చదివింది పెద్ద చదువులు. పీజీలు, ఇంజనీరింగ్లు పూర్తి చేశారు. సరైన ఉద్యోగం దొరక్క ఉపాధి హామీ పధకం కింద పనిలో చేరారు. అలా చేరిన వారిలో నల్లగొండ జిల్లా, నాయుడుపాలెం గ్రామానికి చెందిన యువకుడు రంజిత్రావు కూడా ఉన్నాడు. ఇతను డిగ్రీ పూర్తి చేసిన వెంటనే కుటుంబ అవసరాల రీత్యా ఉద్యోగానికి ప్రయత్నించాడు. ఉపాధి హామీ అంటే ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా తన ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని ఆశపడ్డాడు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగానే ఇతను కూడా పరీక్షలు రాశాడు. ఇంటర్వ్యూకి వెళ్ళాడు. స్వయానా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసి రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానా ఉద్యోగంలో చేరాడు. చివరకు టెక్నికల్ అసిస్టెంట్గా కాంట్రాక్ట్ ఉద్యోగంలో చేరాడు.
కూలీలను తీసుకురావాలి. పని చేయించాలి. వారికి జీతాలు ఇవ్యాలి. ఇది టెక్నికల్ అసిస్టెంట్ పని. పై అధికారులు టార్గెట్లు పెడతారు. కానీ కూలీలకు ఇవ్వడానికి సరిగా జీతాలు మాత్రం ఇవ్వరు. బిల్లులు రాలేదని చెబుతారు. అప్పుడు వీళ్ళే కూలీలకు నచ్చజెప్పుకోవాలి. రోజువారి కూలిపై బతికే పేదలకు జీతం వస్తే తప్ప కడుపు నిండదు. అవసరమైనప్పుడు, సరైన సమయానికి కూలి ఇవ్వకపోతే వాళ్ళు ఈ పనిలోకి రారు. వేరే పని చూసుకుంటారు. టెక్నికల్ అసిస్టెంట్ తన టార్గెట్ రీచ్ కాకపోతే వేధింపులు, జీతం కత్తిరిస్తారు. ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
పెత్తనం మాత్రం చెలాయిస్తారు
పని చేసే కూలీలకు గడ్డపారలు ఉండవు. ఏదైనా ప్రమాదం జరిగితే మెడికల్ కిట్ అందుబాటులో ఉండదు. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా కూలీలకు సమాధానం చెప్పుకోవల్సింది వీళ్ళే. పై అధికారులు మాత్రం వీళ్ళపై పెత్తనం చెలాయిస్తుంటారు. గ్రామ, మండల స్థాయిలో ఎలాంటి అభివృద్ది కార్యక్రమం తీసుకున్నా ముందు గుర్తుకొచ్చేది ఉపాధి హామీ పధక కార్మికులే. అలాగే ఏ చిన్న పొరపాటు జరిగినా భారం మోయాల్సింది కూడా వీళ్ళే. ఇలా దాదాపు కొన్ని ఏండ్లపాటు రంజిత్ రావు అక్కడే పని చేశాడు.
అన్నీ నష్టపోయి...
2013లో ఉస్మానియా యూనివర్సిటీలో అతనికి పీజీలో సీట్ వచ్చింది. పీజీ పూర్తి చేస్తే ఇంతకన్నా మంచి ఉద్యోగం వస్తుందని అనుకున్నాడు. అదే సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో ఉద్యమం మొదలయ్యింది. అప్పుడే కొత్త రాష్ట్రం వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చాడు. దాంతో ఇతను కూడా ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. కేటీర్ నాయకత్వంలో తెలంగాణ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఏర్పాటు చేసుకుని అందరూ కలిసి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశారు. అప్పుడు తన వంతుగా రంజిత్ యాభైవేలు కూడా ఖర్చు చేశాడు. వచ్చిన పీజీ సీటును వదులుకొని రాష్ట్రం వస్తే ఇన్నేండ్లు చేసిన ఉద్యోగం కచ్చితంగా పర్మినెంట్ అవుతుందని గట్టిగా నమ్మాడు. ఉద్యమంలో పాల్గొన్నాడు.
హామీ ఇచ్చి మాట తప్పారు
చివరకు రాష్ట్రం ఏర్పడింది. కానీ ఇప్పటి వరకు వీరి గురించి పట్టించుకోలేదు. రాష్ట్రం వచ్చిన తర్వాత 2015లో తమ సమస్యలు పరిష్కరించాలని ఉపాధి హామీ ఉద్యోగులందరూ ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అప్పుడు అన్ని ప్రజాసంఘాలు వీరికి మద్దతు పలికాయి. దాంతో కేటీర్ వచ్చి 25 శాతం జీతాలు పెంచుతున్నామని వీరికి హామీ ఇచ్చి, త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరించేందుకు కమిటీ వేస్తున్నామని మాట ఇచ్చాడు. కేటీఆర్ మాటలు నమ్మిన ఉద్యోగులు తమ పోరాటాన్ని అంతటితో ఆపేశారు. ఇప్పటికీ రెండేండ్లు దాటినా కమిటీ సంగతిలేదు, వీరి సమస్యల పరిష్కారం గురించి ప్రభుత్వం ఆలోచించలేదు.
ప్రమోషన్లు ఉండవు
ఈ ఉపాధి హామీ కార్మికులుగా, కూలీలుగా, ఉద్యోగులుగా ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మాత్రమే ఉంటారు. వీరంత సరైన ఉద్యోగాలు దొరక్క కడుపు నింపుకోవడం కోసం మరో దారి లేక ఈ పనిలో చేరుతున్నారు. చాలా మంది పెద్ద పెద్ద చదువుల చదివినా ప్రమోషన్లు ఉండవు. ఎన్నేండ్లయినా ఇలా చాలీ చాలని జీతాలతో ఉద్యోగాలు చేయాల్సిందే. ఇలాంటి కార్మికులంతా కలిసి భవిష్యత్లో మరొక్కసారి పోరాటం చేయాలని, తమ సమస్యల పరిష్కారం అయ్యే వరు ఆ పోరాటాన్ని ఆపకూడదని నిర్ణయించుకున్నారు.
కూలీల పరిస్థితి ఇది
ఉపాధి హామీ పధకంలో ఫారెస్ట్ డిపార్ట్ పరిధిలో నర్సరీలు పెంచే కూలీలు కూడా ఉన్నారు. అడవి సంరక్షణ కోసం మొక్కలు పెంచడానికి వీరిని నియమించారు. వీరు పెంచిన మొక్కల్నే ఖాళీగా ఉన్న మిగిలిన అడవి ప్రాంతానికి తీసుకెళ్ళి నాటుకుంటారు. ఇలాంటి నర్సరీలను ప్రతి అడవి ప్రాంతంలో ''వన్య సంరక్షణ'' పేరుతో ఏర్పాటు చేశారు. ఈ నర్సరీల్లో పనిచేయడం కోసం ఉపాధి హామీ కూలీలనే నియమించారు. వీరందరూ సర్సరీల్లో మొక్కలను సంరక్షిస్తారు. ఒక్క నర్సరీ పరిధిలో సుమారు 30 మంది విధులు నిర్వహిస్తుంటారు. వీరిలో 20 మంది వరకు మహిళా కూలీలే ఉంటారు. మొక్కల్ని అంటుకట్టే పద్ధతి చేసే వారు కొందరైతే విత్తనాల ద్వారా మొక్కలను పెంచే వారు మరికొందరు. విత్తనాల ద్వారా మొక్కలు పెంచేవారు మట్టి కవర్లో పోసి అందులో విత్తనాలు వేసి అవి మొలకెత్తే విధంగా ఎంతో జాగ్రత్తగా ప్యాకింగ్ చేస్తారు.
పైసలు తక్కువ...
ఇలా వీళ్ళు వంద ప్యాకెట్లను ప్యాకింగ్ చేస్తే 80 రూపాయలు ఇవ్వాలి. అంటే ఒక్కో ప్యాకింగ్కి ఎనభై పైసలు ఇవ్వాలన్న మాట. కాని వీరికి కేవలం ఉపాధి కూలీలకు ఇచ్చే పైసలు మాత్రమే చేతిలో పెడతారు. ఒక్క ప్యాకింగ్ ప్రకారం లెక్క వేసి ఇచ్చినా రోజుకు చాలా మొత్తంలో కూలి వీరి చేతికి అందుతుంది. వీరిలో ఒక్కొక్కరూ రోజుకు 150 నుండి 200 ప్యాకింగ్లు చేయగలరు. ఇంకాస్త నైపుణ్యం కలిగిన వారు మూడు వందల ప్యాకింగ్లు కూడా చేయగలరు. కాని వీళ్ళకు కూలి ఇచ్చేటప్పుడు మాత్రం ఉపాధి హామీ కూలీలుగా నియమించుకున్నారు కాబట్టి ఆ ప్రకారమే కూలి ఇస్తారు.
ఎంత ప్రమాదమైనా...
వీరందరూ ఈ నర్సరీలలో పని చేయడానికి ఎక్కడెక్కడి నుండో వస్తారు. వీరికి ఆ పూటకి కొన్ని వసతులు కల్పించాలి. ప్రభుత్వమే వారికి టెంట్, ప్రాథమిక చికిత్సకు కావల్సిన సౌకర్యాలు, భోజన సౌకర్యం కూడా కల్పించాలి. ఇంకా వీరంతా అడవి ప్రాంతంలో పనిచేస్తుంటారు కాబట్టి అనేక ప్రమాదాలు సంభవిస్తుంటాయి. పాములు, విష కీటకాల సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరికి ప్రాథమిక వైద్యం అందుబాటులో ఉండాలి. కాని ఇలాంటి సౌకర్యాలేవీ వీరికి అందుబాటులో ఉండవు. ఎంత ప్రమాదమైనా కూలి చేసుకోవాల్సిందే. లేదంటే రోజు గడవడం కష్టం.మిగిలిన ఉపాధి కూలీలకు సీజన్ల ప్రకారం పని కేటాయిస్తారు. వాస్తవానికి వీరికి 150 పని దినాలు కల్పించాలి. కుటుంబంలో ఇద్దరికి కచ్చితంగా పని కల్పించాలి. చెరువుల పూడిక తీయడానికో, గుంతలు తీయడానికో వీరిని కేటాయిస్తారు. కాని ఈ మధ్య కాలంలో యంత్రాలు వచ్చిన తర్వాత ఉపాధి కూలీలకు సరైన పని దొరకడం లేదు. దాంతో వీరు ఆదాయం లేక పస్తులతో బతకాల్సి వస్తుంది. ఇక నర్సరీల్లో పని చేస్తే కూలీలకు ఆ పని తప్పా వేరే పని కేటాయించారు. సీజన్లో మాత్రం నర్సరీల్లో పని చేస్తారు. అన్సీజన్లో ఈ కూలీలు పని లేకుండా ఖాళీగా గడపవల్సి వస్తుంది.దాంతో వారు సీజన్లో మాత్రమే కాస్త కడుపునిండా తినగలుగుతారు. మిగిలిన సమయంలో పస్తులతో బతకాల్సిందే. అందుకే వీరికి కూడా అన్ని సమయాల్లో పని కల్పించాలి.
నమ్మకం పోయింది
పదేండ్ల పాటు ఉపాధి హామీ పధకం కింద టెక్నికల్ అసిస్టెంట్గా పని చేశాను. ఇప్పటి వరకు అన్నీ నష్టపోయారు. ఉద్యోగం ఉంది కదా అని ఉన్నత చదువు చదవలేకపోయాను. ఇక ఈ ప్రభుత్వంపై నమ్మకం పోయింది. మమ్మల్ని పర్మినెంట్ చేస్తారనే నమ్మకం లేదు. అందుకే ఆరు నెలల కిందట ఉద్యోగం మానేశాను. ప్రస్తుతం సిటీకి వచ్చి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. పీజీలో సీట్ వచ్చింది అది పూర్తి చేద్దామనుకుంటున్నాను. ఉపాధి హామీ ఉద్యోగిగా చేరి నా జీవితంలో పదేండ్లు నష్టపోయాను. పెండ్లి చేసుకునే ధైర్యం లేక చేసుకోలేదు. నేను ఆర్థికంగా నష్టపోపోయింది కాక మరొకరిని నా జీవితంలోకి తీసుకొచ్చి వారిని ఎందుకు ఇబ్బంది పెట్టాలనే ఇప్పటి వరకు పెండ్లి చేసుకోలేదు. ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఇప్పటి వరకు నా సమయాన్ని కోల్పోయాను.
-రంజిత్ రావు
Authorization