోషణ దాదాపు పూర్తిగా అంతరించి పోయింది. వ్యవసాయంలో దున్ని, దుక్కితోపాటు నాట్లు, పంట కోయడం, నూర్పడం సైతం మిషన్లతోనే జరుగుతోంది. దాంతో కూలీ పనులు దొరకక నగరాలకు వలస రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. నగరాల్లో భవన నిర్మాణం, హౌటళ్ళు, ఆటో రిక్ష, చెత్త ఏరుకోవడం, భిక్షాటన, పారిశుద్ధ కార్మికులుగా అసంఘటిత రంగంలో గడుపుతున్నారు.
ఆకలి చావులు తప్పడం లేదు
భవన నిర్మాణం, రోడ్లు వేయడం, కేబుళ్ళు తవ్వడం, కరెంట్ పోళ్ళు వేయడం లాంటి పనులు కూడా మిషన్లతోనే చేయడం వల్ల కార్మికులకు ఆకలి చావులు తప్పని పరిస్థితి ఏర్పడింది. బ్రిడ్జిల కింద, ప్లాట్ఫామ్ల మీద వీరి నివాసాలు. చాకలి, కమ్మరి, కుమ్మరి, కంసలి, వడ్రంగి, సాలె... వంటి ప్రతి పని మిషన్ల మీద జరుగుతూ పెట్టుబడిదార్లకు దాసోహమైనాయి.
ప్రభుత్వమే ఆదుకోవాలి
ఉమ్మడి రాష్రం ఉన్నప్పుడే ఈ పరిస్థితి ఏర్పడిందన్న విషయం గ్రహితమే. టిడిపి, కాగ్రేస్ ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన హామీలు నెరవేరలేదు అనేది ఎంత నిజమో నేటి టి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలూ నెరవేరడంలేదన్నది అంతే నిజం కనిపిస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడ్డ ప్రజలకు వృత్తి విద్యా కోర్సులు అందించడం, చాకలి, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, క్షౌర... వంటి వృత్తులకు లోన్లు, అవసరమైన పనిముట్లు ఇవ్వడం ద్వారా బతుకడానికి కొంత ఆధారమవుతుందని ఆశ పడే వారికి గత మూడు దశాబ్దాలుగా నిరాశే ఎదురవుతోంది. తెలంగాణ వచ్చి మూడు సంవత్సరాల్లోనే గత పాలకులకు తీసిపోలేదని స్పష్ట మైపోయింది. ఇకనైనా టి.ఆర్.ఎస్ ప్రభుత్వం వీరి గురించి పట్టించుకుని వృత్తుల వారీగా ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరముంది. ఎటువంటి ఆధారం లేకుండా చదువులు మధ్యంతరంగా ఆపివేసిన యువకులుకు స్టేషనరీ, జిరాక్స్, కుట్టుమిషన్లు.... కిరాణ షాపులు వంటి ఎటువంటి శరతులు లేకుండా సబ్సిడీ లోన్లు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరముంది. చిన్న పిల్లలకు ఉచిత నిర్భంధ విద్యా అందించాలి. స్కాలర్షిప్స్, రీ-ఎంబర్స్మెంట్ సౌకర్యాలు కల్పించి ప్రోత్సహించాలని వివిధ సంఘాల ద్వారా డిమాండ్ చేస్తున్నారు.
చాలీ చాలని సంపాదనతో
రాష్ట్రంలో ఎంబీసీల పరిస్థితి ఘోరంగా ఉంది. కొందరు తమ పై కులస్తుల వారికి కాలపురాణాలు చెప్పి అడుక్కు తినాలి. నేటికీ వీరు భిక్షాటన పై ఆధారపడి గడుపుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఉదా హారణకు బుడబుక్కల, పాములోల్లు వీరికి ఇప్పటికీ ఒక ప్రత్యేకమైన కుల నిర్మాణం జరగలేదు. ఇప్పటికీ ప్రభుత్వ గజిట్లో ఎక్కలేదు. విద్యా, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో ప్రవేశం లేదు. వీరికి రిజర్వేషన్లు లేవు. ప్రభుత్వ పతకాలు అందడం లేదు... ఇలాంటి 23 ఆశ్రిత కులాలున్నాయి. చాకలి, మంగళి, గంగపుత్రులు, భట్రాజులు, లకంమారి, కాపుల, మాలి, ఆరె, ఆరోళ్ళు, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, నేత, సాలే, ఉప్పర, మేదర, తదితరులు. వీరంతా నేటికీ చాలీ చాలని సంపాదనతో బతుకుతున్నారు.
- ఆశయ్య, ఎంబీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి
అవకాశాలు కల్పించాలి ముస్లిం మైనారిటీలు చిన్న, చిన్న కుటీర పరిశ్రమలపై ఆధారపడి గడుపుతున్నారు. తెలంగాణ ముస్లింల పరిస్థితి మరీ దారుణం. ప్లాస్టిక్ పూలు, గాజులు, సేమియాలు, బ్రెడ్, బిస్కెట్లు, బీడీలు, అగర్బత్తీలు చేయడం, బట్టలపై చమ్కీలద్దడం వంటి పనులతో గడుపుతున్నారు. సైకిల్ రిపేర్లు, హోటళ్ళలో, దుకాణాలలో, క్రాఫ్ దుకాణాలలో పని చేసి గడిపేవారే అత్యధిక జనాభా ఉంటుంది. తెలంగాణ వస్తే రాష్ట్రంలో మైనార్టీల జీవన స్థితి గతులు మెరుగుపడతాయని ఆశపడ్డాం. ఇకనైనా సబ్ప్లాన్ అమలు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని 12 శాతం రిజర్వేషన్లు కేటాయించి విద్యా, ఉపాధిలో సరైన అవకాశాలు కల్పించాలి.
- అబ్బాస్, ఆవాజ్
- మహేష్ దుర్గే,
సెల్: 9700888972
Authorization